రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

15, జనవరి 2016, శుక్రవారం








దర్శకత్వం-మాటలు  : కళ్యాణ్ కృష్ణ

తారాగణం : నాగార్జున, రమ్యకృష్ణ, లావణ్యా త్రిపాఠీ, బ్రహ్మానందం,
చలపతి రావు, సప్తగిరి, నాగబాబు, సంపత్ రాజ్, నాజర్, వెన్నెల కిషోర్,
బ్రహ్మాజీ, ఝాన్సీ, అనసూయ, హంసా నందిని
మూలకథ : పి. రామ్మోహన్ , స్క్రీన్ ప్లే : సత్యానంద్
సంగీతం : అనూప్ రూబెన్స్, పాటలు : రామజోగయ్య శాస్త్రి, భాస్కరభట్ల, బాలాజీ, కేకే, ఛాయాగ్రహణం : పి ఎస్ వినోద్, కూర్పు : ప్రవీణ్ పూడి, కళ : రవిందర్,
నృత్యాలు : రాజూ సుందరం, విశ్వ, రఘు
http://www.filmyfreak.com/
http://www.filmyfreak.com/
బ్యానర్ :  అన్నపూర్ణా స్టూడియోస్, నిర్మాత : నాగార్జున
విడుదల : జనవరి 15, 2016
***
'యూ’ సర్టిఫికేట్ తో వినోదాత్మక సినిమాల్ని ఇహ దాదాపు మర్చిపోవాల్సిందే అనుకుంటున్న సమయంలో సంక్రాంతి కోతకి కొత్త వరి వంగడంలా కసకస లాడుతూ ప్రేక్షకుల  మధ్యకి వచ్చేసిన ‘సోగ్గాడే చిన్నినాయనా’  కోసుకున్నవారికి కోసుకున్నంత వినోదం. కోసుకుంటున్న కొద్దీ కోతకి అందే కొత్త వంగడం. కోసికోసీ అలసిపోవాలే తప్ప తను మాత్రం కర్సవని విందువినోదాల పంట!

        పండగ రోజుకూడా పాత మొగుడేనా అన్నట్టు వచ్చిన పండగ సినిమాల మధ్య  ఏ పాత మొగుడు బెటరని చూస్తే, పండక్కి తగ్గట్టు తెలుగుదనపు  పంచె కట్టుతో అచ్చతెలుగు మాటాడుతూ విచ్చేసిన బంగార్రాజే కన్పిస్తాడు. పండగ మూడ్ కి న్యాయం చేస్తూ, పండగని పండగలా ఉండనిస్తూ, తెలుగు సినిమాని కూడా చాలా కాలానికి దయతల్చి తెలుగు సినిమాలానే  వుండనిస్తూ-  బంగార్రాజు బాక్సాఫీసుకి బాకా వేసి మరీ పసి నుంచీ ముసలి వరకూ పొలోమని బళ్ళు కట్టిస్తాడు. తనెవడో తెలియని పసి కీబోర్డు రాక్షసి వెధవకి, తానింకా ఇంతేనేమోలే  అనుకునే ముసలి నిరాశా జీవికీ,  పల్లెనంతా విప్పి చూపించి- పరికిణీల రెపరెపల కాడ్నించీ కాడెద్దుల గిట్టెల చప్పుళ్ళ వరకూ అన్నీ బతికే ఉన్నాయనీ; అమెరికా వెళ్లి చెడినా, ఆ బంధాల్ని  కలుపుకోవడానికి ఏ టూ జెడ్ మనిషితనం అంతా ఇక్కడే కుప్పపోసి ఉందనీ భరోసా కల్పిస్తాడు.

        కమర్షియల్ సినిమాల  పేరుతో తీస్తున్నవి నిజమైన కమర్షియల్ సినిమాల్లా వుండడం లేదు, కేవలం అవి ఫ్యాన్స్ కీ, పేదవర్గాలకీ పరిమితమైపోయిన ‘మాస్’ సినిమాల్లా ఉంటున్నాయి. ఈ గ్లోబల్ యుగంలో కూడా పేదల్ని ఇంకా పేదలుగానే చూపిస్తూ, వాళ్ళని నిరు పేదలుగానే వుండనిచ్చే రాజకీయం చేస్తూ, నెగెటివిజంతో  ఉత్పత్తి అవుతున్నవే ‘స్లమ్- లేదా బస్తీ’ మార్క్ సినిమాలు. ‘స్లమ్ డాగ్ మిలియనీర్’ డానీ బాయల్ ని చాలా విమర్శించారు- ఇండియా అంటే  కంపుకొట్టే మురికి వాడలే అన్నట్టు చూపించాడని. అవసరం లేదు, టాలీవుడ్ లో  మాస్ (స్లమ్- బస్తీ) సినిమాల పేరుతో  ఈ పని ఎప్పట్నించో జరుగిపోతోంది. ప్రధాని స్వచ్చ భారత్ అంటూంటే తెలుగు సినిమాలు ఆ చెత్తనే చూపిస్తున్నాయి.  ఇహ హైటెక్ సిటీలొద్దూ, లోఫర్ స్లమ్సూ  వద్దూ అనుకుని, పచ్చని పల్లెని చూపించడానికి కూడా దమ్ము కావాలి. ఆ దమ్ముతో మీసం తిప్పుతూ బుల్లెట్ మీద వచ్చినవాడే బంగార్రాజు.

        ఈ బంగార్రాజు - నేను అక్కినేని నాగార్జుననీ- అని ఇగో చూపించి ఈలలు వేయించుకోడు, తనది ఏ వంశపు రక్తమో డైలాగులు చెప్పి చప్పట్లు కొట్టించుకోడు, థియేటర్ని ఒక పార్టీ సభలా మార్చి ఉపన్యాసాలిచ్చి కేరింతలు కొట్టించుకోడు. కృత్రిమత్వంతో సినిమా చూసే అనుభవాన్ని కల్తీ చెయ్యడు. అతనేం చెప్పినా, ఏం చేసినా పాత్ర స్వభావం కొద్దీ మాత్రమే స్వచ్చంగా చెప్పి, చేసి  నవ్విస్తాడు. కేవలం హృదయపూర్వకంగా నవ్విస్తూంటాడు. పాత్రలో అక్కినేని నాగార్జునని చేతనైనంత ఎంజాయ్ చేసుకోనిస్తాడు బంగార్రాజు కూడా. ఈ దశాబ్దపు మర్చిపోలేని కమర్షియల్ క్యారక్టర్ బంగార్రాజైతే, దాన్ని దుక్కిదున్ని పారేసిన స్టార్ నాగార్జున.
                                         ***
ఫాంటసీ లోకి ప్రయాణం 

        చ్చి నరకంలో వున్నాడు బంగార్రాజు. కారణం బతికున్నప్పుడు వూళ్ళో అతను మచ్చలేని మన్మథుడు. కాబట్టి యముడు ( నాగబాబు) నరకంలో సీటు రిజర్వ్ చేశాడు. అక్కడ కూడా కళ్లు తిరిగే మన్మథలీలల్ని చూపిస్తూంటే భూమ్మీదికి నెట్టేశాడు యముడు. భూమ్మీద అప్పటకే బంగార్రాజు భార్య సత్య ( రమ్యకృష్ణ) ఓ సమస్యకి సాయం అడుగుదామని అతడి ఫోటో ముందు వచ్చి నిలబడింది. బంగార్రాజు వచ్చి వాలిపోవడంతో షాకయ్యింది. 



        సమస్యేమిటంటే, అమెరికాలో డాక్టరుగా ఉంటున్న రాము ( యంగ్ నాగార్జున)  భార్య సీత ( లావణ్యా త్రిపాఠీ) తో వచ్చాడు. ఎడమొహం పెడమొహంగా వున్నారు. ఏంటంటే విడాకులు తీసుకోవడానికి వచ్చామన్నారు. షాకయిన సత్య భర్త ఫోటో దగ్గరి కెళ్ళింది. అక్కడకూడా షాక్ తిని ఆత్మరూపంలో ప్రత్యక్షమైన బంగార్రాజుని చూసింది.

        రాము సమస్యకి ప్రత్యక్షంగా సత్య, పరోక్షంగా బంగార్రాజులే కారణం. రాము కడుపులో ఉండగానే చనిపోయాడు భర్త బంగార్రాజు. ఆ భర్తలా నవమన్మథుడు  అవకూడదని, పుట్టిన రాముని ఆడగాలి అస్సలు తగలకుండా నిర్బంధంగా పెంచింది సత్య. ఇప్పుడు పెళ్ళయ్యాకా కూడా డాక్టర్ రాము భార్యగాలి అస్సలు తగలకుండా జాగ్రత్త పడుతున్నాడు, ఏమంటే డాక్టర్ వృత్తిలో క్షణం తీరికలేని బిజీ. మూడేళ్ళుగా అక్షరాలా మూడే సార్లు ముద్దూ ముచ్చటా  తీరిన భార్య సీత, ఇక  బేజారెత్తి పోయి విడాకులకి రెడీ అయ్యింది. ఓకే అన్నాడు రాము.

      సమస్య తెలుసుకున్న బంగార్రాజు రంగంలోకి దిగాడు. పడగ్గదిలో రాము శరీరంలోకి దూరి తన బ్రాండ్ మన్మథలీలల్ని రేపాడు. రేపినంత  సేపే రెచ్చిపోయి-  లాప్ టాప్ తో మెడికల్ లోకంలో తలమునకలవడం రాము దినచర్య అయింది. రాముని ఎన్ని రకాలుగా మార్చాలని ప్రయత్నిచాలో అన్నిరకాలుగా ప్రయత్నించి చూశాడు బంగార్రాజు. బంగార్రాజుకి అనుకోకుండా ఇంకో సమస్య కూడా ఎదురై ఆ పనిమీద కూడా బిజీగా ఉండాల్సి వచ్చింది. ముప్పై ఏళ్ల క్రితం తను యాక్సిడెంట్ లోనే  చనిపోయాడని  అనుకుంటున్నాడు. అది యాక్సిడెంట్ కాదు హత్య అని అనుమానం కలిగే పరిస్థితులు ఎదురయ్యాయి. దీంతో ఆత్మలతో మాటాడే బాబా ( బ్రహ్మానందం) ని సంప్రదించి అతడి ద్వారానే గుట్టు బయట పెట్టేందుకు తన పినతండ్రి ( నాజర్) దగ్గరికి తీసికెళ్ళాడు. ఇలా కొడుకు కోడళ్ళ సమస్య ఒకవైపు, తన మరణ రహస్యం తెలుసుకునే సమస్య ఇంకో వైపూ బంగార్రాజుని వేధించాయి...

         యముడు పెట్టిన గడువు శివరాత్రి ముందు రోజువరకే. ఆ లోగా పనులు ముగించుకుని వచ్చేయాలి. అసలు వూళ్ళో గుడిని అడ్డం పెట్టుకుని జరిగిన- జరుగుతున్న కుట్ర లేమిటి, ఈ కుట్ర కి ఇప్పుడు రాము కూడా ఎలా బలికాబోయాడు, బంగార్రాజు రాముని ఎలా కాపాడి, భార్యతో కలిపాడు- కుట్ర దారులకి ఎలా బుద్ధి చెప్పాడూ అన్నవి ఇక్కడ్నించీ మిగతా కథ.

ఎవరెలా చేశారు
      నిస్సందేహంగా  ఇది నాగార్జున  ఒన్ మాన్ షో- ఓవరాక్షన్ లేని ఒన్ మాన్ షో. తూర్పు పడమరల్లాంటి బంగార్రాజూ రామూల పాత్రల్ని అవలీలగా పోషించేశాడు. ఈ పాత్రలు కొంత కాలం గుర్తుండి పోతాయి. ఒక తెలుగు హీరో ధోవతీ కట్టుకుని గ్రామీణ పాత్ర పోషించడం ఈ మధ్య కాలంలో జరగలేదు. ఒకే రకం మూస ఆవారా మాస్ పాత్రల్ని చూస్తున్న ప్రేక్షకులకి ఒక మార్పునివ్వడం నాగార్జున చేసిన మంచి ఆలోచన. రెండేళ్ళ క్రితం- ‘మనం’ కంటే ముందు తన మూడు నాల్గు సినిమాలకి ఓపెనింగ్స్, అభిమానులూ లేని దశనుంచి ‘మనం’ తో సంచలనం సృష్టించడానికి అందులో మూడు తరాలకి చెందిన  తన కుటుంబ స్టార్లు వున్నారు. అది జరిగిపోయిన రెండేళ్ళకి  ప్రస్తుత సినిమా సోలోగా చేసి బంపర్ ఓపెనింగ్స్ తో ఈలలేయించుకోవడం చూస్తే, ట్రేడ్ పండితులకే కళ్ళుతిరిగి పోతాయి. సినిమా చూస్తున్న యూత్ రెచ్చిపోయి కాగితాలు విసిరి అభిమానం ప్రకటించుకోవడం ఇదంతా నాగార్జున  పూర్వ వైభవాన్ని గుర్తుకు తెస్తుంది. కథ, పాత్ర బావుంటే- అదికూడా తెలుగుదనంతో కూడిన తెలుగు సినిమాలాగే  వుంటే, ఈ స్టారూ ఎప్పుడూ వెనకబడి పోడని తేల్చి చెప్పాడు  నాగార్జున.

        రమ్యకృష్ణ వల్ల చెప్పలేని గ్లామర్ వచ్చింది సినిమాకి- హీరోయిన్ లావణ్యా త్రిపాఠీ  కంటే కూడా. లావణ్యా త్రిపాఠీ సామాన్య యువతి ముఖ కవళికలతో గ్రామీణ కథ నేటివిటీలో ఒదిగిపోయింది. బ్రహ్మనందం క్లీన్ కామెడీ చేశారు. కుటుంబ సభ్యులుగా చలపతి రావు,
వెన్నెల కిషోర్,  బ్రహ్మాజీ, ఝాన్సీ నటిస్తే,  నాగబాబు యముడిగా కన్పిస్తాడు. విలన్లు నాజర్, సంపత్ రాజ్ లు. ఇక అనసూయ, హంసా నందిని, అనూష్కా లు బంగార్రాజు రాసలీలకి తోడ్పడ్డారు.

        పాటలు వాటి చిత్రీకరణా, ఛాయాగ్రహణమూ ఇతర సాంకేతిక హంగులన్నీ పక్కా కమర్షియల్ విలువల్ని ప్రదర్శిస్తాయి. 


        కొత్త దర్శకుడు కళ్యాణ్ కృష్ణ, ఇతర కొత్త దర్శకుల్లా కాకుండా తనది కాని కథని ఓన్ చేసుకుని, మాటలు రాసి చిత్రీకరణ చూసుకోవడం, దీనికి నాగార్జున కావాల్సిన మంది బలాన్ని సమకూర్చడం- వంటి వికేంద్రీ కరణ కూడా ఈ సినిమా ఇంత  బాగా రావడానికి కారణం. సీనియర్ సత్యానంద్ స్క్రీన్ ప్లే  సమకూర్చడం ఈ గ్రామీణ కథకి న్యాయం. 

       


-సికిందర్ 


డబుల్ గేమ్





 దర్శకత్వం : మేర్లపాక గాంధీ  
తారాగణం :  శర్వానంద్, సురభి, ప్రభాస్ శీను, సప్తగిరి, షకలక శంకర్, బ్రహ్మాజీ, హరీష్ ఉత్తమన్, ఊర్వశి, సుప్రీత్, దువ్వాసి మోహన్, నాగినీడు, సూర్య, పోసాని తదితరులు
కథ- స్క్రీన్ ప్లే : మేర్లపాక గాంధీ - షేక్ దావూద్ జి.,  మాటలు : మేర్లపాక గాంధీ
సంగీతం : ప్రవీణ్ లక్కరాజు, ఛాయాగ్రహణం :  కార్తీక్ ఘట్టమనేని
బ్యానర్ : యువి క్రియేషన్స్, నిర్మాతలు : వంశీ, ప్రమోద్
విడుదల :  జనవరి 14, 2016 

        చాపకింద నీరులా ఒక ట్రెండ్ తెలుగులో దారులు చూసుకుంటోంది. ఇది  దర్శకులకే తెలియకుండా జరిగిపోతోంది. అటు హిందీలో ఈ ట్రెండ్ ని ఉద్దేశపూర్వకంగా ప్రారంభించారు. తెలుగులో ఉద్దేశం లేకపోయినా, తెలియకుండా ఈ ట్రెండ్ లో భాగస్వాములై పోతున్నారు. దశాబ్దంన్నర క్రితం దేశంలో  మల్టీ ప్లెక్స్ థియేటర్లనే కాన్సెప్ట్ ఎప్పుడయితే ప్రారంభమయిందో, అప్పట్నించీ హిందీలో కేవలం అలాటి మల్టీప్లెక్స్ థియేటర్లకే ఉద్దేశించి,  లో- బడ్జెట్ సినిమాలు, ఆ తర్వాత ఇండీ ఫిలిమ్స్ అనే దర్శకుడి పర్సనల్ టేస్ట్ వున్న  సినిమాలూ తీయడం ప్రారంభించారు. మల్టీ ప్లెక్స్ థియేటర్ల  ప్రేక్షకులు వేరు. కేవలం నగరాలకే పరిమితమైన ఆధునికులు వాళ్ళు. మామూలు సింగిల్ స్క్రీన్ థియేటర్ల ప్రేక్షకులు  పల్లెల్లో, పట్టణాల్లో, నగరాల్లో సైతం క్లాస్- మాస్ ప్రేక్షకులుగా వుంటారు. మల్టీ ప్లెక్స్ లకే ఉద్దేశించిన లో- బడ్జెట్ సినిమాలతో బాటు, ఇండీ ఫిలిమ్స్,  సింగిల్  స్క్రీన్ థియేటర్ ప్రేక్షకులు చూసేందుకు పట్టణాల్లో, పల్లెల్లో  పనికిరావు. ఎందుకంటే, సింగిల్ స్క్రీన్ థియేటర్ సినిమా అంటే అది రెగ్యులర్ కమర్షియల్ సినిమా. వీటి పాత్రలు, కథల తీరుతెన్నులు, వాటి కాన్వాసులు, ఫార్మాట్ లూ విస్తృతమైనవి; కమర్షియల్- మూస ఫార్ములా మసాలా దినుసులతో కూడినవి. ఇలా కాకుండా మల్టీప్లెక్స్ సినిమాల పాత్రలు, కథల తీరుతెన్నులు, చిన్న చిన్న కథలతో వాటి కాన్వాసులు పరిమితమైనవి. సింగిల్  స్క్రీన్స్ కి నప్పని ఎలాటి కథయినా, పాత్రయినా  తీసుకునే స్వేచ్ఛ ఇక్కడుంటుంది. గత దశాబ్దం న్నర కాలంగా హిందీలో ఇలా వస్తున్నవే భేజా ఫ్రై, ఫస్ గయారే ఒబామా, కాఫీ బ్లూమ్, తిత్లీ వంటి అసంఖ్యాకమైన లో- బడ్జెట్ మల్టీప్లెక్స్ సినిమాలు. ఇవి నగరాల్లో కూడా సింగిల్ స్క్రీన్స్ లో ఆడవు, బి-సి సెంటర్లకి అసలే వెళ్ళవు. అక్కడి  ప్రేక్షకులకి చూపిస్తే ఇదేం  సినిమారా బాబూ అని తిట్టుకుంటూ వెళ్లిపోతారు.

        సరీగ్గా చెప్పాలంటే,  ఆర్ట్ సినిమాలు అంతరించిపోయిన కాలంలో శ్యాం బెనెగళ్, గోవింద్ నిహలానీ లవంటి దర్శకులు కింకర్తవ్యం ఆలోచించి,  ఇహ తమ ఆర్ట్ సినిమాలకి మళ్ళీ జనాకర్షణ తీసుకురావాలంటే బాలీవుడ్ స్టార్స్ తో తీయక తప్పదని రాజీ పడి, అలా తీసినవే కమర్షియలార్ట్ అనే క్రాసోవర్ సినిమాలు. ఇకప్పుడు చిన్న చిన్న న్యూవేవ్ కథలతో అవకాశాల కోసం చూస్తున్న ఎందరెందరో కొత్త కొత్త దర్శకులు, మల్టీ ప్లెక్స్ థియేటర్లు కూడా పెరగడంతో - ఈ మార్గం పట్టుకుని మల్టీ ప్లెక్స్ సినిమాలకీ, ఆ తర్వాత ఏ సినిమా రూల్సూ వుండని ఇండీ ఫిలిమ్స్ కీ దారి తీశారు.

        తెలుగులో ఇలాటి సినిమాలు తీయాలన్న ఉద్దేశం అసలుండదు. తెలుగు సినిమా అంటే అది క్లాస్ -మాస్ అందరూ చూడాలని తీసే ఎ-బి-సి సెంటర్ సినిమాలై వుండాలని కోరుకుంటారు నిర్మాతలూ దర్శకులూ. అయితే ఈ సంధి కాలంలో వాళ్ళకే తెలియకుండా జరుగుతున్నదేమిటంటే, రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు అనుకుని మల్టీప్లెక్స్ సినిమాలు తీసేస్తున్నారు. ఇటీవలే శంకరాభరణం, భలే మంచి రోజు, ఇప్పుడు ఎక్స్ ప్రెస్ రాజా తీశారు. వీటికి ముందుకూడా కొన్ని తీశారు. వాటి సంగతి అలా ఉంచుదాం. 

        ‘ఫస్ గయారే  ఒబామా’  లాంటి ఒక పరిమిత కాన్వాస్ గల, నేపధ్యం గల, స్టార్ కాస్ట్ గల చిన్న కథతో కూడిన మల్టీ ప్లెక్స్ సినిమాని పూర్తి  స్థాయి కమర్షియల్ సినిమాకి పెంచి ‘శంకరాభరణం’ తీస్తే ఏం  జరిగిందో తెలిసిందే. అలాగే పరిమిత కాన్వాస్ తో కథ గల ‘భలే మంచి రోజు’ కూడా మల్టీ ప్లెక్స్ సినిమానే. ఈ సినిమా చివర్లో ఈ జానర్ కి అతకని పృథ్వీ  రెగ్యులర్ కమర్షియల్ కామెడీతో కిచిడీ చేసి అది రెగ్యులర్ కమర్షియల్ సినిమా అనుకున్నారు.  అలాగే ఇప్పుడు ఒక రెగ్యులర్ కమర్షియల్ సినిమాకి చాలని అన్నివిధాలా చాలా చిన్న కథతో ‘ఎక్స్ ప్రెస్ రాజా’ తీశారు. ‘ఎక్స్ ప్రెస్ రాజా’ ని  హిందీవాళ్ళు తీస్తే అది కేవలం మల్టీ ప్లెక్స్ సినిమానే అవుతుంది. ఈ నేపధ్యంలో ‘ఎక్స్ ప్రెస్ రాజా’ దాని జానర్ ని మాత్రమే దృష్టిలో పెట్టుకుని, తెలియకుండా మల్టీ ప్లెక్స్- సింగిల్ స్క్రీన్ ల ట్రెండ్ లో అటూఇటూ కాని రోమాంటిక్ థ్రిల్లర్ గా తీసి మన ముందుంచారు.

ఎలాగంటే...
        ఇందులో  హీరోయిన్ ఓ చిన్న కుక్క పిల్ల గురించి విడిపోయే కథనం, అసలు ప్రేమ కుదరడానికి డిక్షనరీ తో ఎపిసోడ్లు అనే కథనమూ... రెగ్యులర్ కమర్షియల్ సినిమా పరిధికి/ ప్రేక్షకుల సంతృప్తికి చాలని అంశాలు. రెగ్యులర్ సినిమాల్లో కాన్ ఫ్లిక్ట్ అనే ప్రధాన మలుపుకి - కుక్క పిల్ల అనే తేలికపాటి చైల్డిష్ కారణం వుండదు. ఇంకా స్ట్రాంగ్ పాయింట్ ఏదో వుంటుంది. బ్యాక్ డ్రాప్, కాన్వాస్ ఇంకా విస్తృత పరిథుల్లో వుంటాయి. 2006 లో  రవిబాబు అల్లరి నరేష్ తో తీసిన ‘పార్టీ’ మల్టీ ప్లెక్స్ సినిమా అనుకునే  ఫిక్స్ అయి మల్టీ ప్లెక్సుల్లోనే రిలీజ్ చేశారు. ఆ కథ, పాత్రల పరిధి ఎంతో ‘ఎక్స్ ప్రెస్ రాజా’ లోనూ అంతే.

        కాకపోతే దీన్ని కమర్షియల్ ఫార్మాట్ తో కలిపి తీశారు. అలా మల్టీ ప్లెక్స్ కథ రెగ్యులర్ ఫార్మాట్ లో ఒదగనందువల్లే ఈ సినిమా ఒడిదుడుకుల ప్రయాణంలాగా అన్పిస్తుంది.  

ఇదీ అదే
        రెండోది, ఒక రోమాంటిక్ థ్రిల్లరో, సస్పెన్స్ థ్రిల్లరో అనగానే,  ‘స్వామి  రారా’  అప్పట్నించీ అదే మూసలో, అలాటివే కథలతో, అలాటివే పాత్రలతో తీయడం కన్పిస్తోంది. ‘ఎక్స్ ప్రెస్ రాజా’ ఇందుకేమీ తీసిపోలేదు. పెద్ద హీరోల సినిమా లనగానే అవే రొటీన్ గా ఫార్ములా కథలు, హార్రర్ సినిమా లనగానే అవే హార్రర్ కామెడీలు, థ్రిల్లర్స్ అనగానే అవే థ్రిల్లర్స్ తీస్తున్నారు. ఫస్టాఫ్ తో ముగిసిపోగల కుక్క పిల్లతో ప్రేమ కథ- ఫార్ములా కథలోకి తిరగబెట్టి- దాని బెల్టులో డైమండ్ పెట్టడంతో ఆ డైమండ్ కోసం వెంటపడే ముఠాలతో మళ్ళీ  ‘స్వామీరారా’ టైపు కాపీ థ్రిల్లర్ గా మారింది. ‘స్వామీరారా’ క్రాఫ్ట్ వేరు- అది ఎప్పుడో 1994లో ‘పల్ప్ ఫిక్షన్’ తీసిన క్వెంటిన్ టరాంటినో వాడిన మూడుకథలతో ఒక కథ అనే- ఒక కామన్ గా వుండే బిందువు దగ్గర్నుంచీ ప్రారంభమయ్యే వేట. ‘ఎక్స్ ప్రెస్ రాజా’ లో హీరో ఇలాటి బిందువు దగ్గరే కుక్క పిల్లని కిడ్నాప్ చేసే ఘటన లోంచి ఇంకో మూడు ఉపకథలు పుడతాయి. ఇవి కథా క్రమంలో  కొత్త కొత్త పాత్రలతో ఫ్లాష్ బ్యాకులుగా వస్తూంటాయి. ఇదంతా ‘స్వామి రారా’ లో చూసిందే.

        టూకీగా ఈ కథ ఏమిటంటే, వైజాగ్ లో తాగుబోతుగా ఆవారాగా తిరిగే, తండ్రి మాటంటే గౌరవం లేని హీరో ( శర్వానంద్), ఆ తండ్రికి ఫ్రెండ్ అయిన పోలీసు అధికారి (పోసాని) వార్నింగ్ ఇచ్చి పంపిస్తే జాబ్ లో చేరేందుకు హైదరాబాద్ వస్తాడు ఫ్రెండ్ ( ప్రభాస్ శీను) తో కలిసి.

        రాగానే ఇక్కడ హీరోయిన్ ( సురభి) ని  చూసి ప్రేమలో పడతాడు. ఈమెకి తన బొచ్చు కుక్క అంటే ప్రాణం. ఒకరోజు తెలీక దాన్ని మునిసిపాలిటీ కుక్కల వ్యానులో పడేస్తాడు. దీంతో ఆమె హర్ట్ అయి విడిపోతుంది. ఆ బొచ్చు కుక్కని  వెతికి తెచ్చేందుకు ప్రయత్నిస్తాడు. అది ఒక డైమండ్ స్మగ్లర్  ఇంట్లో వుంటుంది. ఐటీ వాళ్ళు  రైడింగ్ కి రావడంతో, 75 కోట్లు విలువజేసే ఒక డైమండ్ ని కుక్క బెల్టులో దాచేస్తాడు. ఈ కుక్కని హీరోయిన్ కోసం హీరో కిడ్నాప్ చేస్తాడు- ఈ కిడ్నాప్ జరిగే స్థలంలో వేర్వేరు పన్ల మీద వెళ్తున్న బ్యాచులు ఢీ కొంటారు. వీళ్ళెవరు, వీళ్ళ కథలేమిటనేది తర్వాత్తర్వాత కథా క్రమంలో రివీల్ అవుతూంటాయి. కుక్క కోసం స్మగ్లర్, ఎమ్మెల్యేని పెళ్లి చేసుకోబోతున్న హీరోయిన్ కోసం హీరో, రికార్డింగ్ డాన్స్ కెళ్ళే ప్రయత్నంలో ఇంకో గ్రూపూ..ఇలా సాగుతూంటుంది కథనం...’స్వామీరారా’ టైపు కథనం అన్నిసార్లూ బావుండదు.  ‘పల్ప్ ఫిక్షన్’ కథనంతోనే మళ్ళీ  హాలీవుడ్ లోనే తీయలేదు. తీస్తే కాపీ కొట్టారని పరువు పోతుంది.

        ‘ఎక్స్ ప్రెస్ రాజా’ లో దర్శకుడు మూస ఫార్ములాకి కూడా పాల్పడ్డాడు. తెలుగు సినిమా హీరో అనగానే, అదెలాటి కథయినా హీరో అనేవాడు సిగరెట్లు తాగే ఆవారా తాగుబోతులాగా వుండడం, ఓపెనింగ్ లో ఓ ఘనకార్యం చేసి గ్రూపుతో ఓ సాంగే సుకోవడం, హీరోయిన్ తో ఓ డ్రీమ్  సాంగ్ కలగనడం...అలాఅలా క్లయిమాక్స్ కి ముందు  హీరోయిన్ తో ఓ ఫోక్ సాంగ్, అ తర్వాత ఫైటింగ్ తో ముగించడమనే రొటీన్నే మళ్ళీ ఇందులో కలిపాడు. దీంతో  సినిమాని జానర్ పరంగా- మల్టీ ప్లెక్స్- సింగిల్ స్క్రీన్ అనే వర్గీకరణ పరంగా, పాత రొటీనై పోయిన సబ్జెక్ట్ పరంగా- అన్నీ కలగాపులగం చేసి కాక్ టెయిల్ మిక్చర్ గా అందించాడు.

        ఇప్పుడు తెలుగు సినిమాలకి జానర్స్ మర్యాద కాపాడ్డమే  ఒక సవాలుగా వుంటే, దీనికి అదనంగా మళ్ళీ ఆ తీసే జానర్స్ కూడా మల్టీ ప్లెక్స్ ట్రెండ్ లో పడకుండా ( మల్టీప్లెక్స్ సినిమాలు తీయరు కాబట్టి)  పూర్తి స్థాయి సింగిల్ స్క్రీన్ స్పృహతో తీయాల్సి రావడం కత్తి మీద సామే కావొచ్చు.

        గత సంవత్సరం సక్సెస్ అయిన సినిమాల్నిపరిశీలిస్తే, జానర్ మర్యాదని కాపాడిన సింగిల్ స్క్రీన్ కథలకే ప్రేక్షకులు ఓటేశారు. తెలుగు సినిమాకి ఇప్పటికి రెండే  : జానర్ మర్యాద, సింగిల్ స్క్రీన్ సెన్సిబుల్ కథ!

-సికిందర్ 



http://www.filmyfreak.com