రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

27, ఫిబ్రవరి 2016, శనివారం

షార్ట్ రివ్యూ!


దర్శకత్వం : రవికాంత్ పారెపు
తారాగణం : అడవి శేష, అదా శర్మ, అనసూయ, సత్యం రాజేష్, వెన్నెల కిషోర్, రవి వర్మ, సత్యదేవ్ తదితరులు
కథ : అడివి శేష్,  స్క్రీన్ ప్లే : అడివి శేష్- రవికాంత్ పారెపు, డైలాగ్స్- స్క్రిప్ట్ గైడెన్స్ : అబ్బూరి రవి,  సంగీతం : శ్రీ చరణ్ పాకాల, ఛాయాగ్రహణం : షానీల్ దేవ్
బ్యానర్ : పివిపి సినిమా- మాటనీ ఎంటర్ టైన్ మెంట్స్
నిర్మాత : పరమ్  వి. పొట్లూరి, కెవిన్ ఏన్
విడుదల :26 ఫిబ్రవరి 2016
***
        సృజనాత్మకంగా తెలుగు సినిమాకి  శిఖరాగ్ర తలాల్ని తాకే సృష్టి ఇక అసాధ్యమేమో అనుకుంటున్న నాటు దర్శకత్వాల కాలంలో, కొత్తగా పాతికేళ్ళ యువదర్శకుడు అత్యంత పరిణతితో, దృశ్యమాధ్యమం మీద సంపూర్ణావగాహనతో, పట్టుతో, ప్రావీణ్యంతో, తన పనితనాన్ని తెలుగులో అరుదైపోయిన క్వాలిటీ సినిమా స్థాయికి చేర్చి ‘క్షణం’ ని సార్ధకం చేశాడు. సినిమా కళని కాలాన్ని బట్టి ఏమాత్రం సానబట్టకుండా అరిగిపోయిన దర్శకత్వాలతో అవే రకం నాసి సినిమాలు తీసే వాళ్లకి మార్కెట్లో సవాలు  విసిరాడు. సాధారణంగా  మార్కెట్లో ఓ కొత్త తరహా ఉత్పత్తి వచ్చిందంటే మిగతా ఉత్పత్తి దారులు అప్రమత్తమై దాంతో పోటీ పడే మరో కొత్త ఉత్పత్తి తో మార్కెట్లోకి వస్తారు. ఇది సినిమా ఫీల్డుకు వర్తించదనుకుంటారు. కొత్త మేకింగ్ తో ఓ సినిమా వచ్చిందని ఎంత ప్రచారం జరిగినా, వెళ్లి చూడమని ఎందరు చెప్పినా దర్శకులయ్యే వాళ్ళు, దర్శకులైన వాళ్ళూ అటువైపు కన్నెత్తి చూడరు. పోటీతత్వం ఇలా పడకేయడం మరే రంగంలో చూడం. మేకింగ్ పరంగా ‘క్షణం’ అనే కళాసృష్టి విసురుతున్న కొత్త సవాళ్లు ఎవరికీ పట్టడం లేదు. నాటు దర్శకత్వాల్లోనే వాళ్లకి స్వర్గసుఖాలున్నట్టున్నాయి.

      కొత్త దర్శకుడు రవికాంత్ పారెపు మొదటి ప్రయత్నంగా ఒక థ్రిల్లర్ ని, అందునా చాలా సంక్లిష్ట కథా సంవిధానంతో కూడిన ప్రయత్నానికి సాహసించాడు. ఇందులో పూర్తి విజయం సాధించాడు. అయితే పూర్తి క్రెడిట్ తానొక్కడికే దక్కదు, రైటింగ్ సైడ్ అడివి శేష్ కీ,  అబ్బూరి రవికీ కూడా కలిపి దక్కుతుంది. ఏదైనా ముందు క్వాలిటీ రైటింగ్ వల్లే సాధ్యమవుతుందని నిరూపించారు ఈ ముగ్గురూ.

        ‘క్షణం’ ఒక కళ్ళు తిప్పుకోనివ్వని అద్భుత విజువల్ కాన్వాస్ తో, మనసు మరల్చుకోనివ్వని ఉర్రూతలూగించే విషయ వ్యక్తీకరణతో, ఆద్యంతం సస్పెన్స్ థ్రిల్లర్ జాతి లక్షణాల్ని ప్రదర్శించుకుంటుంది. కల్తీ లేని దీని జాతి లక్షణమే దీని విజయరహస్యం. ఇప్పుడున్న సోకాల్డ్ సృష్టి కర్తలు ఈ విజయరహస్యాన్ని పట్టుకోవడం అంత సులభం కాదు, పట్టుకోవాలన్న ఆసక్తి వుంటే కదా! 

        థ్రిల్లర్ అనగానే ‘ఒక వస్తువు కోసం కొంతమంది వెంటాడే’  ఈజీగా వుండే రోడ్ మూవీస్ గానే ఉంటున్న వైనం ఇటీవల ‘కృష్ణ గాడి వీర ప్రేమ గాథ’ తో  కూడా మళ్ళీ చూశాక,  ఈ మూసని  బ్రేక్ చేస్తూ వచ్చిన ‘క్షణం’ ఏం చెబుతోందో ఒకసారి చూద్దాం...


కథ
       అమెరికాలో ఇన్వెస్ట్ మెంట్ బ్యాంకర్ గా ఉంటున్న ( రిషి) కి ఇండియానుంచి మాజీ గర్ల్ ఫ్రెండ్ కాల్ చేసి అర్జెంటుగా రమ్మంటుంది. నాల్గేళ్ళ క్రితం వేరే పెళ్లి చేసుకుని వెళ్ళిపోయిన శ్వేత ( అదా శర్మ) పిలుపుకి కారణమేంటో తెలుసుకోవడానికి ఇండియా వస్తాడు. హైదరాబాద్ లో ఉంటున్న శ్వేత తన నాల్గేళ్ళ  కూతురు రెండు నెలల నుంచీ  కన్పించకుండా పోయిందనీ, ఎవరూ- ఆఖరికి పోలీసులు కూడా కనుక్కోలేక పోతున్నారనీ వాపోతుంది. రిషి రంగం లోకి దిగుతాడు. అంతటా తికమక పెట్టే సమాచారమే వస్తూంటుంది అతడికి... ఎవర్నడిగినా,  పోలీసులు సహా,  లేని కూతుర్ని ఎలా వెతికి పెట్టమంటారని ప్రశ్నిస్తారు. పోలీసులు కేసు క్లోజ్  చేశామంటారు. రిషి కి ఎవర్ని నమ్మాలో అర్ధం గాదు. శ్వేత అబద్ధం చేప్తోందా తనకి కూతురుందనీ?. డ్రగ్స్ బానిసైన శ్వేత మరిది బాబీ (రవివర్మ) మీద కన్నేస్తాడు. ఆఫ్రికన్లతో కుమ్మక్కై వున్న అతడి డ్రగ్ రాకెట్ ని చూసి  శ్వేత కూతుర్ని ఇతనే  కిడ్నాప్ చేసి ఉంటాడని అనుమానిస్తాడు. పిక్చర్లోకి ఈ డ్రగ్ రింగ్ తో సంబంధమున్న బాబూ ఖాన్ ( వెన్నెల కిషోర్) వస్తాడు. ఇంకెవరెవరో వస్తారు.  ఆ పిల్ల తన కూతురేనని  ఇంకొకడొస్తాడు ... అసలేం జరిగి వుంటుంది? శ్వేత మానసిక స్థితిని అనుమానిస్తాడు. ఒకటొకటే అమ్మాయి అదృశ్య రహస్యాన్ని ఛేదిస్తూ పోతాడు...ఒకటొకటే నమ్మలేని నిజాలు బయటపడుతూంటాయి...ఒకటి తవ్వితే ఇంకోటి.. ఆఖరికి తెలుసుకున్న కూతురి రహస్యం ఎదురుతిరిగి తనకే కొట్టడంతో షా కవుతాడు. తన గురించి తనకే తెలీని నిజం బయట పడి అవాక్కవుతాడు...

ఎలావుంది కథ : 
       
హెన్రీ కథల్లోలాగా కొసమెరుపు వున్న షాకింగ్ కథ. కూతురు వుందా లేదా - అసలుందా లేదా -  అన్న సెంట్రల్ పాయింటుతో ప్రేక్షకుల్ని ఆద్యంతం లాక్కెళ్ళే  సస్పెన్స్ థ్రిల్లర్ గా ఈ కథ ఒక కొత్త అనుభూతినిచ్చే విధంగా వుంది చాలా కాలం తర్వాత. అయితే చివర్లో సస్పెన్స్ వీడిపోయాక ఒక నైతిక సంబంధమైన ప్రశ్న ఈ కథ పట్ల గౌరవాన్ని కొంచెం తగ్గిస్తుంది. పుట్టిన కూతురు వేరొకడి రక్తమన్న విషయం దాచి పెట్టి భర్తతో కాపురం చేయడం హీరోయిన్ పాత్రకి తగదు అన్పించేలా వుంటుంది. ఇదేదో విదేశీ కథైతే  అక్కడ ఓకే అనుకోవచ్చు, ఇక్కడ  కాదు. ఎంత  ఈ రహస్యం తెలిసేటప్పటికి సినిమా ముగింపుకొచ్చినా – హీరోయిన్ అనైతికత మనల్ని వెంటాడుతూనే వుంటుంది.

ఎవరెలా చేశారు
         
అందరూ చాలా బాగా చేశారు, నటీనటుల కాడ్నించీ టెక్నీషియన్స్ వరకూ. అడివి శేష్ ఒక హీరోలా హీరోయిజం ప్రదర్శించకుండా, ఓ సామాన్యుడిలా సహజ నటన కనబర్చాడు. ఇంతవరకూ చేసిన సినిమాలు ఒకెత్తు- ఇదొక్కటీ ఒకెత్తు. అతను కేవలం హీరో పాత్రలే వేయకుండా కొన్ని సినిమాల్లో  హీరోయేతర పాత్రలు కూడా వేస్తూ ఇమేజి చట్రాలకి దూరంగా ఉంటున్నాడు. ‘దొంగాట’ లో బుద్ధి తెచ్చుకునే నెగెటివ్ పాత్ర వేశాక, ఇప్పడు బుద్ధి నేర్చుకునే మాజీ బాయ్ ఫ్రెండ్ పాత్ర వేశాడు. తను వున్న ప్రతీ సీనూ ఏ బిల్డప్పులూ లేకుండానే వేడి పుట్టించాడు. అతడి గ్లామరస్ రూపం ఈ పాత్రకి  చాలా ప్లస్ అయింది. 

        హీరోయిన్ అదా శర్మ ఈ సారి మసాలా సినిమాలకి దూరంగా ఒక  విషయమున్న, నటిగా తనకి పని వున్న పాత్ర నటించింది. అసలు పిల్ల ఉందా లేదా, తనని నమ్మాలా వద్దా, తను సైకోనా కాదా అన్న షేడ్స్ అన్నిటినీ అలవోకగా ప్రదర్శిస్తూ ఎమోషనల్ డ్రామాని బాగా రక్తి కట్టించింది. 

        కమెడియన్ సత్యం రాజేష్ పోలీసు అధికారి పాత్రలో తను చౌదరి అయి, కానిస్టేబుల్ ని రెడ్డీ అని పిలుస్తూ కమ్మా రెడ్ల కనిపించని సెటైరికల్ ప్లేని సైడ్లో ప్రదర్శించుకుంటూ పోయాడు. ఇది కాదు  పాయింటు - చాలా సర్ప్రైజింగ్ గా, నిజమైన  బంజారా హిల్స్ పోలీసు వాడిలా ఖతర్నాక్ లుక్ తో, పర్వెర్టెడ్ డైలాగ్స్ తో, ప్రతీచోటా హైలైట్ అవుతూ పోయాడు. అతడికి అవార్డు రావొచ్చు. 

        ఇంకో సర్ప్రైజ్  గిఫ్ట్, ఎసిపి జయగా నటించిన అనసూయ. ప్రతీ పాత్ర వెనకాలా కొంత చీకటి చరిత్ర ఉన్నట్టే, తన నంగనాచి పాత్రని కూడా  టెర్రిఫిక్ గా పోషించు కెళ్ళింది తన క్లాస్ నటనతో.

        ఇక వెన్నెల కిషోర్ బాబూఖాన్ పాత్రలో ఓ షేర్ ఖాన్ త్యాగమొకటి చేస్తూ పాత్రని ఎక్కడికో తీసికెళ్ళాడు. ఇది కూడా కామెడీ పాత్ర కాదు. సత్యం రాజేష్, ఇతనూ ఇక్కడ కామెడీ పాత్రలు కావు. వెన్నెల కిషోర్ ఇహ కామెడీ మానేసి ఇలాటి సెన్స్ వున్న క్యారక్టర్లు వేస్తే ప్రేక్షకుల ఆదరణ ఇంకా బాగా పొందగలడు.

        ఈ సినిమాలో ఆఫ్రికన్ నటులు కూడా ఫెంటాస్టిక్ గా వున్నారు. ఇక డ్రగ్ బానిసగా రవివర్మ డ్రగ్ బానిసలకే గురువు అన్నట్టుగా వున్నాడు. హీరోయిన్ భర్తగా నటించిన సత్యదేవ్ కూడా పైకి కన్పించని శాడిస్టుగా మెత్త మెత్తగా తనవంతు కార్యక్రమం నిర్వహించాడు. ఈ సినిమాలో అందరూ పైకి పవిత్రులే, వెనకాల మాత్రం గోతులే. అయితే కూతురి పాత్రలో అమ్మాయి సెలక్షన్ కుదర్లేదు. చూస్తే ఆమెకి తల్లి పాత్ర అదాశర్మ రంగూ పోలికలూ లేవు, తండ్రి పాత్ర సత్యదేవ్ కి మ్యాచ్ అయ్యే రంగూ పోలికలతో వుంది. కానీ తండ్రి ఈ పాత్ర కానప్పుడు- అసలు తండ్రెవరో ఆ  రూపురేఖలకి దగ్గరగా ఆమె వుండాలేమో...?

        తక్కువ బడ్జెట్ తోనే టెక్నికల్ గా ఈ మూవీ చాలా సాధించింది. దీని విజువల్ కాన్వాస్, డ్రమ్స్ ప్రధానంగా మ్యూజికల్ ట్రాక్,  తెలుగు సినిమాకి ఒక కొత్త జన్మ ప్రసాదించి నట్టున్నాయి. నిజంగానే నిన్న తెలుగు సినిమా పునర్జన్మెత్తింది. కెమెరామాన్ షానీల్ దేవ్ ఈ విజువల్ వండర్ కి చాలా పెద్ద ఎస్సెట్. శ్రీ చరణ్ పాకాల కూడా డ్రమ్స్ తో, అతి కొద్ది ఇన్ స్ట్రుమెంట్స్ తో- సినిమా ఆద్యంతం కథాకథనాలకి తోడ్పడే ఒక థీమ్ ట్రాక్ ని క్రియేట్ చేశాడు. రొడ్డ కొట్టుడు బ్యాక్ గౌండ్ మ్యూజిక్ కాలుష్యం నుంచి విముక్తి కల్గించాడు. లోకేషన్స్, ఆర్ట్, కాస్ట్యూమ్స్, ఎడిటింగ్, ఫైట్స్,  యాక్షన్ దృశ్యాలు కూడా ఉన్నతంగా వున్నాయి.

        ఈ కథని అడివి శేష్ ఇస్తే, అడివి శేష్ తో  దర్శకుడు రవికాంత్ కలిసి స్క్రీన్ ప్లే చేశారు. అబ్బూరి రవి మాటలు రాసి స్క్రిప్టు గైడెన్స్ ఇచ్చారు. ఇదంతా ముగ్గురు విద్యార్ధులు శ్రద్ధగా చదువుకుని  పరీక్ష రాసినట్టుంది. పకడ్బందీ కథా కథనాలు, పకడ్బందీ పాత్రచిత్రణలు, పకడ్బందీ సంభాషణలు ఇందుకే సాధ్యమయ్యాయి. కమర్షియల్ సినిమాని బిల్డప్పుల హీరోతనాలూ, పాటలూ స్టెప్పులూ, లవ్వులూ కామెడీలూ, ఇంకేవో  సెంటిమెంట్లూ సున్నాలూ పూసుకోకుండా కూడా తీయవచ్చని (రాయవచ్చని)  ఓ గైడ్ లా తయారుచేసి పెట్టారు దీన్ని. 

        చిన్నవయసులో దర్శకుడుగా రవికాంత్ తను కొత్తవాడనే ఛాయలు ఎక్కడా కన్పించకుండా- చాలా మెచ్యూరిటీతో దర్శకత్వం వహించాడు. చివర్లో నైతికతకి తిలోదకాలివ్వడం తప్పితే, ఇంకే తప్పులూ దొర్లకుండా చేసిన ఈ తొలిప్రయత్నం థ్రిల్లర్స్ జాతిలో ఒక కళా సృష్టిగా నిలిచిపోతుంది. ప్రేమ కథని మల్టీపుల్ ఫ్లాష్ బ్యాకుల్లో అవసరమున్నప్పుడల్లా రివీల్ చేస్తూపోయిన క్రియేటివిటీ - సమయస్ఫూర్తి - సబ్జెక్ట్ మీదున్న కమాండ్ ని తెలియజేస్తుంది. 

        ఒక సినిమా తీయాలంటే ఇంత వుంటుందా అని పునరాలోచనలో పడెయ్యకపోతే, ఎవడుపడితే వాడొచ్చి  రొడ్డ కొట్టుడు సినిమాలు తీసేసి పోతాడు. ఈ ‘క్షణం’ చూసి ఒక్క క్షణం ప్రేక్షకులు కూడా ఇలా నిజమైన క్వాలిటీ సినిమాలు చూసే అవకాశమివ్వకుండా, ఎందుకు  రాచిరంపాన పెడుతున్నారో ఆలోచించాలి.


-సికిందర్
(స్క్రీన్ ప్లే సంగతులు : సోమవారం)






షార్ట్ రివ్యూ!





కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం : సతీష్ కాసెట్టి
తారాగణం: శ్రీకాంత్, నిఖితా తుక్రాల్, నాజర్, కోట శ్రీనివాస రావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పృథ్వి, వినయ్  వర్మ తదితరులు
మాటలు : లక్ష్మీ భూపాల్, సంగీతం : సాయి కార్తీక్, ఛాయాగ్రహణం : శ్యాం ప్రసాద్
బ్యానర్ : అఖండ భారత్ క్రియేషన్స్ , నిర్మాత: షేక్ మస్తాన్
విడుదల : 26 ఫిబ్రవరి 2016
***
          టెర్రరిజం మీద సినిమాలు ఇవ్వాళ కొత్త కాదు. హిందీలో  రొటీన్ కి కాస్త పక్క కెళ్ళి క్యారక్టర్ బేస్డ్ టెర్రరిజం సినిమాలు వాస్తవికంగా తీసిన సందర్భాలున్నాయి. కానీ తెలుగులో ఒకే టెంప్లెట్ ని పెట్టుకుని, అవే మూస టెర్రరిజాలు తీస్తున్నారు. నగరం మీద టెర్రరిస్టులు దాడికి ప్లాను చేయడం, దాన్ని హీరో సాయంతో పోలీసులు భగ్నం చేయడం... ఈ చట్రం లోంచి బయటికి వచ్చి తీసిన టెర్రరిజం సినిమాలు తెలుగులో జీరో. ఇంతేగాక కథా కథనాల పరంగానూ ఇవి మూసపాత్రలతో సహా మూస ఫార్ములా సినిమాలుగానే ఉంటున్నాయి. తీస్తే కమర్షియల్ మసాలాగా తీయడమో, లేకపోతే రియలిస్టిక్ పేరు చెప్పి దాన్ని మళ్ళీ మూస ఫార్ములా గా తీయడమో చేస్తున్నారు. ఇంకో కేటగిరీ ఏమిటంటే,  ఎప్పుడో పాతబడిన, చూసి చూసి వున్న  ‘ముఖ్యమంత్రి సీటు కోసం హోం మంత్రి కుట్ర చేయు’  టైపు పాత చట్రంలోకే మళ్ళీ టెర్రరిజం కథల్ని కూడా ఇరికించేసి చూపించెయ్యడం. ప్రస్తుత ‘టెర్రర్’ ఈ పథకం కిందికే వస్తుంది. తెలుగు సినిమా కథ తయారుచేయడం ఎంత ఈజీ అయిపోయింది!! 

        ఈ మధ్య సినిమాలతో వెనుకబడ్డ హీరో శ్రీకాంత్ పోలీసు పాత్రతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. అలాగే  ‘హోప్’, ‘కలవరమాయే మదిలో’ సినిమాల దర్శకుడు సతీష్ కాసెట్టి చాలా కాలం గ్యాప్ తర్వాత యాక్షన్ సినిమాతో రావడం ప్రత్యేకత. విడుదలకి ముందు ఈ సినిమా పబ్లిసిటీతో ప్రేక్షకుల్లో బాగా ఆసక్తి రేపింది. ఈ ఆసక్తినీ అంచనాలనీ అందుకునే విధంగా  ‘టెర్రర్’  ఏయే ప్రత్యేకతలు మోసుకొచ్చిందో ఒకసారి చూద్దాం. 

కథ
       
క కేసు విషయంలో పనిష్మెంట్ గా  కౌంటర్ ఇంటలిజెన్స్ డిపార్ట్ మెంట్ కి బదిలీ అవుతాడు సీ ఐ విజయ్( శ్రీకాంత్). ఆ కేసులో అతను  ప్రవర్తించిన తీరుని వ్యతిరేకించి అతడి తండ్రి ( నాజర్) దూరమవుతాడు. భార్య పూజ  ( నిఖితా తుక్రాల్) తో వేరే కాపురం ఉంటాడు విజయ్. తన మీద కేసు ఎంక్వైరీ అనుకూలంగా రావడానికి ఓ ఎమ్మెల్యే ( పృథ్వీ) కి  డబ్బులిస్తూంటాడు విజయ్. ఇలా వుండగా కౌంటర్ ఇంటలిజెన్స్ డిసిపి  రాథోడ్ (వినయ్ వర్మ) అనే పై అధికారి విజయ్ కి ఓ ఆపరేషన్ అప్పజెప్తాడు.  సిటీలో టెర్రరిస్టు కార్యకలాపాల మీద నిఘా వెయ్యమని. విజయ్ దర్యాప్తు చేపట్టి ఇన్ఫార్మర్ల తోడ్పాటుతో కేసుని ఛేదిస్తూంటాడు. ఇంకో వైపు ఎమ్మెల్యేకి డబ్బులివ్వాల్సిన వొత్తిడి వుంటుంది. విజయ్ దృష్టికి  రాకుండా ఒక బాంగ్లాదేశ్  కి చెందిన టెర్రరిస్టు ముఖ్యమంత్రిని హతమార్చేందుకు పథకం వస్తాడు. ఇది హోంమంత్రి (కోట శ్రీనివాసరావు) కీ, కేంద్ర నాయకుడికీ తెలిసి వాళ్ళ రాజకీయప్రయోజనాల కోసం సైలెంట్ గా ఉండిపోతారు. టెర్రరిస్టు దాడిలో ముఖ్యమంత్రి చనిపోతే ఆ పదవిలోకి  తను రావాలన్న ఆశతో హోం మంత్రి ఉంటాడు. ఇతడికి డిసిపి రాథోడ్ తోడవుతాడు. దీంతో విజయ్ మీద వొత్తిడి తెస్తాడు దర్యాప్తు ఆపెయ్యమని. విజయ్ కి తెర వెనుక కుట్ర అర్ధమైపోయి ఎదురు తిరుగుతాడు. తను లొంగే సమస్యే లేదనీ, కుట్రని భగ్నం చేస్తాననీ సవాలు విసిరి హోం మంత్రికి శత్రువవుతాడు. ఇదీ విషయం. ఇప్పుడు తన మీద జరిగే హత్యాయత్నాల్ని  తిప్పికొడుతూ, నగరానికి టెర్రరిజం ప్రమాదాన్ని విజయ్ ఎలా నివారించాడన్నది మిగతా కథ.

ఎలా వుంది కథ
       
ముందే చెప్పుకున్నట్టు ఇది ‘ముఖ్యమంత్రి సీటు కోసం హోం మంత్రి కుట్ర చేయు’  రొటీన్ టెర్రర్ మూస కథే. ఇన్నేళ్ళుగా మనం చూస్తున్న దాని ప్రకారం దేశం లో నాయకులెవరూ టెర్రరిస్టులతో చేతులు కలిపిన దాఖలాల్లేవు. నాయకులెవరికైనా వుంటే గింటే మాఫియాలతో, స్మగ్లర్లతో సంబంధాలుంటున్నట్టు చూస్తున్నాం. ఇది కూడా ఆర్ధిక ప్రయోజనాలకోసమే. టెర్రరిస్టులతో చేతులుకలిపి దేశద్రోహానికి పాల్పడే దుర్మార్గులుగా లేరు నాయకులు. వాళ్లకి దోచుకోవడానికి దేశం వుండాలి, జనం వుండాలి. బాంబులు పేల్చి మారణహోమం సృష్టించడం వాళ్ళ సిద్ధాంతంలో భాగం కాదు. ఇప్పుడు పార్లమెంట్ లో జరుగుతున్న చర్చ ఇదే. దేశంలో ఏ నాయకుడినీ యాంటీ నేషనల్ అనలేని, రుజువు చేయలేని చర్చ. మన నాయకులు ఇంతవరకు పుణ్యాత్ములే. కాబట్టి- పార్లమెంట్ సాక్షిగా పరిస్థితి ఇలా వుంటే,  వాస్తవదూరంగా నాయకుల్ని టెర్రరిస్టులుగా చూపించడం ఎలాటి సామంజస్యత? సగటు ప్రేక్షుకుడు పార్లమెంట్ ని నమ్మాలా, ఈ సినిమాని నమ్మాలా? 

        ఇంకెవరో మసాలా దర్శకుడు ఇలా తీస్తే పోనీలే అనుకోవచ్చు, కానీ ఒక జాతీయ అవార్డు పొందిన దర్శకుడుగా సతీష్ కాసెట్టి సామాజిక స్పృహ ఇలా వుండాల్సింది కాదు. దీనికి కమర్షియల్ మసాలాలు లేని వాస్తవిక సినిమా అనడం కూడా సమంజసం కాదు.

ఎవరెలా చేశారు
       
ప్రధానపాత్ర లో శ్రీకాంత్ ఇంకా బాగా చేయడానికి స్కోప్ వుంది, పాత్ర అనుమతిస్తే. కానీ పాత్రకి  చాలా సంకెళ్ళు పడ్డాయి. తనకి బలమైన విలన్ లేకపోవడం, ఉన్న విలన్ కూడా క్లయిమాక్స్ కి ముందు వరకూ ఎదురుపడకపోవడం, ఆ విలన్ తో కూడా కథ కొనసాగక, క్లయిమాక్స్ అంతా  ఆ విలన్ అనుచరుడైన బచ్చాలా వున్న జ్యూనియర్ ఆర్టిస్టు తో తలపడాల్సి రావడం వంటి బాక్సాఫీసు వ్యతిరేక అంశాల సంకెళ్ళు శ్రీకాంత్ నట సామర్ధ్యాన్ని కుదించి వేశాయి. శ్రీకాంత్ యమ సీరియస్ గా నటించ వచ్చు, కఠినమైన ఎక్స్ ప్రెషన్స్ డైలాగులూ ఇవ్వొచ్చు. ఎన్కౌంటర్లు చేయవచ్చు. ఇవన్నీ ఎవరి మీద? అసలైన ప్రత్యర్ధి ఎవరో తెలీకుండా, వాడి జోలికెళ్ళాకుండా, ఛోటా మోటా పక్క పాత్రల మీద ప్రతాపం చూపించడమా? నటనని పాత్రచిత్రణతో కలిపి చూడాలి. 

        మేకప్ కూడా పోలీస్ అధికారిని తలపించే విధంగా లేకపోవడం ఇంకో లోపం. శ్రీకాంత్ పోలీస్ పాత్రకి రియలిస్టిక్ లుక్ తీసుకురావడం మీద కూడా శ్రద్ధ పెట్టలేదు దర్శకుడు- ఇక్కడ సందర్భం కాకపోయినా ‘క్షణం’ లో సత్యం రాజేష్ పోషించిన పోలీసు అధికారి పాత్రని చూస్తే, ఆ లుక్- అచ్చం పోలీస్ అధికారి అన్నట్టుగానే వుంది. ఆ లుక్, దానికి తోడూ పర్వర్టెడ్ మెంటాలిటీవీటితో అతడి నటనా, మాట తీరూ  ప్రేక్షకులకి వెర్రెత్తించే విధంగా వున్నాయి.  తనొక కమెడియన్ అన్న విషయాన్నే పూర్తిగా మరిపించేశాడు. 

        కోట, పృథ్వీ ల నటన మూస ఫార్ములా సినిమాల నటనే తప్ప కథ చేస్తున్న డిమాండ్ మేరకు సీరియస్ రియలిస్టిక్ పాత్రలుగా కన్పించరు. దేశద్రోహం కూడా కామెడిగానే చేసేట్టున్నారు. ఇవి కథకి పొసగని పాత్ర చిత్రణలు. ఇతరపాత్రల్లో దాదాపు అందరూ కొత్త వాళ్ళే- చాలా వరకూ జ్యూనియర్ ఆర్టిస్టులుగా కన్పిస్తారు. టెర్రరిస్టుగా వేసిన నటుడు  సైతం ఆ పాత్ర స్థాయిలో లేడు. ఇలా కాస్టింగ్ లోపం అడుగడుగునా ఇబ్బంది పెడుతుంది.

        పాటలు లేని ఈ సినిమాలో సాయి కార్తీక్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఫర్వాలేదు, అలాగే శ్యాం ప్రసాద్ ఛాయాగ్రహణం కూడా.

చివరికేమిటి?
        దర్శకుడిలో చిత్రీకరణ సామర్ధ్యం వుంది. అయితే కాన్సెప్ట్ స్పృహ, కథా కథనాలకి  ఇంకాస్త నిబద్ధతా అవసరమన్నట్టు కన్పిస్తుంది. చాలావరకూ డైలాగుల రూపంలో కథ నడిచిపోతుంది. ఇంటర్వెల్ పడగానే అంతవరకూ చూసింది నాటకం లాగుందే అన్పించిక మానదు. ఈ టెర్రరిజం - ఈ 'వాస్తవికత'  కూడా థ్రిల్లర్ జాతి  కిందికే వస్తాయి. వాస్తవికత అయినంత మాత్రాన కథా లక్షణాల్ని విస్మరించలేం. కానీ 
 ఎంతసేపూ శ్రీకాంత్ పాత్ర టెర్రరిస్టెవరో తెలుసుకునే దర్యాప్తుతోనే సరిపోతుంది- దర్యాప్తు అంశం బాక్సాఫీసు ఫ్రెండ్లీ గా వుండేది కథలో కొంత మేరకే. వీలయినంత త్వరగా దర్యాప్తు పర్వం ముగించుకుని కనుగొన్న విలన్ తో సంఘర్షణ ప్రారంభం కాకపోతే అది థ్రిల్లర్ అవదు. ‘డే ఆఫ్ ది జాకాల్’ ఇందుకు క్లాసిక్ ఉదాహరణ. ఫ్రాన్స్ ప్రెసిడెంటుని చంపేందుకు కుట్రపన్నిన టెర్రరిస్టెవరా అని కనుక్కునే దర్యాప్తు కాస్సేపే- వాడు తెలిసిపోగానే వాణ్ణి పట్టుకునే ఎలుకా పిల్లి చెలగాటంలోకి మలుపు తిరుగుంతుంది. మహాత్మా గాంధీని చంపే కథతో కమల్ హా సన్ తీసిన ‘హేరామ్’ అనే కల్పిత కథ కూడా ఇంతే. పోరాడేందుకు విలన్ లేక క్లయిమాక్స్ దాకా వాడెవరో తెలుసుకునే ఏకపక్ష  కథనం వల్ల,   విజువల్ మీడియా అయిన సినిమాకి ఎంతో అవసరమైన యాక్షన్- రియాక్షన్ ల థ్రిల్లింగ్ ప్లే లేకుండా పోయింది ‘టెర్రర్’ లో.

        ఇంతగ్యాప్ తర్వాత సతీష్ కాసెట్టి తీయకతీయక తీసిన ఈ టెర్రర్ స్టోరీ  స్క్రీన్ ప్లే లో పాత్రల పరమైన, కథా కథనాల పరమైన లోపాలన్నిటినీ తొలగించుకుని పూర్తి ప్రొఫెషనలిజం ఉట్టిపడేలా తీసి వుంటే, ఫలితాలు చాలా చాలా బావుండేవి. తనూ నిర్మాతా శ్రీకాంత్ ఎక్కడో వుండేవాళ్ళు!

--సికిందర్
(స్క్రీన్ ప్లే సంగతులు : సోమవారం)