రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

14, ఏప్రిల్ 2016, గురువారం

రివ్యూ!


దర్శకత్వం : జి. నాగేశ్వర్ రెడ్డి

తారాగణం : విష్ణు మంచు, సోనారికా భడోరియా, రాజ్ తరుణ్, హెబ్బా పటేల్, రాజేంద్ర ప్రసాద్, రవిబాబు, పోసాని, అభిమన్యు  సింగ్, సుప్రీత్ తదితరులు
కథ : ‘క్యారీ ఆన్ జట్టా’ పంజాబీ రీమేక్, మాటలు : డైమండ్ రత్నం
సంగీతం : సాయి కార్తీక్, ఛాయాగ్రహణం : సిద్ధార్థ్, కూర్పు : ఎం ఆర్ వర్మ
బ్యానర్ : ఏకే ఎంటర్ టైన్మెంట్స్, నిర్మాత : సుంకర రామబ్రహం
విడుదల : 14  ఏప్రెల్, 2016
***
         కామెడీ సినిమాల దర్శకుడు జి. నాగేశ్వర్ రెడ్డి మరో కామెడీతో అదీ- విష్ణు, రాజ్ తరుణ్ ల కాంబినేషన్ తో నవ్వించడానికి వచ్చేశాడు. కాంబినేషన్ క్రేజీగానే వుంది, టైటిల్  కూడా బాక్సాఫీసు బద్దంగా వుంది. సినిమాలో విషయమెలా వుంది? ఇదే చూద్దాం...


కథ :
      లాయర్ నారాయణ (రాజేంద్రప్రసాద్) చిన్న కొడుకు అర్జున్( విష్ణు), సీఐ కోటేశ్వరరావు (పోసాని) ఏకైక కుమారుడు  అశ్విన్ ( రాజ్ తరుణ్) లు క్లోజ్ ఫ్రెండ్స్. పనీ పాటా లేక తిరుగుతూంటారు. ఓ రోజు ఓ ఫ్రెండ్ ( వెన్నెల కిషోర్) పెళ్ళికి వెళ్ళినప్పుడు అక్కడ చెరో అమ్మాయిని చూసి ప్రేమలో పడతారు. నీలవేణి (సోనారికా) వెంట విష్ణు పడతాడు, సుప్రియ (హెబ్బా పటేల్) వెనుక అశ్విన్ పడతాడు. నీలవేణితన అక్కకి జరిగింది దృష్టిలో పెట్టుకుని పెళ్ళంటూ చేసుకుంటే అనాధనే చేసుకోవాలనుకుంటుంది. తన అక్కని వేధించి చంపినట్టు అత్తామామలు వుండ కూడదనుకుంటుంది. దీంతో అర్జున్ తను అనాధననే చెప్పుకుని ఆమెకి దగ్గరవుతాడు. ఆమె తీసికెళ్ళి  అన్నకి విషయం చెప్తుంది. ల్యాండ్ దందాలు, సెటిల్మెంటు చేసే ఆమె అన్న గజన్న  ( అభిమన్యు సింగ్) కి అనాధ అయిన అర్జున్ వెంటనే నచ్చేసి వెంటనే పెళ్లి చేసేస్తాడు. ఈ ఊహించని సంఘటన ఇంట్లో చెప్పుకోలేక పోతాడు అర్జున్. 

         నీలవేణి కాపురం పెట్టడం కోసం అద్దె ఇల్లు మాట్లాడుతుంది. ఆ అల్లు అర్జున్ దే. అతడి తండ్రి లాయర్ నారాయణకి ఆమె నచ్చి పై పోర్షన్ అద్దెకిచ్చేస్తాడు. ఇటు ఆమె అద్దెకి తీసుకున్నది తన ఇల్లే నని నీలవేణికి చెప్తే తను అనాధ కాదని ఆమెకి తెలిసిపోతుందన్న భయంతో ఆ డీల్ చెడగొట్టడానికి అశ్విన్ సహాయం తీసుకుంటాడు. అదీ పారకపోవడంతో అశ్విన్ నే తన భార్యకి భర్త గా తన ఇంట్లోనే దింపుతాడు అర్జున్.

          నిజంగా అశ్విన్- నీలవేణిలు భార్యాభర్తలే అని అర్జున్ తండ్రి తో బాటు అన్న (రవిబాబు), వదిన, పని మనిషి కూడా నమ్మేస్తూంటారు. ఫ్రెండ్స్ ఇద్దరూ ఆడుతున్న నాటకం నీలవేణికి కూడా తెలీదు. కానీ ఈ ఇద్దరితో నీలవేణి కి జరుగుతున్న  సంఘటనలకి ఇంట్లో బోలెడు కన్ఫ్యూజన్ ఏర్పడుతుంది. దీని అంతు  తేల్చాలని నారాయణ చూస్తూండగానే, అశ్విన్ సుప్రియని పెళ్లి చేసేసుకుంటాడు. కానీ ఇంట్లో తనకి ‘భార్య’ గా నీలవేణి వుంది కాబట్టి,  మళ్ళీ ఫ్రెండ్స్ ఇద్దరూ మాట్లాడుకుని సుప్రియకి తెలీకుండా ఆమెని ఇంకో అబద్ధంతో అర్జున్ భార్యగా దింపుతారు. 

          ఇలా అబద్ధాలు పెరిగిపోతూ వాటితో చిక్కు ముళ్ళూ పెంచుకుంటున్న  అర్జున్- ఆశ్విన్ లు ఎలా వీటిలోంచి బయటపడ్డారన్నదే మిగతా కథ.

ఎలావుంది కథ
          కథ పాతకాలం నాటిదే. పంజాబీలో సినిమాగా 2012 లో  విడుదలై ఆ సంవత్సరం అతి పెద్ద హిట్ గా నమోదయ్యింది. దాన్ని తీసిన యువదర్శకుడు ట్రెండీ లుక్ తో తీశాడు. తెలుగులో ఇంకా పాత  వాసనేస్తూ తాజాదనానికి దూరంగా ఉండిపోయింది. కామెడీ ఆఫ్ ఎర్రర్స్ ప్రక్రియని   తెలుగులో ఈ మధ్య అదేపనిగా కన్ఫ్యూజ్ కామెడీగా పలచన చేయడంతో, ఆ వరసలో ఇది అలాటి మరో కన్ఫ్యూజ్ కామెడీయే తప్ప మరోటి కాదు. సిట్యుయేషనల్ కామెడీగా వచ్చే కొన్ని సీన్లూ, మలుపులూ మాత్రం బాగా నవ్వించేట్టుగా వున్నాయి. అదే సమయంలో ద్వంద్వార్ధాలూ తక్కువేం లేవు. ఈ కథ 1994లో  అమీర్ ఖాన్ - సల్మాన్ ఖాన్ లతో వచ్చిన ‘అందాజ్ అప్నా అప్నా’ కామెడీ ఆఫ్ ఎర్రర్స్ ని గుర్తుకు తెచ్చే ధోరణిలో కూడా వుంది. 

ఎవరెలా చేశారు
          ‘బడ్డీ మూవీ’ ఇది. ఫ్రెండ్స్  అయిన ఇద్దరు పాపులర్ హీరోలు తమ పాత్రలతో ఒకళ్ళ నొకళ్ళు ఆదుకునే ప్లేతో ఆకట్టుకునే జానర్ లో విష్ణు- రాజ్ తరుణ్ ల బ్రోమాన్స్ ఇంకాబాగా కుదరాల్సింది- బడ్డీ మూవీస్ లో ఇలాటి పాత్రల ప్రెజంటేషన్ ని గమనించి ఆ మేరకు నటింప జేసి వుంటే-  చాలా క్రేజీగా, ట్రెండీ గా వుండే వాళ్ళు. కామెడీ తప్ప మరో విషయం లేని ఈ సినిమాలో విష్ణు నటన అలవాటయిన మూసపాత్ర ధోరణి లోనే వుంది. అలాగే రాజ్ తరుణ్ కూడా. పాత్రలు తూర్పు పడమరలై వుంటే ప్లే- నటనా  ఇంకా బాగా వుండేవి. దర్శకుడు నాగేశ్వర్ రెడ్డి ఎందుకో పాత్రలకి ఫ్రీ హేండ్ ఇవ్వలేదు. ఇచ్చి వుంటే విష్ణు- రాజ్ తరుణ్ లు ఈ కామెడీని మరొక లెవెల్ పైకి తీసి కెళ్ళే వాళ్ళు. 

          హీరోయిన్లిద్దరూ వాళ్లకి తెలీని హీరోలు ఆడుతున్న ఆటకి ఉపయోగపడ్డారు తప్ప వాళ్ళకి వేరే పాత్ర చిత్రణలు లేవు. ఉండుంటే టాలెంట్ ఏంటో బయటపెట్టుకునే వాళ్ళు. రాజేంద్ర ప్రసాద్ మాత్రం సెంట్రల్ క్యారక్టర్ గా కథని నిలబెట్టడానికి కృషి చేసే పాత్రలో పూర్తి స్థాయి కమెడియన్ గా చాలాకాలం తర్వాత కన్పిస్తాడు. కొడుకుగా  రవిబాబు కామేడీ కూడా ఫర్వాలేదు. పోసానీ రొటీన్.

           ఇక సంగీతం, కెమెరా వగైరాలగురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ప్రొడక్షన్ విలువలు అతి సాధారణంగా, డబ్బు చాలా పొదుపు చేసినట్టుగా వున్నాయి. డైమండ్  రత్నం రాసిన మాటలు పాత్రల్ని బట్టే మూస ధోరణిలో వున్నాయి.

చివరికేమిటి 

       ఈ  పాత కథతో రీమేక్ ఒరిజినల్ అంత సక్సెస్ కాకపోవచ్చుగానీ ఫ్లాప్ మాత్రం కాదు.  ఈ పాతలోనే చాలా చోట్ల స్పార్క్ వుంది- రంగమ్మ హోటల్లో కూర్చుని పిజ్జా తింటున్నట్టు. పది చోట్ల ఇలాటి  తృప్తి మిగిల్చే ఈ కామెడీని చూస్తే వచ్చే నష్టమేమీ లేదు. ‘ఈడో రకం- ఆడో రకం’ అని టైటిల్లో వున్నట్టు తేడాలు హీరోల పాత్రలకి కూడా కల్పించి వుంటే, కనీసం టైటిల్ కైనా న్యాయం చేసినట్టు వుండేది.

-సికిందర్
http://www.cinemabazaar.in