రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

21, మే 2016, శనివారం

స్క్రీన్ ప్లే సంగతులు -4

బిగినింగ్ లేకపోతే ఎండింగ్ లేదు, ఏదైనా మొదలెడితే కదా ముగించడానికి...ఎండింగ్ డైనమిక్ గా, కమర్షియల్ గా వుండాలని ఆశిస్తాం. బిగినింగ్స్ డైనమిక్ గా, కమర్షియల్ గానే వుండొచ్చు. కానీ బిగినింగ్ లో విషయం లేకపోతే ఎండింగ్ ఎంత డైనమిక్ గానూ , కమర్షియల్ గానూ  వున్నా అందులోనూ  విషయముండక బలహీనంగా వుంటుంది. ఐతే  విషయమూ లేక, డైనమిక్సూ కమర్షియాలిటీ కూడా లేక  పేలవమైన ఎండింగ్ తో ఓ సినిమా ఎదురైతే  అదెలా వుంటుంది? సరీగ్గా ‘తని ఒరువన్’ లా వుంటుంది. యథా ప్లాట్ పాయింట్ వన్ తథా ఎండింగ్ అని అన్నారిందుకే...
To hell with plot point-1
We have our own ‘paatlu’!

          చూసే వాళ్ళు  మూర్ఖులని తీసే వాళ్ళు నమ్మి, తీసేవాళ్ళు తెలివైన వాళ్ళని  చూసే వాళ్ళూ నమ్మి,  పరస్పరం వాళ్ళూ వాళ్ళూ మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుని సినిమాల్ని ఆడిస్తూంటే మధ్యలో మనమేం చేయగలం, ఇలా రాసుకోవడం తప్ప?  సినిమా హిట్టయ్యాకా ఇంకా ఈ రాతలు చూసి నల్గురూ నవ్విపోతారు. ఏదో సరదా రౌండేసి వద్దామని సర్ది చెప్పుకుని రాయడం మొదలెట్టామే గానీ, మొదలెట్టాకా గానీ తెలీలేదు ఇదో థర్డ్ డిగ్రీ  టార్చర్ అని.  ఇన్ని చిక్కు ముళ్ళున్న  వ్యవహారం ‘పోలీస్’  తర్వాత ఇదే.  ఏ పోటీ పరీక్షల్లోనో దీన్ని  ప్రశ్నాపత్రంగా  పెడితే,  మొత్తం అందరూ ఫెయిలైపోయి ఉద్యోగాలిచ్చే బాధ తప్పిపోతుంది!

        కథానాయకుడు మిత్రన్ ప్లాట్ పాయింట్ వన్ దగ్గర తప్పించుకుని బై పాస్ రోడ్లో ఎలాగో మిడిల్లో పడ్డాడు కదా, ఇక ఎండ్ కి చేరక పోతాడా, అక్కడ దొరక్క పోతాడా అని చూస్తూంటే,  ఓ  టోల్ గేట్ దగ్గర అడ్డంగా దొరికిపోయాడు. ఇప్పుడు చెప్పు, ఏమిటి నువ్వు చెప్పాలనుకుని చెప్పలేక తప్పించుకుని తిరుగుతున్నది- అని నిలేస్తే, నాకేమీ తెలీదు -నేను అమాయకుణ్ణి- నిర్దోషినీ -ఇంకేదో-  అని రాగాలు తీశాడు. మరెందుకలా మొత్తమంతా తిరిగేస్తున్నావంటే, డైరెక్టర్ వైపు వేలు చూపిస్తాడు. డైరెక్టరేమో తొమ్మిది నెలలు కష్ట పడ్డానంటాడు. కానీ జన్యు పరమైన లోపాలతో పుట్టింది స్క్రిప్టు. ఆ జనెరిక్ మందులూ, డయాబెటిస్ ఫార్ములా వగైరావగైరా ఏవో  ముందు దీనికే  వాడాలేమో చూడాలిగా! 

        ఈ  ప్లాట్ పాయింట్లూ మన్నూ మశానాలూ  మాకనవసరం బాస్, మా పాట్లు మాకుంటాయి- ఎంతో పాటుపడి సినిమాల్ని ఎలాగో గట్టెక్కించుకుంటాం, మందుమాకులూ  మాకివ్వొద్దు ప్లీజ్ –అని తిరగబడ్డా  ట్రీట్ మెంట్ ఇవ్వక తప్పదు, ధర్మ సంస్థాపన కోసం. 

        కథా సూత్రాలు  ఎవరో ఆకాశంలోకి  చూస్తూ ఆలోచించలేదు. విజయవంతమైన సినిమాలు చూసే,  అవి ఎలా వుండి విజయవంతమవుతున్నాయో వాటి ప్రకారం స్ట్రక్చర్ ని తీసే, స్కెచ్ వేశారు. పుస్తకాలూ రాస్తున్నారు, పాఠాలూ బోధిస్తున్నారు. న్యూటన్ ఆకాశంలోకి చూస్తూ గురుత్వాకర్షణ సిద్ధాంతం చేయలేదు. ఆపిల్ పండు నెత్తి మీద పడితేనే ఆ సిద్ధాంతం తట్టింది. దృగ్గోచరంగా వున్న  వాటిలోంచే శాస్త్రాలు పుట్టాయి, పుడుతున్నాయి.  దీన్ని కాదనుకునే  వాళ్ళే కథ ఎలా తయారు చేయాలా అని ఆకాశంలోకి చూస్తూ, ఊహాగానాలతో పేజీలు  నింపు కుంటున్నారు...స్వకపోల కల్పితాలతో  నూటికి 90 శాతం ఫ్లాపులు తీస్తున్నారు, తీస్తూనే వుంటారు. దీనికి ముగింపు లేదు.

                                                          ***
          ఎండ్ : మిడిల్ ముగుస్తూ ప్లాట్ పాయింట్ టూ దగ్గర తన ఛాతీలోనే బగ్ అమర్చారని తెలుసుకున్న మిత్రన్ వెంటనే దాన్ని తీసేయించుకోడు. దాంతో అభిమన్యుతో కౌంటర్ గేమ్ మొదలెడతాడు. ఇది మంచి డైనమిక్స్. ఈ ఎండ్ విభాగంలో పక్కాగా అభిమన్యుని వలలో  బిగించే వివిధ ప్రయత్నాలే జరుగుతాయి. ఈ కథా పథకం బావుంది. ఇలా ఎండ్ విభాగం బిజినెస్ ముందు బ్రహ్మాండంగా కన్పిస్తుంది. కొన్ని విషయాలు సెటిల్ చేసుకోవాల్సి వుంది. మిడిల్ విభాగంలో తన కొలీగ్ ని చంపిన విక్కీ అనే అభిమన్యు అనుచరుడి సంగతి చూడాల్సి వుంది. అందుకు ఫలానా చోట వున్న విక్కీని అరెస్టు చేయాలనీ కొలీగ్స్ తో కావాలని మిత్రన్ మాట్లాడుతూ అభిమన్యుని ట్రాప్ చేస్తాడు. బగ్ ద్వారా ఇది విన్నఅభిమన్యు , విక్కీ అరెస్ట్ అయి తన గుట్టు విప్పకుండా వెంటనే వెళ్లి చంపేస్తూ కెమెరాకి చిక్కుతాడు. 

        ఏమిటిది? పోలీస్ అధికారిగా హీరో పాత్రకి నైతికపరంగా ఇది కరెక్టేనా? కొలీగ్ ని విక్కీ చంపినంత మాత్రానా అభిమన్యు ని ట్రాప్ చేసి,  అతడి  చేత విక్కీని చంపేలా రెచ్చగొట్టి ఇరికించడం న్యాయమేనా? ఇది తను చేయించిన మర్డర్ కాదా? తనూ మిగతా కొలీగ్స్ తమ కొలీగ్ ని విక్కీ ఎలా డ్రగ్స్ కుక్కి చంపాడో, అలాటి  శాడిజంతో  డ్రగ్స్ కుక్కి,  అభిమన్యుని ట్రాప్ చేసి, అతడి చేత చంపించారంటే,  ఆటవిక న్యాయాన్ని అమలు చేస్తున్నారా? ఓ పోలీసు అధికారిగా  కాకుండా హీరో బాధితుడైన సగటు పౌరుడిగా చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్నాడంటే అర్ధముంది. ఇలా పోలీసు అధికారిగా హీరో చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని చంపడం ఏ సినిమాల్లోనూ రాలేదు. 

        ఇక మిత్రన్ కి ఫార్మాసిస్ట్ హత్యా దృశ్యాలున్న ఎస్డీ కార్డు దొరకడం ఒక మలుపు. కానీ అభిమన్యు గర్ల్  ఫ్రెండ్ కి మహిమ వెళ్లి,  అభిమన్యు ఆమె తండ్రిని చంపి ఎలా ఆమెని తన మీద  ఆధార పడేలా చేసుకున్నాడో చెప్పడం బ్యాడ్ రైటింగ్. ప్రతీ చోటా మహిమ పాత్ర చిత్రణ అర్ధరహితంగానే వుంటోంది. ఈమె గర్ల్ ఫ్రెండ్ కి ఇలా చెపితే, ఇది క్లయిమాక్స్ లో ఆ గర్ల్ ఫ్రెండ్ అభుమన్యు ని చంపి షాకివ్వడానికి లీడ్ సీన్ గా ఉంటుందని భావించి నట్టుంది. కానీ క్లయిమాక్స్ లో అది పండకపోగా, ఇక్కడ మహిమ ఇలా చెప్పడం ప్రశ్నార్ధకంగా మారింది. ఎంతసేపూ మిత్రన్ తెర వెనుక వుండి ప్రాక్సీ హత్యలు చేయిస్తున్నాడు. దీని ఫలితం క్లయిమాక్స్ లో అనుభవించాడు కథ తను ముగించలేక. లేకపోతే పని గట్టుకుని మహిమని పంపించి గర్ల్  ఫ్రెండ్ కి అలా చెప్పించడంలో ఉద్దేశ మేమిటి? 

        ఇక మిత్రన్ చనిపోయిన ఫార్మాసిస్టు చేసిన డయాబెటిస్ మందు పరిశోధనా వివరాలతో
,  ‘ఇంటలెక్చువల్ ప్రాపర్టీస్ ఇండియా’  అనే కల్పిత సంస్థకి వెళ్ళే డైనమిక్స్ కూడా డీలా పడిపోతుంది. 

        ఇక్కడ పేటెంట్ హక్కుల సమస్య మింగుడు పడకుండా  వుంటుంది- ఆమె డయాబెటిస్ కి మందు కనిపెడితే, అది ఆమె పనిచేసిన అభిమన్యు  కంపెనీ ప్రాపర్టీ  అవుతుంది. దాని మీద హక్కులు తనకి దఖలు పడే విధంగా అగ్రిమెంటు లేనప్పుడు ఆమె వాదన చెల్లకుండా పోతుంది. ఎంత కనిపెట్టినా ఆమె ఆ కంపెనీలో ఉద్యోగినియే. ఆర్ అండ్ డీ కోసం కంపెనీలు వందల కోట్లు ఖర్చు పెట్టి  మందులు కనిపెడతాయి. అలాంటప్పుడు ఉత్తపుణ్యానికి ఆదామె సొంతమెలా అవుతుంది?

        ఇక్కడ ఆమెతో అతడికి అసలు గొడవేమిటంటే, తను కనిపెట్టిన ఆ మందుని అతను యాంజలీనాని చంపి కొనుగోలు చేసిన కంపెనీ ద్వారా ప్రపంచమంతా మార్కెట్ చేసుకుంటాడని. ఆ డయాబెటిస్ మందు మన దేశం దాటి వెళ్ళిపోతే మనం కొనుక్కోలేనంత  ఖరీదైపోతుందని.  దీన్ని జనెరిక్ మందుగా దేశంలోనే చవగ్గా అమ్మాలని. ఇదంతా ఆమె సెంటిమెంటల్ వాదన. ఆ మందు మీద ఆమె మమకారం అర్ధవంతంగా ఉండాలంటే, దాని మీద ఆమె దగ్గర లిఖిత పూర్వక యాజమాన్య హక్కులుండాలి.  

        ఆ కల్పిత సంస్థ అధికారులు మేం ఓకే చేస్తాం  పొమ్మంటారు. వాళ్ళదేం పోయింది, తాంబూలా లిచ్చేశాం తన్నుకోమంటారు. అది ఓకే అవడానికి దశాబ్దాలు పడుతుంది. ఒక తరం మధుమేహ వ్యాధి పీడితులంతా స్వర్గస్థులై వుంటారు అక్కడ ఫార్మాసిస్టుని వెతుకుతూ.
        అసలు దీన్ని ఇంత  ఇష్యూ చేయడం అవసరమా- ఇప్పటికే ఈ కథలో రకరాల టాపిక్స్ పైన ఎన్ సైక్లోపీడియా లెక్చర్లిచ్చి తలబొప్పి కట్టించింది చాలదా? పొసగని పేటెంట్ హక్కుల గొడవ లేకుండా, ఆ మందు ఫార్ములా తను దుర్వినియోగం చేస్తాడని ఆమె లాబ్ దాటించేస్తుందని అనుమానించి, చంపేశాడని చెప్పేస్తే చాలదా సింపుల్ గా?

                                    ***
       ఈ డయాబెటిస్ మందు పేటెంట్ హక్కుల గొడవ  తర్వాత,  తర్వాతి సీను జనెరిక్ మందుల మీదికి మళ్ళుతుంది!!
        మళ్ళీ ఉపోద్ఘాతం: స్వర్గీయ యాంజలీనా తో జరిగిన అప్పటి ఒప్పందాన్ని గౌరవిస్తామనీ, త్వరలో ఆమె కంపెనీ నుంచి జనెరిక్ మందులు మనకి అందుతాయనీ గౌరవ ముఖ్యమత్రి పూల్మణి ఉద్ఘాటన !

        ఇంకెక్కడి  యాంజలీనా కంపెనీ! ఆమెని చంపేసి అభిమన్యు ఎప్పుడో ఆ కంపెనీని కొని పారేసి వేరే గ్రాండ్ ప్లాన్స్ తో వున్నాడు -ఇంకెక్కడి జెనరిక్ మందులు! ఇంకెక్కడి రాష్ట్ర ఆరోగ్య రంగంలో విప్లవాత్మక మార్పులు! 

        అయినా దీన్ని బేస్ చేసుకుని తర్వాతి డైనమిక్స్ బావున్నా, బేస్ కే అర్ధం లేకపోవడంతో అవి కూడా తేలిపోతాయి. జనెరిక్ మందుల ఆగమనం గురించి గొప్పగా సభ ఏర్పాటవుతుంది. ఇందులో మంత్రి సెంగల్వ రాయన్ ప్రసంగించాలి. ఏం ప్రసంగించాలో అభిమన్యు నోట్ రాసేస్తాడు. ఆ నోట్ ని తను రాసిన వేరే నోట్ తో అభిమన్యు గర్ల్ ఫ్రెండ్ చేత మార్పించేస్తాడు మిత్రన్. ఈ నోట్ చదివేస్తూంటాడు మంత్రి సెంగల్వ రాయన్. ఇందులో దొంగలందరూ దొరికిపోయే వివరాలే వుంటాయి. అలా చదివేస్తూ మంత్రి ముఖ్యమంత్రి ఆగ్రహానికి గురవుతాడు. నా కొడుకు ఇలా రాశాడేమిటీ  అని మంత్రి గుండెపోటు నటించి హాస్పిటల్లో పడతాడు. ఇలా ఈ డైనమిక్స్ బావున్నా, అసలు యాంజలీనా కంపెనీయే లేనప్పుడు ప్రభుత్వం ఈ సభ ఏర్పాటు చేయడమనే బేస్ హాస్యాస్పదమవడంతో, ఈ ఉత్తుత్తి బేస్ ని ఆధారం చేసుకున్న  ఈ డైనమిక్స్ లో అన్ని చర్యలూ తేలిపోయాయి. 

        ఇంతకీ అభిమన్యు రాసిన అసలు నోట్ లో వున్న విషయమేమిటి? అది మిత్రన్ చేజిక్కించుకున్నాడు కదా, మరి అందులో ఏముందో చూడలేదా? ఇది చూపించాలిగా ప్రేక్షకులకి? అభిమన్యు పాజిటివ్ గా రాశాడా? జనెరిక్ మందులు రావడం ఇష్టంలేని తను పాజిటివ్ గా ఎందుకు రాస్తాడు? పోనీ నెగెటివ్ గా రాశాడా? మిత్రన్ కూడా నెగెటివ్ గానే రాసి మంత్రి చేత చదివించాడుగా, ఇద్దరూ నెగెటివ్ గానే రాసినప్పుడు ఈ సీన్ కి అర్ధమేం వుంది? అంటే అభిమన్యు ఏం రాయాలో దర్శకుడు తేల్చుకోలేక, ఆ నోట్ ని కప్పిపుచ్చుతూ-  మిత్రన్ నోట్ తో మ్యాజిక్ చేస్తే సరిపోతుందనుకున్నాడా! అభిమన్యు నోట్ ఉంటేనే మిత్రన్ నోట్ తో సీన్ వస్తుంది- అభిమన్యు నోట్ ఏంటో తెలీకపోతే మిత్రన్ నోట్ తో మంత్రి సీనే వుండదు! ఇటీజ్ ఈజ్ యాజ్ సింపుల్ యాజ్ దట్. 

        ఈ మొత్తం ప్రహసనం – దీని పర్యవసానంగా చైన్ రియాక్షన్ గా వచ్చే అభిమన్యు తన తండ్రి సెంగల్వ రాయన్ ని చంపించే సీను, తండ్రి చావుని సీఎం మీదికి తోసి అరెస్ట్ వారెంట్ రాకుండా అభిమన్యు బ్లాక్ మెయిల్ చేసే సీనూ, ఆ తర్వాత తండ్రి చితాభస్మంతో ఇంకో సీనూ హాస్యాస్పదంగా మారాయి!

        ప్రభుత్వ ప్రకటన దగ్గర్నుంచి, చితాభస్మం వరకూ ఈ మొత్తం సీక్వెన్స్  ఇక్కడ అవసరమే లేదు. ఇది ఎండింగ్ విభాగం 50 నిమిషాలదాకా చాంతాడంత పెరిగేందుకే పనికొచ్చింది తప్ప కథకి మరే ఉపయోగమూ లేదు. 

        మిత్రన్ దగ్గర వున్న  రెండు సాక్ష్యాధారాలు - ఫార్మాసిస్టుని, విక్కీనీ అభిమన్యు చంపిన రికార్డింగ్స్- కూడా కోర్టులో పనికి రానివే. ఇదెలాగో తర్వాత చూద్దాం. 

        సభలో అలా నోట్ చదివినందుకు ఆగ్రహంతో అభిమన్యు తండ్రి కారుని యాక్సిడెంట్ చేయించి చంపించినట్టు చూపిస్తారు. కారు భస్మీపటలమవుతుంది. మంత్రి చితాభస్మం పెట్టి పోలీసు గౌరవ వందనంతో అంత్యక్రియలు చేస్తారు. ఆ చితాభస్మమున్న కలశాన్ని అభిమన్యు అందుకుంటాడు. సీఎం కనుసైగతో మిత్రన్ ఆ కలశాన్ని లాక్కుని, అభిమన్యు చేతిలో తన ఛాతీ లోంచి తీయించుకున్న బగ్ పెడతాడు. అభిమన్యు షాక్ అవుతాడు. అరెస్ట్ హిమ్  అంటాడు  సీఎం.  అభిమన్యుని  అరెస్ట్ చేస్తాడు మిత్రన్.

***
    వెంటనే కోర్టు సీను. ఇక్కడ అభిమన్యు చేశాడని చెప్తున్న ఆ రెండు (ఫార్మాసిస్టు, విక్కీ)  హత్యా దృశ్యాల వీడియోల  ప్రదర్శన. ఫార్మాసిస్టు వీడియోలో గాయపడివున్న ఆమె, తను కనిపెట్టిన డయాబెటిస్ మందుతో అభిమన్యు చేస్తున్న కుట్ర గురించి స్టేట్ మెంట్. అంతలో ఆమె వెనక దూరంగా కర్ర పట్టుకుని తిరుగుతున్న అభిమన్యు షాట్. దీంతో కట్. 
        విక్కీ హత్యా దృశ్య వీడియోలో, అభిమన్యు అతణ్ణి కాల్చి చంపడానికి ముందు అతను  ఇస్తున్న స్టేట్ మెంట్. ఆ స్టేట్ మెంట్ లో మిత్ర కొలీగ్ ని అభిమన్యు ఆదేశాలతో తనే చంపినట్టు ఒప్పుకోలు. 

         వీటితో పాటు ఇంకా ఇతరుల మౌఖిక సాక్ష్యాలూ విన్న జడ్జి- నోరు విప్పకుండా కూర్చున్న అభిమన్యు తో- రేపటికల్లా నువ్వు నోరు విప్పక పోతే నీ మీద ఈ అభియోగాల్ని నేను అంగీకరిస్తాను- అంటాడు. అతణ్ణి సబ్ జైలుకు పంపమని ఆదేశిస్తాడు. 

        ఇక్కడే వుంది ప్రేక్షకుల్ని మాయ చేయడమంతా! అసలుకైతే ఇక్కడ ఈ కోర్టు హాలు కాకలుతీరిన అభిమన్యు లాయర్ల బృందంతో నిండిపోవాలి. మిత్రన్ ని గడగడ లాడించాలి.  

        1. ఏదీ ఆ అమ్మాయి వీడియోలో అభిమన్యు ఆమెని చంపుతున్నట్టు ఎక్కడుంది? దూరంగా కర్ర పట్టుకు తిరుగుతున్నంత మాత్రానా అతను  చంపినట్టా?
        2. విక్కీ వీడియోలో అతనిచ్చిన స్టేట్ మెంట్ ఎవరికిచ్చాడు? ఆ సమయంలో అక్కడ ఇంకెవరున్నారు? ఆ స్టేట్ మెంట్ ని తనని చంపడాని కొచ్చిన అభిమన్యు కైతే ఇవ్వడుగా? అది సీసీ కెమెరా అయితే ముందు నుంచీ  వెనక నుంచీ షాట్లు ఎలా తీసింది? 

        ఈ ప్రశ్నలు చాలు,  మిత్రన్ తను క్లియర్ గా కిల్లర్ గా దొరికిపోయేట్టున్నానని  కోర్టు లోంచి లాంగ్ జంప్ చేసి, అటుపైన స్క్రీన్ ప్లేలో టోల్ గేట్లన్నీ తోసుకుంటూ దర్శకుడికి  ఇక దొరక్కుండా, వాటంగా 100 k రన్ మొదలెట్టడానికి! గాడ్డామిట్, ఏం చేస్తాడు- బైపాస్ రోడ్డు కూడా పనికి రావడం లేదాయె!      

        కానీ - కానీ- జడ్జి కూడా అభిమన్యు ని లాయర్ గురించే అడగడు. మిలార్డ్, దయచేసి మీరు మాత్రం అభిమన్యుని నీ లాయర్స్ ఏరీ? అని అడక్కండి, నా స్క్రీన్  ప్లేకి చాలా ఇబ్బంది- అని దర్శకుడు అనివుంటాడు. సినిమా బాగా ఆడాలని జడ్జి తలూపి ఉంటాడు. 

        అంత  షార్ప్ స్టయిలిష్ మాస్టర్ మైండ్ అభిమన్యు  కూడా ఆ వీడియోల భాగోతం  చూసి- పోనీలే హీరోగాడు బతుకుతాడు- అనుకుని నోర్మూసుకుని కూర్చుని ఉంటాడు. 

        అసలు ఆ వీడియోలు చూస్తూనే జడ్జికి ఇది అల్లాటప్పా కేసు అని అర్ధమైపోవాలి-మిత్రన్ పసి మనస్సుతో  ఏదో తప్పు చేశాడు, నీ మీద అభియోగాల్ని కొట్టి వేస్తున్నాను, నువ్వింటి కెళ్ళిపో! -అని అభిమన్యుని విడుదల చేసేయాలి. అప్పుడు అభిమన్యు సరదాగా వెళ్ళిపోయి, మిత్రన్ బ్యాంకులో స్థంభింప జేసిన  ఆ 7.5 బిలియన్ డాలర్లకి పరువునష్టం దావా వేసి మోత మోగించవచ్చు- ఇలాగే వుంటాయి పాత్రల సహజ రియాక్షన్స్.  

        మిత్రన్ ఎంత నిర్లక్ష్యంగా కేసు పెట్టాడో ఇంకా చెప్పుకుంటే- అభిమన్యు విదేశీ కంపెనీ యాజమనురాలు యాంజలీనాని  చంపించాడు. దీని ఊసే లేదు! అదే సమయంలో అభిమన్యు జరిపించిన దాడిలో మిత్రన్ ప్రాణాపాయ స్థితిలోకి వెళ్ళాడు, దీని ప్రసక్తే లేదు!!

        కథలో ఈ రెండు ప్రధాన సంఘటనలని వదిలేసి ఇంకేవో కేసులు పెడితే దీన్ని కథ అనాలా, కాకమ్మ కబుర్లు  అనాలా? 

        ఇక జడ్జి అభిమన్యుని సబ్ జైల్లో పెట్టి రేపు హాజరుపర్చ మంటాడేగానీ, పోలీస్ కస్టడీకి ఇవ్వలేదు. అభిమన్యు జ్యూడీషియల్ కస్టడీలో వుంటే, మిత్రన్ సబ్ జైలుకెళ్ళి సబ్ జైల్లో డీల్ కుదుర్చుకుంటాడు!

        అసలు అభిమన్యుని జైల్లో పెట్టాక మిత్రన్  కొలీగ్స్ ఆవేశ పడిపోతారు వాణ్ణి చంపాలని. ఎందుకంటే వాడు ఎస్డీ కార్డు కోసం తమ కొలీగ్ ని విక్కీ తో చంపించాడు గనుక.  రేపు కోర్టుకు తీసుకు పోతున్నప్పుడు ఎన్ కౌంటర్ చేస్తామంటారు. రాజ్యాంగం తమ  కిచ్చిన అధికారాన్ని వాడుకుని- విక్కీని అభిమన్యు చేత పథకం ప్రకారం చంపించింది గాక,  మళ్ళీ  ఇప్పుడు అభిమన్యుని ఎన్ కౌంటర్ చేస్తారట.  ఆదర్శాలు వల్లించుకుని నిజాయితీగల పోలీసాఫిసర్లలా  నిన్నగాక మొన్న కొత్తగా జాయినై, అప్పుడే కరుడు గట్టిన పోలీసుల్లా న్యాయస్థానాన్ని  బుకాయించడానికి తెగిస్తున్నారు. ఇదీ చట్టాలంటే ఈ ఆదర్శ పాత్రల కున్న గౌరవం. అభిమన్యుని చంపాలనుంటే యూనీఫామ్స్ తీసేసి ఎపుడో చంపెయ్యాలి- వ్యక్తి గత కక్షలకి అధికారాన్ని వాడుకునే ఇవేం ఆదర్శపాత్రలు. చట్ట ప్రకారం శిక్షించడానికి స్ట్రగుల్ చేస్తూంటే సానుభూతి అయినా దక్కుతుంది,  గొప్పోళ్ళనిపించుకునే అవకాశముంది.
***
        క జైల్లో అభిమన్యుతో డీల్-  మిత్రన్ రూమ్ లోకి రాగానే అభిమన్యు టేబుల్ మీద కాళ్ళు బార జాపుకుని కూర్చుని ఉంటాడు. ఈ సెషన్ మొత్తం ఇలాగే కూర్చుని ఉంటాడు. తన ప్రత్యర్ధి, ఇప్పుడు నిందితుడూ  అయిన అభిమన్యు అలా కూర్చుని వుంటే, తానొక ఐపీఎస్ అధికారి నన్న ఫీలింగ్ కూడా లేకుండా, అతడి ముందు కూర్చుని మాట్లాడు తూంటాడు మిత్రన్. సమఉజ్జీ అయిన శత్రువుని కోరుకున్నమిత్రన్, తనే సమఉజ్జీగా వుండడు. ఇంకొకరైతే రాగానే రెండు పీకి, సరిగ్గా కూర్చోబెట్టే వాళ్ళు అభిమన్యుని. పాత్ర చిత్రణలు, సన్నివేశ కల్పనలు ఇలా వున్నాయి. 


       ఇక్కడ మళ్ళీ డేటా ప్రదర్శన. తన సిండికేట్ లో వున్న ఘరానా వ్యక్తులు ఎవరో చెప్ప మంటాడు మిత్రన్. ఈ సీను చాలా సేపు సాగుతుంది. సారాంశ మేమిటంటే, రేపు కోర్టుకి తీసుకుపోతున్నప్పుడు అభిమన్యుని పోలీసులు ఎన్ కౌంటర్ చేయాలనుకుంటున్నారు, ఇప్పుడు గనుక తను డేటా ఇచ్చేస్తే మిత్రన్ ఆ ఎన్ కౌంటర్ లోంచి కాపాడతాడు. 

        అభిమన్యు ఇంతవరకూ ఆర్గనైజ్డ్ క్రైమ్సే చేశాడు, అతడికి ఎమోషనల్ క్రైం రుచి తెలీదు. ప్రజల్లో కూడా అభిమన్యు మీద ఎంత ఆగ్రహం కట్టలు తెంచుకుంటోందో చూడమని,  ఆ క్లిప్పింగ్స్- బైట్స్ చూపిస్తాడు. అభిమన్యు కనిపిస్తే కొట్టి చంపేసేట్టున్నారు. కనుక ప్రజల బారి నుంచి కూడా అభిమన్యుని కాపాడి కోర్టుకి తీసికెళ్ళాలంటే, అతనిప్పుడు సిండికేట్ గురించి డేటా ఇచ్చేయాలి. అప్పుడు  తనొక  బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ఇస్తాడు. అది తొడుక్కుని వెళ్తున్నప్పుడు ఎన్ కౌంటర్ జరిగినా ప్రమాదముండదు కానీ, చచ్చిపోయి నట్టు నటించాలి. తను సురక్షితంగా కోర్టుకి చేరేస్తాడు.

        ఇలా చెప్పి ఆలోచించుకోమని, బుల్లెట్ ప్రూఫ్  జాకెట్ అభిమన్యు ముందు పెట్టి వెళ్ళిపోతాడు మిత్రన్.
***
       తే- ఐతే-
       ఈ సీను మధ్యలో ఇంకో  గమ్మత్తు వుంది!  అదేమిటంటే, ఫార్మాసిస్టు ప్రస్తావన తెస్తాడు మిత్రన్. పేటెంట్ రైట్స్ ఆమె పేర రిజిస్టర్ అవబోతోందని అంటాడు. అభిమన్యు కలవరపడి- దాని పేరు పెట్టేశావా? అదేదో వాగితే ఫార్ములా దానిది అయిపోతుందా? అది నేను కనుగొన్న ఫార్ములా, దానికేం సంబంధం లేదు- అంటాడు. 


        అప్పుడు మిత్రన్ - అది నువ్వు కనుగొన్న ఫార్ములాయే, ఆమె తనదని వాగలేదు, వాగినట్టు నేను ఎడిట్ చేశా - అని ఆ ఎస్డీ కారు వేసి చూపిస్తాడు. అందులో ఫార్మాసిస్టు- ఆ ఫార్ములా అభిమన్యు కనుగొన్నదేననీ, అయితే ఫారిన్ కి అమ్మేస్తూంటే వద్దని వారించాననీ, అతను  తన మందు తనిష్టమని చంపడానికి వచ్చాడనీ.. ఇలా చెబుతూంటుంది!

        ఇలా చెబుతున్న ఆమె మాటల్ని మిత్రన్ ఎడిట్ చేసి, అది ఆమె కనుగొన్న ఫార్ములాగా చెప్పినట్టు మాటల్ని మార్చాడట!!

        ఇదే మాట రేపు అభిమన్యు కోర్టులో చెప్పేసి కలకలం సృష్టిస్తే? ఇంత ఫూలిష్ గా ఎలా ప్రవర్తిస్తాడు మిత్రన్? అప్పడు మిత్రన్  కోర్టుకి చూపిన వీడియో ప్రశ్నార్ధకమవుతుంది- కోర్టుని తప్పుదోవ పట్టించడం కూడా అవుతుంది. ఆ వీడియోని పరీక్షకి పంపితే ఎడిట్ చేసిన తనే దొరికిపోతాడు!

         ఫార్మాసిస్టుని చంపిన కేసు కూడా అభిమన్యు మీద నిలబడదు- ఎందుకంటే, ఒరిజినల్ వీడియోలో,  అతడి ఫార్ములా అతను అమ్ముకుంటూంటే వద్దని ఆమె వారించానంది. అంత మాత్రాన ఆమెని చంపేస్తాడా? ఆమె అడ్డు పడితే అమ్మకం ఆగిపోతుందా?
        రెండోది- వెనకటి సీన్లో ఇంటలెక్చువల్ ప్రాపర్టీస్ ఇండియాకి మిత్రన్ సబ్మిట్ చేసింది బోగస్ క్లెయిమ్ అని కూడా బయటపడి అక్కడా దొరికిపోతాడు! ఇవన్నీ పోలీస్ యూనిఫాం లో ఒక విలన్ చేయాల్సిన దుశ్చేష్టలు. హీరో చేస్తే నీచంగా ఉంటాడు.

***
     యిపోలేదు ...ఇంకొకటుంది!
     ఇదే జైలు సీన్లో- అభిమన్యు తండ్రి బతికే వున్నాడనీ, అభిమన్యు చేయించిన  కారు యాక్సిడెంట్ ని బూటకంగా మార్చింది తానేననీ  అంటాడు మిత్రన్. కాబట్టి ప్రభుత్వ లాంఛ నాలతో పోలీసులు గౌరవ వందనం చేసిన చితాభస్మం అభిమన్యు తండ్రిది కాదనీ, ఆ చితాభస్మం అభిమన్యు చంపించిన తన కొలీగ్ దనీ అంటాడు మిత్రన్!

        మిత్రన్ మెంటల్ హాస్పిటల్లో ఉండాల్సిన వాడు. యాక్సిడెంట్ లో పోయిన వ్యక్తి చితాభస్మానికి పోలీసులు గౌరవ వందనం చేస్తున్నారంటే అతను కాలి బూడిదయ్యాడు కాబట్టని అర్ధం జేసుకోవచ్చు. మిత్రన్ కొలీగ్ చనిపోయి డెడ్ బాడీ దొరికితే దాని చితాభస్మానికి గౌరవ వందన మేమిటి? పోలీసులు మృత దేహానికి గౌరవ వందనం సమర్పించి కదా బంధువులకి అప్పగిస్తే అంత్య క్రియలు జరిపిస్తారు. అంత్య క్రియలు జరిపాక చితాభస్మానికి గౌరవ వందన మేమిటి ???!!!
        మిత్రన్ పిచ్చెక్కి ఇష్టమొచ్చిన ఆటలాడుతున్నాడు.
***
       ఇక కోర్టుకి తీసుకుపోయే ఎపిసోడ్!
       
బయటికి తీసుకువస్తున్నపుడు జైలు బిల్డింగ్ పైనుంచే (!!) ఒక కొలీగ్ రైఫిల్ గురి పెట్టి ఉంటాడు ఎన్ కౌంటర్ చేయడానికి. ఎంత సిల్లీ సీన్ ఇది! జైలు బుల్దింగ్ పైనుంచి ఎన్ కౌంటర్- సెక్యూరిటీ సిబ్బంది లేరా? బయట అభిమన్యు మీద దాడి చేయడానికి జనం ఎగబడుతూంటారు. ఒకడు కత్తితో దాడి చేయ బోతూంటే అభిమన్యు ని పక్కకి లాగేస్తాడు మిత్రన్. అప్పుడా స్పర్శకి అభిమన్యు జాకెట్ తొడుక్కోలేదని తెలుస్తుంది. ఎందుకిలా  చేశావని కేకలేస్తాడు మిత్రన్. కొలీగ్ ఫైర్ చేసేస్తాడు. దాన్నుంచి కూడా అభిమన్యుని కాపా డేస్తాడు మిత్రన్. ఇంతలో ఇంకో ఫైరింగ్ జరుగుతుంది- మిత్రన్ షాక్ అయిచూస్తే, అభిమన్యు గర్ల్ ఫ్రెండ్ వుంటుంది- తన తండ్రి  హత్యకి అభిమన్యు మీద పగ దీర్చుకుంటూ! 

        చచ్చిపోతూ చెప్తాడు అభిమన్యు- తన డేటా  ఎస్డీ కార్డులో రికార్డు చేసి జాకెట్ లో పెట్టానని. ఇక ఆప్త మిత్రుడు చనిపోతున్నట్టే ఎమోషన్ తో ఎలాగెలాగో అయిపోతాడు మిత్రన్...

***
 1. డీల్ ప్రకారం డేటా  తీసుకోకుండానే మిత్రన్ ఎలా బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ఇచ్చేస్తాడు?
        2. కోర్టుకి తీసుకు పోతున్నప్పుడు ఆ జాకెట్ దగ్గరుండి తొడిగించడా? అభిమన్యు నిందితుడా, అభ్యాగతుడా?
        3. బయటికి తీసుకొస్తున్నప్పుడు తొడుక్కున్నావా అని నామ్ కే వాస్తే అడుగుతాడు మిత్రన్. తొడుక్కున్నా నంటే నమ్మేస్తాడా? దీంతో తొడుక్కోలేదని మనకే అన్పిస్తుంది.
        4. తీరా దాడి జరిగినప్పుడు తొడుక్కోలేదా అని మిత్రన్ కేకలేయడమేమిటి- ఖచ్చితంగా తొడుక్కోడు విలన్ అన్నాక!
        5. సడెన్ గా అభిమన్యు గర్ల్ ఫ్రెండ్ వచ్చి ఎటాక్ చేసి చంపడం ఈ  కథకి పెద్ద మాస్టర్ స్ట్రోకేం గాదు, రాం గోపాల్ వర్మ ‘కంపెనీ’ ముగింపు ఇదే- చాలా అనూహ్యంగా, చాలా  షాకింగ్ గా- మర్చిపోలేనట్టుగా.
        6. డేటాని ఎస్డీ కార్డులో రికార్డు చేసి జాకెట్లో పెట్టానన్న అభిమన్యుకి జైల్లో ఆ కార్డు ఎక్కడిది? ఎలా రికార్డు చేశాడు? ఇప్పటికైనా తను ముందు డేటా తీసుకోకుండా జాకెట్ ఇచ్చేశాడని మిత్రన్ కి గుర్తొచ్చిందా?
        7. ఈ ముగింపుతో ఏం సాధించాడు మిత్రన్? కథ తను ముగించాడా? అభిమన్యు గర్ల్ ఫ్రెండ్ ముగించిందా?
        8. అసలు కథ తను మొదలు పెట్టాడా?
***
    క ఇంటర్వ్యూలో దర్శకుడు- చాలా    యాక్షన్ థ్రిల్లర్స్ లో విలన్ తో హీరో ఎందుకు పోరాడుతున్నాడనే దానికి ఒక ఫ్లాష్ బ్యాక్ వేస్తారనీ,  ‘తని ఒరువన్’ లో దుష్ట శక్తుల్ని ఓడించడం హీరో బాధ్యతగా చూపించాననీ, దానధర్మాలు చేయడానికి ఎలా కారణాలు అవసరం లేదో, ఇది కూడా అంతేననీ  అన్నాడు. 

        కారణం లేకుండా కార్యం లేదు. దీన్నే కాజ్ అండ్ ఎఫెక్ట్ సూత్రం- కార్యకారణ సంబంధం- అన్నారు. మన ఆలోచన, మాట, చేత అన్నీ దీని మూలంగానే పుడు తున్నాయి. మొత్తం సృష్టే దీని ఆధారంగా నడుస్తోంది. కాబట్టి హీరో కారణం లేకుండా పోరాడలేడు. దాన ధర్మాలు చేయడానికీ కారణం ఉంటుంది- దానం పుచ్చుకుంటున్న వాడు బావుండాలన్న కారణం. కదా? కుక్క కూడా యజమాని బావుండాలన్న కారణంతోనే బతుకుతుంది. అలాగే ఈ కథలో హీరో పోరాటానికి కారణం ఉండే వుంటుంది. జరుగుతున్న నేరాలు చూసి (కాజ్) తను పోలీసాఫీసర్ అవ్వాలనుకున్నానని (ఎఫక్ట్) మిత్రనే  స్వయంగా చెప్పుకున్నాడు. అయితే కాజ్ ఎంత బలంగా వుంటుందో ఎఫెక్ట్  అంత బలంగానూ  వుంటుంది. కాజ్ ఎంత బలహీనంగా వుంటుందో ఎఫెక్ట్ అంత బలహీనంగానూ  వుంటుంది. ప్రతీ చర్యకీ సమానమైన వ్యతిరేక ప్రతి చర్య ఉంటుందని న్యూటన్  మూడో చలన సూత్రం కదా? బంతిని ఎంత  బలంగా గోడకి కొడితే అంత బలంగా వెనక్కి వస్తుంది. 

        కథల్లో కాజ్ రెండు జోన్స్ లోంచి పుడుతుంది : వ్యవస్థ లోంచి, పౌరజీవితం లోంచి. వ్యవస్థ లోంచి కాజ్  పుట్టాలంటే వ్యక్తిగత అన్యాయమో నష్టమో జరిగి ఉండనవసరం లేదు. ఆ అధికారి, లేదా ఉద్యోగి ఉద్యోగ ధర్మమే కాజ్ అవుతుంది. దాంతో చర్య తీసుకుంటారు (ఎఫెక్ట్). అదే పౌర జీవితంలో అయితే వ్యక్తిగతంగా అన్యాయం జరక్కుండా (కాజ్) అన్యాయాల్ని ఎదుర్కోలేరు (ఎఫెక్ట్). ఒక ఆటో డ్రైవర్ అన్యాయాల్ని ఎదుర్కొవాలంటే (ఎఫెక్ట్) వ్యక్తిగతంగా అతడికి అన్యాయం జరిగి వుండాలి (కాజ్).

        ‘
శివ’లో పౌర జీవితంలో ఉండే నాగార్జున తన సన్నిహితురాలు అమలతో జేడీ మిస్ బిహేవ్ చేసినందుకే (కాజ్) జేడీని కొట్టి మాఫియా ప్రపంచంలో ప్రకంపనలు సృష్టిస్తాడు (ఎఫెక్ట్).  ఇక్కడ ‘కాజ్’ కి పౌర జీవితంలో జరిగిన వ్యక్తిగత నష్టమే.

        ‘డెత్ విష్’  అనే ప్రసిద్ధ సినిమాలో పౌర జీవితంలో వుండే బిజినెస్ మాన్ అయిన ఛార్లెస్ బ్రాన్సన్, దోపిడీ దొంగలు తన భార్యని చంపి, పెళ్ళయిన కూతుర్ని రేప్ చేసిన అన్యాయంతో వ్యవస్థతో విసిగి( కాజ్),  ఇలా మరొకరికి జరక్కూడదని, రాత్రిపూట తనే నగరంలో దొంగల్ని ట్రాప్ చేసి చంపుతూంటాడు(ఎఫెక్ట్). ఇక్కడ కూడా ‘కాజ్’  పౌర జీవితంలో జరిగిన వ్యక్తిగత నష్టమే.

        ‘బొబ్బిలిపులి’ లో వ్యవస్థలో భాగంగా సైనికుడైన ఎన్టీఆర్ సొంతవూరికి వచ్చి పెళ్లి కుదుర్చుకుని పోతూ విలన్ల దురాగతాలు చూసి, తన డ్యూటీ (కాజ్) సరిహద్దుల్లో కాదనీ, ఇక్కడే ననీ డిసైడ్ అయిపోయి, సంఘవిద్రోహుల  మీద సమరభేరి మోగిస్తాడు (ఎఫెక్ట్). ఇక్కడ ‘కాజ్’ వ్యవస్థలో భాగంగా డ్యూటీ పట్ల స్పృహే. వ్యక్తిగత నష్టం జరిగి ఉండాల్సిన అవసరం లేదు. 

        ‘సరైనోడు’ లో సైనికుడిగా తన డ్యూటీ (కాజ్) సరిహద్దుల్లో కాదనీ, దేశం లోపలే దుష్టుల  పని పట్టడమేనని వచ్చేసి వివాదాలు సెటిల్ చేస్తూంటాడు అల్లు అర్జున్ (ఎఫెక్ట్). ఇక్కడ కూడా ‘కాజ్’ వ్యవస్థలో భాగంగా డ్యూటీ పట్ల స్పృహే గానీ వ్యక్తిగతం కాదు.  అయితే ఇది బలహీన కాజ్. ఇలా ఫీలవడానికి పేపర్స్ లో వార్తలేవో చదివి వుంటాడేమో తప్ప, ఇదమిత్థంగా ఓ ప్రత్యక్ష సంఘటన చూడలేదు. అందుకే ఇది బలహీన కాజ్. దీని ఎఫెక్టు కూడా అంతే  బలహీనంగా వుంటుంది- కథ వేరే పాయింటు మీదికి వెళ్ళిపోతూ. ‘బొబ్బిలిపులి’ లో  ఇలాకాకుండా, ఎన్టీఆర్ సంఘవిద్రోహుల కరాళనృత్యం కళ్ళారా చూస్తాడు గనుక, అది బలమైన కాజ్. దాని ఎఫెక్ట్ కూడా ఆద్యంతం అంతే  బలంగా వుంటుంది. 

        ఇక వ్యవస్థలో భాగమైన పాత్రలు వ్యక్తిగత నష్టా లెదుర్కొనే కథలు కూడా వున్నాయి. ఈ పాత్రలు ఉదాత్తంగా వ్యక్తిగత నష్టాన్ని ఓర్చుకుని పదవీ బాధ్యతలకే ప్రాణమిస్తాయి. ఉదాహరణకి ‘కొండవీటి సింహం’ లో పోలీస్ అధికారి అయిన ఎన్టీఆర్ కొడుకుని విలన్ కిడ్నాప్ చేసి బేరం పెడితే లొంగడు.  అలాగే ‘అంకుశం’ లో సీఎంని కాపాడే ఇన్స్పెక్టర్ పాత్రలో రాజశేఖర్ భార్యని విలన్లు చంపేస్తే, సీఎంని రక్షించడానికే పోరాడతాడు రాజశేఖర్! ఇలాటి పాత్ర లు చాలా సానుభూతిని పొంది బలంగా కనెక్ట్ అవుతాయి.
***
       మన మిత్రన్ విషయానికొస్తే, ఇతడికి బలమైన కాజ్ వుందా? వున్న ఆ బలహీన కాజ్ కూడా పోలీసు కాక ముందే వుంది. జరుగుతున్న ఘరానా వ్యక్తుల నేరాలు చూసే పోలీసు అవ్వాలనుకున్నానని అంటాడు. అంటే అప్పుడతను పౌర జీవితంలో ఉంటూ ఈ రకంగా  ఫీలయ్యాడు. ఆ నేరాల తాలూకు వివరాలు గోడల మీద అతికించుకున్నాడు. అయితే అవేవీ అతను ప్రత్యక్షంగా  చూసినవి కావు, బాధితుల్ని పరామర్శించినవీ కావు. నిజానికి నడుస్తున్న కథతో కనెక్ట్ అయ్యే హీరో తాలూకు పూర్వానుభావాల కథని సర్కిల్ ఆఫ్ బీయింగ్ అంటారు. దీన్ని విజువల్ గా ఆనాడు హీరోకేం అనుభవమైందో ఒక ఫ్లాష్ బ్యాక్ ద్వారా  చూపిస్తారు (మాటలతో చెప్తే ఎఫెక్టివ్ వుండదు కాబట్టి). నడుస్తున్న కథకి ఇంధనం (ఎమోషనల్ శక్తి)  ఇక్కడ్నించే అందుతుంది. ఈ సినిమా దర్శకుడేమో-  చాలా యాక్షన్ థ్రిల్లర్స్ లో విలన్ తో హీరో ఎందుకు పోరాడుతున్నాడనే దానికి ఒక ఫ్లాష్ బ్యాక్ వేస్తారని తృణీకార భావంతో అంటాడు.   వేయకపోతే ఎమౌతుందంటే, ఇలాగే  కటౌట్ పాత్ర అవుతుంది, ఉత్సవ విగ్రహంలా వుంటుంది. వీణ్ణి చివరిదాకా మోయలేక చావాలి రైటర్. 

        ఇలా ‘కాజ్’ లో బలం లేనప్పుడు సహజంగానే ఎఫెక్ట్ కూడా బలహీనమైపోయింది ఈ కథలో. బ్యాక్ డ్రాప్ లో ‘కాజ్’  కి సరైన బలం లేకపోవడం వల్ల, ప్లాట్ పాయింట్ వన్ దగ్గర అసలు గోలే (ఎఫెక్ట్) ఏర్పడలేదని గమనించాం.

        ఎప్పుడైతే ప్లాట్ పాయింట్  వన్ బలహీనంగా వుంటుందో, లేక అసలే ఏర్పడదో,  అప్పుడు  ఎండ్ విభాగంలో బిజినెస్ కూడా గందరగోళమై పోతుంది, క్లయిమాక్స్ కుప్పకూలుతుంది. బిగినింగ్ కీ ఎండ్ కీ అవినాభావ సంబంధముంటుంది. కథకి ముగింపు కథా ప్రయోజనం లోనే వుంటుంది. కథా ప్రయోజనం లేకపోతే  కథకి ముగింపే  దొరకదు.

        సిడ్ ఫీల్డ్ ప్రకారం - ఈ కింది రుగ్మతలు పొడసూపుతాయి..
          
1. story  resolution may not be paid off
            2. the  ending will not work
            3. the ending will be too soft, too weak, confusing
            4. the ending will be contrived, too predictable, unsatisfying
            5. main character dies (easy solution)
            6. the main character will disappear at the end
            7. a surprise twist comes out of nowhere.
            8. ending  will not be big, or commercial enough
            9. ending will be too long, and there might be a budget problem
            10. there will be no emotional impact

            వీటిలో 7వ దైన main character dies ని విలన్ క్యారక్టర్ మరణంగా మార్చుకుంటే,  పైన సిడ్  ఫీల్డ్ చెప్పినవన్నీ ఈ సినిమా ఎండ్- క్లయిమాక్స్ లో కన్పించే రుగ్మతలేగా? అంత సరీగ్గా ఎలా చెప్పగల్గాడు సిడ్ ఫీల్డ్? దొంగ చాటుగా ఈ సినిమా చూసి, అప్పటికప్పుడు కన్పించిన విషయాల్ని తప్పులన్నట్టు ఎంచి చెప్పేశాడా? అమెరికానుంచీ అనకాపల్లి దాకా- ఇలా చేస్తే ఈ తప్పు జరుగుతుందని  అతను చెప్పినట్టే సినిమా లెందుకుంటున్నాయి? 

         ఈ కథలో అభిమన్యుని కోర్టుకి తీసుకుపోవడానికి జైల్లోంచి మిత్రన్ బయటికి తీసుకొచ్చే ముగింపు ఘట్టం,  పై  సిడ్ ఫీల్డ్ ఫీల్డ్ చెక్ లిస్టు ప్రకారం-
        1. కథా ప్రయోజనం నెరవేరిందా? అసలు కథా ప్రయోజనం ఏమిటని?
        2. ముగింపు తేలిపోలేదూ?
        3. ముగింపు సాఫ్ట్ గా,  బలహీనంగా, కన్ఫ్యూజింగ్ గా లేదూ?
        4. ముగింపు కల్పించినట్టు, తెలిసిపోయేట్టు, అసంతృప్తి కరంగా లేదూ?
        5. ఈజీ సొల్యూషన్ గా విలన్ చనిపోలేదూ?
        6. హీరోపాత్ర గల్లంతై పోలేదూ?
        7. ఆకాశంలోంచి ఊడిపడ్డట్టు విలన్ గర్ల్ ఫ్రెండ్ తో సర్ప్రైజ్ ట్విస్టు ఇవ్వలేదూ?
        8. ముగింపు భారీ యాక్షన్ తో కమర్షియల్ గా లేదు కదూ?
        9. ముగింపు తెగసాగి  బడ్జెట్ ని పెంచెయ్యలేదూ?
        10. ముగింపులో ఎమోషనల్ ఇంపాక్ట్ ఏమీ లేదు కదూ?  
***
        కథకైనా ఒక ప్రయోజనముంటుంది. ఆ ప్రయోజనం లోంచే ముగింపు దానికదే పుడుతుందే తప్ప- ముగింపుని  ఇటు మార్చి,  అటు మార్చి కృత్రిమం చేయలేరు. ఆ కథాప్రయోజనం లోంచి పుట్టే ముగింపు నచ్చక పోతే, కథనే తీసి  అవతలపడెయ్యాలి తప్ప ఇంకేవో ముగింపులు తెచ్చి అతికించుకుంటూ కూర్చోకూడదు. కథలో కథా ప్రయోజనం ఎక్కడంటుంది? ప్లాట్ పాయింట్ వన్ లో వుంటుంది. అక్కడ హీరోకి ఏర్పడే గోల్ కథా ప్రయోజనాన్ని ఏర్పాటు చేస్తుంది. అందులోంచే ముగింపు పుడుతుంది. అందుకని యథా ప్లాట్ పాయింట్ వన్ తథా ముగింపు  అన్నారు. గోలే లేకపోతే  కథా  ప్రయోజనమూ లేదు, ముగింపూ లేదు, కథే లేదు! 

        ముగింపుకి సంబంధించి లాజోస్ ఎగ్రీ  ‘ది ఆర్ట్ ఆఫ్ డ్రమెటిక్ రైటింగ్’ (1946) అనే ప్రసిద్ధ గ్రంథంలో సింపుల్ గా ఇలా చెప్తాడు -  కథల్లో ప్రారంభం అనేది సంఘర్షణకి మూలం కాదు, అది మొత్తానికి ముగింపుకే  మొదలు. కథా ప్రారంభమే ముగింపుకి మొదలు. పాత్ర ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు అంతర్గత క్లయిమాక్స్ ని అనుభవించి, ఆ నిర్ణయం ప్రకారం చర్యకి దిగుతుంది. దాంతో  సంఘర్షించి తాను కలగన్న  బహిర్గత క్లయిమాక్స్ ని సాధిస్తుంది...

       
దీన్నిలా చూడవచ్చు- మనమొక పని చేయాలనుకున్నప్పుడు దాని  ఫలితాన్ని వూహించుకుంటాం ( అంతర్గత క్లయిమాక్స్) ఆ వూహలకి తగ్గటు ఫలితాన్ని సాధించేందుకు ప్రయత్నిస్తాం (బహిర్గత క్లయిమాక్స్).  అంతే,  ఇంత సింపుల్!

        అంటే ప్లాట్ పాయింట్ వన్ దగ్గర కథ ప్రారంభమవుతుందనుకుంటే, ఆ ప్లాట్ పాయింట్ వన్ లోనే క్లయిమాక్స్ కూడా  వుందన్న మాట. పెళ్ళితో ఒక జంట ఏకమయ్యిందంటే, ఆ పెళ్ళిలోనే క్లయిమాక్స్ కూడా ఉందన్న మాట- రాబోయే కాలంలో పిల్ల పుట్టడం! పెళ్ళికి ఉద్దేశించే  క్లయిమాక్స్ ఇది. ఇది పెళ్లి ప్రయోజనం. ‘శివ’ లో నాగార్జున ప్లాట్ పాయింట్ వన్ దగ్గర జేడీని  తిప్పితిప్పి చితకబాదితే అందులోనే క్లయిమాక్స్, ముగింపూ, కథాప్రయోజనమూ అన్నీ వున్నాయి- అంతిమంగా రఘువరన్ మాఫియా ప్రపంచానికి ఎసరు పెట్టడం! వీణ్ణి కొడితే వాడు పోయే కాలం కూడా వస్తుందని, అంతిమ ఫలితాన్ని ఊహించుకునే జేడీని అలా కొట్టి ఉంటాడు నాగార్జున!

        మరి మన మిత్రన్ ఎలర్జీతో ప్లాట్ పాయింట్ వన్ ని తప్పించుకున్నా,  స్క్రీన్ ప్లేలో అడ్డ మార్గాల్లో ( పోలీసుగా కూడా అడ్డ మార్గాల్లోనే ) ఏం సాధించాలని కలగన్నాడు? ఈ ప్రపంచానికి అభిమన్యు పీడా  తొలగించాలనే కదా? మరి తొలగించాడా? ఆ ముగింపుకి కథని చేర్చడా? ఆ ముగింపుతో కథా ప్రయోజనాన్ని నెరవేర్చాడా? ఇంకెవరో వచ్చి కదా అతడి కలల్నీ, కథా ప్రయోజనాన్నీ, ముగింపునీ,  హీరోయిజాన్నీ చెడగొట్టింది! 

        కథా  ప్రయోజనం గురించి లాజోస్ ఎగ్రి ఇలా చెప్తాడు- ఓ మనిషి దొంగతనం చేస్తాడు. అది సమస్య. అతణ్ణి వెంటాడతారు. ఇది సంఘర్షణ. అతను పట్టుబడతాడు. ఇది సంక్షోభం. న్యాయస్థానంలో శిక్ష పడుతుంది. ఇది ముగింపు.  అతణ్ణి జైల్లో పెడతారు. ఇది కథా ప్రయోజనం. 

       
అన్యాయాలు చేసిన వాడిపై న్యాయమే గెలిచినట్టు, చట్టాల్ని అతిక్రమించిన వాడిపై చట్టమే గెలిచినట్టూ పూర్తిగా చూపించి ముగించడమే  ఉత్తమ కథా లక్షణం .

        కానీ ఒక పోలీసు అధికారిగా మిత్రన్  చట్టాల్ని ఏమార్చడమే హీరోయిజమనుకుంటే ఏ కథాప్రయోజనం నెరవేరుతుందని? 

        ఇటీవల ఒక పేరున్న మీడియం హీరోతో సినిమా తీసిన దర్శకుడు పోలీసు కథ చెప్పారు. అది చాలా కన్ స్ట్రక్టివ్ గా, ప్రొఫెషనల్ గా, కమర్షియల్ గా వుంది- ముగింపు పక్క పాత్ర చేతికి వెళ్ళడం తప్ప. దాన్ని హీరో కి మార్చి, ఇందులో ఇంకెవరూ ఎక్కడా వేలు పెట్టనివ్వకుండా ఎలా రాశారో అలా తీయమని చెప్పాడు ఈ వ్యాసకర్త. ఇదీ స్క్రీన్ ప్లే యాక్టర్లకీ, స్క్రీన్ ప్లే క్రియేటర్లకీ వున్న తేడా!  


-సికిందర్