రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

10, ఫిబ్రవరి 2017, శుక్రవారం

rరివ్యూ!


స్క్రీన్ ప్లే- దర్శకత్వం : కె. రాఘవేంద్ర రావు


తారాగణం : నాగార్జున అక్కినేని, సౌరభ్ రాజ్, అనూష్కా, ప్రగ్యా జైస్వాల్, సుధ, విమలారామన్, అస్మిత, జగపతి బాబు, సాయికుమార్, రావురమేష్, తనికెళ్ళ, సంపత్ రాజ్, వెన్నెల కిషోర్,  బ్రహ్మానందం, ఆదిత్యా మీనన్, రఘుబాబు, పృథ్వీ రాజ్ తదితరులు 

కథ- మాటలు: జేకే భారవి, సంగీతం : ఎంఎం కీరవాణి,  ఛాయాగ్రహణం : ఎస్. గోపాలరెడ్డి బ్యానర్ : ఏఎంఆర్ సాయికృపా ఎంటర్ టైన్మెంట్స్ 
నిర్మాత : ఎ. మహేష్ రెడ్డి 
విడుదల : ఫిబ్రవరి 10, 2017
***

       వివిధ దేవుళ్ళకి ప్రణమిల్లి పరమ భక్తుడిగా నటిస్తున్న అక్కినేని నాగార్జున ఈసారి తెలుగు ప్రేక్షకులకి అంతగా తెలీని ఉత్తరాది భక్తుడు హాథీరాం భావాజీ పాత్ర పోషించారు. ఏడుకొండలవాడికి అపర భక్తుడైన హాథీరాం జీవిత కథలో ఒక సంఘటనే  సినిమా తీయడానికి ఆకర్షించి వుంటుంది బహుశా. భక్తి సినిమాలవైపు మళ్ళిన దర్శకుడు కె.  రాఘవేంద్రరావు మరోసారి  తన టీముతో ఈ కొత్త ప్రయత్నానికి పూనుకున్నారు. భక్తి  సినిమాలకి వీళ్ళిద్దరి రెగ్యులర్  కాంబినేషన్ లో ‘ఓం నమో వెంకటేశాయ’ తీరుతెన్నులేమిటో ఈ కింద చూద్దాం...

కథ
          రాం అనే కుర్రాడికి  దేవుణ్ణి చూడాలన్న కోరిక పుడుతుంది. దేవుణ్ణి చూడ్డం కాదు, దేవుడు ప్రత్యక్షమైతే గుర్తుపట్టగల్గాలని ఉపదేశించి ఓంకార మంత్రం నేర్పడం మొదలెడతాడు అనుభవానంద స్వామి (సాయి కుమార్). ఆ మంత్రాన్ని పఠిస్తూనే పెద్దవాడైన రాం (నాగార్జున) వటపత్రసాయి రూపంలో వచ్చిన ఏడుకొండల వాణ్ణి గుర్తుపట్టక, తన తపస్సుని భగ్నం చేసినందుకు కోపగించుకుని ఇంటి కెళ్ళి పోతాడు. అక్కడ తల్లిదండ్రులు (తనికెళ్ళ, సుధ) పెళ్లి చేస్తామంటే ఒప్పుకుంటాడు. కానీ మనసు మార్చుకుని కాబోయే పెళ్లి కూతురు (ప్రగ్యా జైస్వాల్) కి చెప్పేసి  దేవుడి  అన్వేషణలో వెళ్ళిపోతాడు. అసలు వటపత్రశాయి రూపంలో వచ్చింది ఏడుకొండల వాడేనని అనుభవానందస్వామి చెప్పి, పాచికలాట నేర్పి పంపుతాడు. 

          కానీ ఏడుకొండలపైకి చేరుకున్న రాంకి,  వెంకటేశ్వరస్వామి దర్శనం దొరకదు. ఆలయ భటులు నెట్టిపారేస్తారు. అలాగే ఎండలో వానలో ఆలయం ముందు కూర్చుంటాడు. ఆలయంలో చాలా అక్రమాలు జరుగుతూంటాయి ధర్మాధికారి గోవిందరాజులు (రావు రమేష్) ఆధిపత్యంలో. ఆలయంలో పనిచేసే కృష్ణమ్మ (అనూష్కా)  సహకారంతో రాం ఆలయానికి వచ్చే భక్తులకి అసౌకర్యం కలక్కుండా చూసుకుంటూంటాడు. రాం తమకి పోటీగా తయారయ్యాడని గోవిందరాజులు కక్షకట్టి దాడులు జరిపిస్తాడు. రాజు (సంపత్ రాజ్)  కి ఫిర్యాదు చేస్తాడు. ఆ రాజు రాం భక్తినీ నిజాయితీనీ  గమనించి, వరదరాజులుని పదవిలోంచి తొలగించి, రాంని ధర్మాధికారిగా నియమించడంతో- అప్పుడు రాం దైవదర్శనం చేసుకోగల్గుతాడు. అప్పుడు ఏడుకొండలవాడు ప్రసన్నుడై ప్రత్యక్షమవుతాడు- ఓ రాత్రి కలలోనే  పాచికలాట ఆడడానికొస్తాడు.

          ఇలా రాంతో ఏడుకొండలవాడు స్నేహం పెంచుకుని తరచూ పాచికలాటలో ఓడిపోతూంటాడు. చివరికి పందెంలో సర్వం పోగొట్టుకుంతాడు. దీంతో ఏడుకొండలవాడి నగలన్నీ పోయాయని గొడవరేగుతుంది. రాజు సమక్షంలో ఆభరణాలన్నీ రాం ఆశ్రమంలోనే దొరుకుతాయి-  ఒక దోషిలా నిలబడ్డ రాం ఇప్పుడేం సంజాయిషీ చెప్పుకున్నాడు? దీన్ని రాజు నమ్మాడా? నమ్మకపోతే ఏం పరీక్షపెట్టాడు? ఈ పరీక్ష రాం ఎలా నెగ్గాడు? తను బాలాజీ అని పిలుచుకునే ఏడుకొండలవాడు వచ్చి రాంని ఆదుకున్నాడా? ఆదుకుంటే రాం తీర్చుకున్న రుణం ఎలాటిది? తన అఖండ భక్తిని ఏ కోరరాని కోరిక కోరి నిరూపించుకున్నాడు? - వగైరా తెలుసుకోవాలంటే మిగిలిన కథ చూడాల్సిందే.


ఎలావుంది కథ
         
గొప్ప త్యాగంతో గానీ భక్తిరస ప్రధాన చలన చిత్రం పరిపూర్ణం కాదేమో. హాథీరాం భావాజీ చరిత్ర పూర్తిగా దొరకడంలేదని చెబుతున్నారు. కాబట్టి అధికభాగం కల్పన మీదే ఆధారపడ్డ సినిమాకథ హాథీరాం గురించి తెలుగు ప్రేక్షకులకి కొంతైనా ఒక  అవగాహన ఏర్పడేందుకు తోడ్పడుతుంది. హాథీరాం  1500 ప్రాంతాల్లో  తిరుమలకొచ్చాడని ఉన్న కొద్దిపాటి  చరిత్ర చెప్తోంది.  అంతేగాక అతను  ఉత్తరప్రదేశ్ కి చెందిన వాడని వుంది. సినిమాలో రాజస్థాన్ నుంచి వచ్చాడని అన్నారు. తిరుమలలో అతను నిర్మించిన మఠం క్రమంగా 60 గదులకి విస్తరించి, అయిదు వందల ఏళ్ళకి పైగా భక్తులకి సేవలందించి, ఇప్పుడు పూర్తిగా శిథిలావస్థకి చేరుకుని  ప్రభుత్వ నిర్లక్ష్యానికి గురవుతోందని పత్రికలు  రాశాయి. ఒక తెలియని దైవ భక్తుడి గురించి సినిమావాళ్ళు సినిమాలు తీస్తారు, ప్రభుత్వాలు అవార్డు లిస్తాయి- కానీ ఆ భక్తుడు వదిలిపెట్టి వెళ్ళిన చిహ్నాల్ని  పరిరక్షించుకునే మాటో? సినిమాతోనైనా వాటికి మోక్షం కలగదా?

         
ఇక హాథీ రాం కథకీవిప్రనారాయణసినిమా  కథకీ దగ్గరి సంబంధం వున్నా, తేడా కూడా వుంది. విప్రనారాయణలో పరస్త్రీవ్యామోహంలో పడి దారితప్పిన తన భక్తుడు  విప్రనారాయణ కి సాయపడాలని, ఆలయంలోంచి బంగారు గిన్నె తొలగించి తెచ్చి, అది విప్రనారాయణ పంపిన కానుక అంటూ  దేవదేవికి బహూకరిస్తాడు రంగనాధ స్వామి. బంగారు గిన్నె చోరీ జరిగిందని పూజారి గోల పెడతాడు. నేర విచారణలో విప్రనారాయణుడే నిందితుడిగా నిలబడాల్సి వస్తుంది. అప్పుడు  చోళ రాజు అతడి దోషిత్వాన్ని నిర్ధారించుకుని, శిక్షగా చేతులు నరికెయ్యాలని ఆదేశిస్తాడు. శిక్ష అమలవుతూండగా, రంగనాథుడు ప్రత్యక్షమై కాపాడతాడు..ఇదంతా తాను ఆడించిన ఆటేనని చెప్తాడు.

         
హాథీరాంతో స్వయంగా ఏడుకొండలవాడు పాచికలాటలాడి సర్వం కోల్పోతే, నేరం హథీరాం మీద పడుతుంది. మళ్ళీ ఏడుకొండల వాడే  వచ్చి కాపాడతాడు. రుణం హాథీరాం తీర్చుకుంటాడు. ఇంతకి మించి కథలేదు. ఇదంతా సినిమాటిక్. ఏడుకొండలవాడు హాథీరాంతో పాచికల ఆట ఆడ్డానికి కూడాతన సేవలో అలసిపోతున్న హాథీరాంకి వూరట  కోసమే. ఇంతకిమించి ఆధ్యాత్మిక విలువ లేదు

         
కానీవిప్రనారాయణలో పూర్వ జన్మలో విప్రనారాయణ వైజయంతీ మాలా రూపుడనీ, శాపవశాత్తూ మానవుడిగా జన్మించాడనీ, దేవదేవి కూడా పూర్వజన్మ కర్మానుభవం కోసం మానవిగా జన్మించిన గంధర్వ కాంత అనీ, అలా వీళ్లిద్దరికీ సంబంధ బాంధవ్యాలు కల్పిస్తూ, వాళ్ళ కర్మ శేషం హరింపజేసేందుకే, తన సన్నిధి లోని బంగారు గిన్నెని సాని ఇంటికి పంపాననీ, చెప్పుకొస్తాడు రంగనాథుడు. దీంతో విప్రనారాయణ కష్టాలన్నీ గట్టెక్కి, తిరిగి స్వామి భక్తుడవుతాడు. ఇదొక ఆధ్యాత్మిక ఉద్దేశంతో కూడిన సైకో థెరఫీ మనకి!

          మరొకటి, హాథీరాంని ఏడుకొండలవాడు తనకి మించిన స్థానంలో అధిష్టింప జేయబోతే, అందుకు తగనని వెళ్లిపోయే హాథీరాం- సరే, ఇంకేదైనా కోరుకో తీరుస్తానని ఏడుకొండల వాడన్నప్పుడు- ఆ ఏడుకొండల వాణ్ణి బ్లాక్ మెయిల్ చేస్తున్నట్టు ఇరకాటంలో పెట్టేస్తూ, తీర్చుకున్న ఆ కోరికతో, దేవుణ్ణి మించిన దేవుడైపోలేదా హాథీరాం?

          చరిత్ర ప్రకారం హాథీరాం చేసిన నేరానికి రాజు పెట్టే పరీక్ష, ఒక్క పూటలో ఇంటెడు చెరుకు గడల్నీ  తినెయ్యాలని. అది ఏ మనిషికీ సాధ్యం కాదు. హాథీరాం ఏడు కొండల వాణ్ణి స్మరించుకుంటూ నిద్రపోతే, ఒక ఏనుగు వచ్చి మొత్తం తినేసి పోతుంది. తెల్లారి రాజు ఇది తెలుసుకుని, తన భక్తి  బలంతో ఏనుగు రూపంలో ఏడుకొండలవాణ్ణి రప్పించుకున్న హాథీరాం ని మెచ్చి,  అప్పుడే రాం పేరుకి ముందు ‘హాథీ’ (ఏనుగు) అని చేర్చాడు. సినిమాలో ఇదే చూపించారు. అలాగే ఓ రెండిటి గురించి రెండు చోట్ల వివరించారు : వెంకన్నకి బాలాజీ అనే పేరు ఎలా వచ్చిందో,  వెంకన్న ఉత్తరీయానికి శేషవస్త్రమని పేరెలా వచ్చిందో. 

          అయితే ఈ భక్తి జానర్ సినిమా ఆధ్యాత్మిక భావంతో మనసుని కడిగేసేకంటే, ఆత్మత్యాగంతో మనసుని కదిలిస్తుంది, పాచికలతో ఆడిస్తుంది, అంతే. 

ఎవరెలా చేశారు
          భక్తి పాత్రలకి ఇక నాగార్జున పెట్టింది పేరన్నట్టు వుంటుంది హాథీరాం పాత్రాభినయం. అయితే చివరి సన్నివేశాల్లోనే  ఈ భావావేశాల్ని రగిలించడం వుంటుంది. మిగతా సన్నివేశాల్లో భక్తి  కంటే శక్తియుక్తుల ప్రదర్శనే ఎక్కువ వుంటుంది. కథనం అలా చేసినప్పుడు చేసేదేం వుండదు. ఆనాటి క్లాసిక్ భక్తి  ‘భక్త తుకారాం’ లో తన తండ్రి పాత్రలాగా ఆద్యంతమూ భక్తిలో ఓలలాడే గాన- సంగీత మాధుర్యాల జడివాన కురిపిస్తున్నట్టు వుండాల్సింది. ‘భక్త తుకారాం’ లో కూడా అడ్డుపడే నాగభూషణం, సారథి మోసకారి  పాత్రలుంటాయి. వాటికి బుద్ధి చెప్పడం మరో పాట (చిందులు వేయకురా) ద్వారానే వుంటుంది. నాగార్జున పాత్రకి ఆలయంలో కార్మిక- యాజమాన్యం తాలూకు వర్గ పోరాటం లాంటిందిగా  వుండడంతో, ఆథ్యాత్మిక కథా సంవిధానానికి దూరంగా కమర్షియల్  హీరో- విలనిజాల కింద ఆ ఎపిసోడ్స్ అడ్డుపడేవిగా వుంటాయి. ఇక ఏడుకొండల వాడితో  పాచికలాట అయితే వినోదాత్మకమే. వెరసి గాఢమైన భక్తి నటించడానికి నాగార్జునకి మిగిలింది చివరి సన్నివేశాలే. పాత్రకి ప్రణయ కోణం లేదు. ప్రగ్యా జైస్వాల్ పాత్రతో దీన్ని బాగా పూరించే వీలున్నా పొడిపొడిగా చూపించి వదిలేశారు. ఇలా నాగార్జున పాత్ర చిత్రణ సారంలో మాత్రమే గాఢత్వానికి చేరుకోవడంతో గుర్తుండి  పోయే నటనన్నది చివర్లో మాత్రమే కన్పిస్తుంది- అదీ కదిలిస్తూనే, మనసుని కడిగేస్తూ కాదు. 

          ఆలయ సేవిక పాత్రలో  అనూష్కా, ఆమెని మోహించి పశ్చాత్తాప పడే అతిధి పాత్రలో జగపతిబాబూ ఓ పాటతో కలుపుకుని కాలక్షేపం కల్గిస్తారు. అయితే జగపతి పాత్రతో ఒరిగిందేమీ లేదు. ఎందుకొచ్చి ఎందుకు పోయిందో తెలీకుండా వుంటుంది. రాజు పాత్రలో జగపతి వుంటే బలంగా వుండేది. ‘భక్త తుకారాం’ లో శివాజీ గణేశన్ రాజుగా  నటించడంతో ఎంత బలాన్నిచ్చిందో తెలిసిందే. రాజు పాత్రలో విలన్ పాత్రలేసే సంపత్ రాజ్ కుదర్లేదు. ఆల్రెడీ విలన్లుగా రావురమేష్, ఆయన బృందం వుండగా, మళ్ళీ విలన్ లా కన్పించే సంపత్ రాజ్ వల్ల రాజు పాత్రకి  వైవిధ్యం ఏమీ లేదు. 

           ఇక అనూష్కాది  కీలకపాత్రా కాదు, చేసిందేమీ లేదు. ఏడుకొండల వాడిగా సౌరభ్ జైన్ ఫర్వాలేదనే అన్పిస్తాడు- అతడిది కొలమొహం కావడం, అదీ నునులేతగా వుండడం గాంభీర్యానికి మాత్రం అడ్డుపడ్డాయి. అతడిభార్యలుగా విమలారామన్, అస్మితల్లో విమలారామన్ దేవతామూర్తి లాగే వుంటుంది. 

          కీరవాణి సంగీతంలో పన్నెండు పాటలున్నాయి. తెరమీద ఈ పాటలన్నీ బాగానే వున్నాయి- కానీ కదిలించే భక్తి పాట అనేదే కరువయ్యింది. గుర్తుండి పోయే క్యాచీ పల్లవులు వున్నప్పుడే భక్తి పాటలు రక్తి కట్టిస్తాయేమో. ఎస్. గోపాలరెడ్డి ఛాయాగ్రహణం ఉన్నతంగా వుంది. ఎన్నుకున్న లోకేషన్స్, వేసిన సెట్స్ కథకి తగ్గట్టుగా వున్నాయి. 

చివరికేమిటి
          జేకే భారవి కథలో భక్తి రసం కంటే యుక్తి పన్నాగాలే ఎక్కువున్నాయి- చరిత్రలో కేవలం వెంకన్నతో హాథీరాం పాచికలాట ఆడ్డమనే అంశమే ఈ కథకి కీలకం, ఆకర్షణీయం, అదేసమయంలో బాక్సాఫీసు అప్పీలున్న పాయింటు కూడా. కె. రాఘవేంద్రరావు స్క్రీన్ ప్లేలో దీనికి స్ట్రక్చర్ కూడా బాగా  కుదిరింది. ముఖ్యంగా సాయికుమార్ నాగార్జునకి పాచికలు ఇచ్చి తిరుమలకి పంపడమనే ప్రారంభం నుంచీ, నాగార్జున దగ్గర ఆ పాచికలు ఎప్పుడెప్పుడు ఉపయోగంలోకి వస్తాయా అన్న ప్లాట్ డివైస్ లుగా ఆసక్తి కల్గిస్తూ వుంటాయి. మామూలు కథల్లో ఒక ఊర్నుంచి  సర్పంచ్ రాసిచ్చిన ఉత్తరం పట్టుకుని  హీరో సిటీకి వచ్చే కథనం లాంటి దన్నమాట. కాబట్టి ప్రేక్షకులు ఎప్పుడూ ఇష్టపడే ఈ ట్రాక్ ఈ స్క్రీన్ ప్లేకి వెన్నెముకగా నిల్చింది. పాచికలే అతడి జీవితం మొత్తాన్నీ మార్చేశాయి. సింపుల్ గా ఆద్యంతం ఈ ట్రాక్ కి సమాంతరంగా,  ఈ పాచికలతో ఏడుకొండల వాణ్ణి కలవాలన్న భక్తీ తపనలు తప్ప మరోటి లేకుండా చూసి  వుంటే- కథకి ఆథ్యాత్మిక విలువతో కూడిన మెలో డ్రామా కలిసివచ్చేది. 

          ఇంటర్వెల్ కి పది  నిమిషాల ముందు, గంటా పదినిమిషాలకి ఎట్టకేలకు నాగార్జున ధర్మాధికారిగా దైవదర్శనం చేసుకోవడంతో ప్లాట్ పాయింట్ వన్ ఇచ్చారు; దీనితర్వాత ఇంటర్వెల్ కి దేవుడితో పాచిక లాటాడే డ్రీమ్ సీన్ ఇచ్చారు. అలాగే సెకండాఫ్ లో చివరిసారి పాచికలాటలో దేవుడు ఓడిపోయి, ఆభరణాలు కోల్పోవడంతో ప్లాట్ పాయింట్ టూ ఇచ్చారు. వెంకన్నతో నాగార్జున ట్రాక్ ప్లాట్ పాయింట్స్ నీ, ఇంటర్వెల్ నీ కలుపుకునే ఏకత్రాటి పై వుంది. కానీ భక్తి సినిమాకుండే భక్తిరసానికే ఒక  ట్రాక్ లేకుండా పోయింది. దీంతో కథనం ఫ్లాట్ గా వున్నట్టు అన్పిస్తుంది.  ఆలయలంలో అక్రమాలతో విలనీ, కామెడీ ఇవేవీ అక్కడికొచ్చిన నాగ్ పాత్రతో సంబంధం లేకుండా వున్నాయి. అక్కడ నాగ్ భక్తులకి చేసే సేవలప్పుడైనా అదొక ఆధ్యాత్మిక ఉద్యమంలా ఏడుకొండలవాణ్ణి కీర్తించే బృందగానలతో వుండుంటే,  భక్తుల్ని ముందుకు నడిపించే కమిట్ మెంట్ తో చూపించి వుంటే, చివర చేసే త్యాగానికి  ఇవి కనెక్ట్ అయి ఇంకా బలన్నిచ్చేవి. అసలు ఫస్టాఫ్ అంతా నాగ్ భక్తిని మాత్రమే గ్లామరైజ్ చేసి (‘కాబిల్’ లో అంధులైన హీరో హీరోయిన్ల పాత్రల్ని గ్లామరైజ్ చేసినట్టు), సెకండాఫ్ లో పాచికలాట తో కథలోకి వెళ్లి వుంటే (‘కాబిల్’ లో రేప్ తో కథ ప్రారంభమైనట్టు) ఇదొక విలక్షణ స్క్రీన్ ప్లేతో  కూడిన ఆథ్యాత్మిక చలనచిత్రంగా భాసించేది. 

          దర్శకేంద్రుడికి  చెప్పేంత స్థాయి లేదు గానీ, జస్ట్  ఒక పరిశీలన అంతే. 

-సికిందర్