రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

27, జులై 2017, గురువారం

488 - రివ్యూ!

     రచన – దర్శకత్వం : అలంకృతా శ్రీవాస్తవ్
తారాగణం : కొంకణా సేన్ శర్మరత్నా పాఠక్ఆహనా కుమ్రాప్లబితా బోర్థాకూర్సుశాంత్ సింగ్విక్రాంత్ మాసీ, జగత్ సింగ్ సోలంకీ తదితరులు 
సంగీతం : జేబున్నీసా బంగాష్మంగేష్ ధక్డేఛాయాగ్రహణం : అక్షయ్ సింగ్
బ్యానర్ : ప్రకాష్ ఝా ప్రొడక్షన్స్
నిర్మాత ; ప్రకాష్ ఝా
విడుదల : 21 జులై, 2017 
                                                                                                                                                   ***


     సెన్సార్ బోర్డుతో యుద్ధానికి దిగి,  భారీగా 27 కట్స్ తో పహ్లాజ్ నిహ్లానీతో మోరల్ పోలీసింగ్ చేయించుకుని, ఎట్టకేలకు విడుదలైన ‘లిప్ స్టిక్ అండర్ మై బురఖా’ ఒక కరకు వాస్తవాన్ని కళ్ళ ముందుంచుతోంది మోరల్ పోలీసింగ్ చేయకుండానే  : మధ్యతరగతి స్త్రీలు   స్వేచ్ఛ కావాలనో, హక్కులుండాలనో ఎంత గొంతు చించుకున్నా, ఆ గొంతులకంటే వ్యవస్థలు పెద్దవి. ఒక్క ఇటుకని కూడా కదల్చలేరు- మత వ్యవస్థలోంచి, రాజకీయ వ్యవస్థలోంచీ. వూరికే ఇంట్లో వాళ్ళని అడిపోసుకుంటే కూడా లాభంలేదు. వాళ్ళు కూడా  ఈ రెండు వ్యవస్థలకి తరాలుగా బందీలే. 

          న్నతవర్గాల స్త్రీలకి దాదాపు స్వేచ్ఛ వుంటుంది. ఈ స్వేచ్ఛ ఆకర్షణల్ని సృష్టిస్తూంటుంది.  ప్రపంచం ఆకర్షణలు  – కోరికలు అనే రెండుగా విడిపోయివుంది. ఉన్నత వర్గాలు ప్రదర్శించే ఆకర్షణలు, వాటికోసం అర్రులు చాచే మధ్యతరగతి కోరికలు. ఈ గ్యాప్ ని పూడ్చే ప్రయత్నం పైనుంచి ఉన్నత వర్గాలతో జరగదు, ఎప్పుడూ కింది నుంచి మధ్యతరగతి జీవులతో ఊర్ధ్వ ముఖంగానే  జరుగుతూంటుంది. ఎంతకీ ఆ నీలాకాశం అందదు, ఇంతలో రాలిపడి మళ్ళీ వ్యవస్థల బందీకానాలో ముడుచుకోవడమే.

       రకరకాల స్వేచ్ఛలు  కావాలంటే ముందుగా  ఆర్ధిక స్వేచ్ఛ సాధించేందుకు సమయమంతా వినియోగించు- అప్పుడు పబ్బులు, మాల్సు, మల్టీ ప్లెక్సులు, బాయ్ ఫ్రెండ్స్,  కాస్త వయసు మళ్లినావిడకైతే ఫోన్ సెక్స్- అన్నీ చెంతకు వస్తాయి. ఎవరూ అభ్యంతర పెట్టరు. ఆర్ధిక స్వేచ్ఛ లేకుండా అప్పుడే స్వేచ్ఛ పేరుతో ఈ ఆకర్షణల వెంట పడ్డావా- ఈ రియలిస్టిక్ మూవీలో అభాగినుల గతే నీకూ పడుతుంది. స్వేచ్ఛని ఉన్నత వర్గాలు బాహాటంగా అనుభవిస్తాయి. అనుకరణ జీవులైన మధ్యతరగతి వర్గాలు దొంగ చాటుగా అనుభవించాలని చూస్తాయి- అదేం స్వేచ్ఛ? ముందు ఆర్ధిక స్వాతంత్ర్యాన్ని సాధిస్తే ఈ ఖర్మే వుండదు. పొందిన ఆర్ధిక స్వేచ్ఛనంతా కూడా దుర్వినియోగం చేసుకుని డ్రగ్స్ కేసులో దొరికిపోవాలనుంటే దొరికిపో. కానీ డ్రగ్స్ కేసులో దొరికిపోయి హెడ్ లైన్స్ సృష్టించడానికి ఏళ్ల కేళ్ళు  అంత  కష్టపడి గడించిన ఆర్ధిక స్వేచ్ఛంతా  అవసరం లేదు. మధ్యతరగతి జీవిగానే రెండువేలు ఎక్కడ అడుక్కున్నా, చిటికెడు డ్రగ్స్ ఇచ్చేవాళ్ళు, పట్టుకుని ప్రెస్ మీట్ లో పెట్టేవాళ్ళూ ఎప్పుడూ వుంటారు. 

      బురఖా పంజరానికి సింబల్. లిప్ స్టిక్ స్వేచ్ఛకి సంకేతం. పంజరంలో ఈ నల్గురు లిప్ స్టిక్ పక్షులు బయట  రహస్యంగా ‘స్వేచ్ఛ పొందుతూంటారు. ముందుగా కాలేజీ టీనేజీ రిహానా (ప్లబితా బోర్థాకూర్) చక్కగా బురఖా వేసుకుని బయల్దేరి దారిలో తీసిపారేసి,  లోపలున్న జీన్సూ టీ షర్ట్స్ తో టూవీలర్ మీద జామ్మని కాలేజీకి దూసుకుపోతుంది. ఆమెకి చాలా కోరికలున్నాయి. అందుకని కాలేజీ నుంచి వస్తూ షాపింగ్ మాల్స్ లో ఖరీదైన వస్తువులు కొట్టేసి వస్తూంటుంది. ఆమెకింకో కోరిక వుంది- మిలీ సైరస్ లాగా సింగర్ నవ్వాలని. దానికి ఓ బ్యాండ్ గ్రూప్ లో చేరి పాడుతూంటుంది. అక్కడ ధృవ్ అనే బాయ్ ఫ్రెండ్ ఏర్పడతాడు. ఈమె చేసే ఈ రహస్య కార్యకలాపాలేవీ ఇంట్లో బురఖాలు తయారు చేసే  తల్లిదండ్రులకి తెలియకుండా వుంటాయి.


          లీలా (
ఆహనా కుమ్రా) అనే ఓ ఇరవై ఏళ్ళు పైబడ్డ అమ్మాయి బ్యూటీ పార్లర్ నడుపుతూంటుంది. ఆమెకి ఫోటోగ్రాఫర్ బాయ్ ఫ్రెండ్ ( విక్రాంత్ మాసీ)వుంటాడు. తల్లికి దొరక్కుండా అతడితో ఎక్కడపడితే అక్కడ  సెక్స్ స్వేచ్ఛ పూర్తిగా అనుభవిస్తూ వుంటుంది. కానీ ఈ ఇరుకు వూళ్ళోంచి ఢిల్లీ పారిపోయి, అక్కడ ప్రతిరోజూ బాయ్ ఫ్రెండ్ తో హనీమూన్ లా గడపాలనీ  కోరికలుంటాయి. 

          షిరీన్ (కొంకణా సేన్ శర్మ) అనే ముప్పై పైబడ్డ ముగ్గురు పిల్లల తల్లి వుంటుంది. ఈమె ఓ కంపెనీలో సేల్స్  ఎగ్జిక్యూటివ్. భర్త రహీం (సుశాంత్ సింగ్) సౌదీ వెళ్లి వచ్చి ప్రస్తుతం ఖాళీగా వుంటున్నాడు. తన ఉద్యోగం గురించి అతడికి తెలియనివ్వకుండా రహస్యంగా ఆఫీసు కెళ్ళి వస్తూంటుంది. రాత్రయితే ఆమె ఇష్టాయిష్టాలతో నిమిత్తం లేకుండా అతడికి సెక్స్ కావాలి. ఈ మారిటల్ రేప్ ని భరిస్తూ, అనేక గర్భాలు అబార్షన్ చేయించుకుంటూ నిస్సారంగా జీవిస్తూంటుంది. 

     ఉష (రత్నా పాఠక్) అనే 55 ఏళ్ల విడో వుంటుంది. ఈమెకి అప్పుడే వయసై పోలేదనీ, ఇంకా అనుభవించాల్సింది వుందనీ వుంటుంది. హిందీ  రోమాంటిక్ నవలలు చదువుతూ ఫాంటసీల్లో బతుకుతుంటుంది. జగత్ అనే ఒక స్విమ్మింగ్ కోచ్ పరిచయమై, స్విమ్మింగ్ నే ర్చుకునే వంకతో అతడి స్పర్శలోని  హాయిని అనుభవిస్తూ వుంటుంది. రాత్రి పూట రోజీ పేరుతో అతడికి ఫోన్ చేసి ఫోన్ సెక్స్ కి  పాల్పడుతూంటుంది. చాలా గ్లామరస్ గా తయారై హుషారుగా తిరుగుతూంటుంది. 

          ఈ నల్గురూ విడివిడిగా ఈ రహస్య కలాపాలతో ‘స్వేచ్ఛ’ ని పొందుతూ వుంటారు. అప్పుడు మాల్ లో చోరీ కేసులో రిహానా దొరికిపోతుంది. బాయ్ ఫ్రెండ్ వదిలేస్తాడు. ఆమెని విడిపించుకున్న తండ్రి,  కాలేజీ మాన్పించి ఇంట్లో బురఖాలు కుట్టమంటాడు. సంబంధాలు చూడమని భార్యతో చెప్తాడు. మాట్లాడకుండా ఇంట్లో కూర్చుంటుంది రిహానా. 

          లీలా బాయ్ ఫ్రెండ్ తో సెక్స్ చేస్తూ తల్లికి దొరికిపోతుంది. ఆమెని రెండు పీకి సంబంధం చూసి నిశ్చితార్ధం కూడా చేస్తే, బాయ్ ఫ్రెండ్ తోనే ఎంజాయ్ చేస్తూంటుంది. ఆ తల్లి, పెళ్లి కొడుకు వదిలి పారేస్తారు. 

          షిరీన్ కి నలభై వేల జీతంతో ప్రమోషన్ వస్తుంది. ఆమె ఉద్యోగం చేస్తోందన్న సంగతి భర్తకి తెలిసిపోయి రేప్ చేసి, ఉద్యోగం మానేసి,  ఇంట్లో పడుండమంటాడు.

          ఉష సీక్రెట్ లవ్ చుట్టు  పక్కల తెలిసిపోయి ఆమెని వీధికి లాగి అల్లరల్లరి చేస్తారు. ఇది జగత్ చూస్తాడు. తనతో ఫోన్ సెక్స్ చేస్తోంది ఈమేనని అప్పుడు తెలుసుకుని,  అనరాని మాటనేసి వెళ్ళిపోతాడు.

          ఎలా మొదలయ్యారో మళ్ళీ అదే స్థితికి- అదే పంజరంలోకి వచ్చి  చేరుకున్న  నల్గురూ ఓ గదిలో చేరతారు. ఏదో పైకెగురుదామనుకుంటే, ఇంకింత  అధఃపాతాళంలోకే  పడ్డారు. ధూమపానం  చేస్తూ కబుర్లాడుకుంటారు. జనం చించి పారేసిన ఉష దాచుకున్న నవలలుంటాయి రకరకాల రోమాంటిక్ టైటిల్స్ తో. వాటితో కాసేపు ఆ ఓల్డ్ లేడీని ఆటలు పట్టిస్తారు. ఒక నవల చివరి మూడు పేజీలు  చదవలేదని, చదివి విన్పించమనీ  అంటుందామె. ఇప్పుడా రోజీ కథ ముగింపు చదివి విన్పిస్తుంది రిహానా. చాలా ఫీలవుతారు. 

        ప్రారంభంనుంచీ వాయిసోవర్ లో అప్పుడప్పుడు వచ్చే రోజీ కథ ఈ  నవల్లోనిదన్న మాట. మొత్తం కథలో  ఈ నల్గురికీ వర్తించే వెన్నో వున్నాయి. ఒక ప్రధాన పాత్రంటూ లేకుండా, నల్గురి వేర్వేరు కథలుగా వున్న స్క్రీన్ ప్లేకి,   వాయిసోవర్ లో రోజీ కథనం ఒక బ్రిడ్జింగ్ ఫోర్సుగా కలిపి వుంచుతుందన్న మాట.

          ఈ పాత్రల్ని మర్చిపోలేం, ఈ నటుల్ని మరచిపోలేం, ఈ దర్శకురాలినీ మర్చిపోలేం. ప్రముఖ దర్శకుడైన నిర్మాత ప్రకాష్ ఝానీ కొనియాడలేక వుండలేం. చాలాకాలం పాటు ఈ సినిమా మనుషులనే వాళ్ళని వెంటాడుతూంటుంది. స్వేచ్ఛ అంటే ఏమిటో, అందులోనూ మధ్యతరగతి ఆడవాళ్ళు అర్ధం చేసుకోవాల్సిన స్వేచ్ఛ అంటే ఏమిటో, అదెలా లభిస్తుందో, ఎలా లభించదో, ఎప్పుడు లభిస్తుందో, ఎప్పుడు లభించదో - ఒక్క డైలగుతోనూ చెప్పకుండా, పరిణామాల క్రమం చూపించి వదిలేసిన ఈ క్రియేషన్ ఒక అద్భుతమైన అనుభవం ప్రేక్షకులకి.

-సికిందర్
         
         








488- రివ్యూ!


రచన- దర్శకత్వం : శ్రీనివాస్ రాజు
తారాగణం : శృతి, పూజా గాంధీ, సంజన, వి శంకర్, మార్కండ్ దేశ్ పాండే, రఘు ముఖర్జీ, భాగ్యశ్రీ, రవి కాలే, పెట్రోల్ప్రసన్న, డానీ కుట్టప్ప, జయదేవ్, కరి సుబ్బు, కోటి తదితరులు
సంగీతం : అర్జున్ జన్య, ఛాయాగ్రహణం : వెంకట్ ప్రసాద్
బ్యానర్ : నిర్మాత
: వెంకట్, విడుదల : 22 జులై, 2017

***

        హిట్టయిన కన్నడ ‘దండుపాళ్యం’ ని తెలుగులోనూ బాగానే రిసీవ్ చేసుకున్నారు ప్రేక్షకులు. ఐదేళ్ల తర్వాత దీని సీక్వెల్ గా ‘దండుపాళ్యం- 2’ విడుదలయింది. యాక్షన్ / హార్రర్  సినిమాలే సీక్వెల్స్ గా విడుదలవుతాయని తెలిసిందే. ఐతే ‘దండుపాళ్యం’ సీక్వెల్ ఏ రకంగా సీక్వెల్ అవుతుంది? సీక్వెల్ కి కూడా భాగాలుంటాయా? అపుడు దాని ప్రభావం ఎలా వుంటుంది? ఓసారి చూద్దాం...

కథ  
          ‘దండుపాళ్యం’ లో 80 హత్యలు చేసిన కిరాతక దోపిడీ ముఠా దొరికిపోయి జైలు కెళ్తారు. ఇప్పుడు దీని తర్వాత ఏం జరిగిందనేది మిగతా కథ. ఆరేళ్ళ విచారణా ననంతరం ఈ పదకొండు మంది సీరియల్ కిల్లర్స్ కీ మరణ శిక్షలు పడతాయి. అయితే అభివ్యక్తి (శృతి) అనే జర్నలిస్టు  వీళ్ళు  నేరస్థులని నమ్మదు. ఈ కేసులో పోలీసుల పాత్రని అనుమానించి దర్యాప్తు చేయడం మొదలెడుతుంది. ఈ దర్యాప్తులో భాగంగా ముఠా సభ్యులని జైల్లో కలుస్తుంది. అప్పుడు వాళ్ళ కోణంలో వాళ్ళు చెప్పుకొచ్చేదే ఈ సీక్వెల్ కథ...
ఎలావుంది కథ
         దండుపాళ్యం’ లాగే ఇదీ పూర్తిగా నిజకథ  కాదు, కాల్పనికం చేశారు. కర్నాటకలో నిజ కథకి 1930 లలో బీజాలు పడ్డాయి. ఐతే  1996 – 2000 మధ్య ఈ చివరి తరం గ్యాంగ్ సభ్యులు పాల్పడ్డ దోపిడీ హత్యలు రాష్ట్రాన్ని గజగజ లాడించాయి కాబట్టి,  దీన్ని కాల్పనికం చేసి  మొదట 2012 లో ‘దండుపాళ్యం’ తీస్తూ వాళ్ళు పట్టుబడినట్టు ముగించారు. ఇప్పుడు సీక్వెల్ తీస్తూ ఇదే కర్కోటక ముఠా అమాయకులనీ, పోలీసులు వీళ్ళని ఇరికించి అన్యాయంగా మరణశిక్షలు పడేలా చేశారనీ చూపిస్తూ  సానుభూతి కలిగించే ప్రయత్నం చేశారు. తాజాగా కర్నాటక హైకోర్టు జులై 21 న ఈ పదకొండు మందిలో ముగ్గురికి ఉరిశిక్షలు రద్దు చేసింది కూడా. దీనిమీద పోలీసులు సుప్రీం కోర్టు కెళ్ళినా ప్రయోజనం లేనంత డబ్బా కేసు పెట్టారు. ఈ సీక్వెల్ లో కథకోసం కొన్ని కల్పితాలు చేశారు. వాటిలో ఒకటి- ఎలాటి సర్కమ్ స్టేన్షియల్, మెడికల్, ఫోరెన్సిక్ సాక్ష్యాలు లేకుండా, కేవలం సాక్షుల చేత చెప్పించి కేసులు  నడిపించారని.  ఈ కథలో చెప్పినట్టుగా, ఐదేళ్లుగా దొరక్కుండా ఎనభై హత్యలు చేశారని చెబుతున్న ముఠాని ఒకవేళ కేసుల్లో  ఇరికించాలనుకుంటే, పోలీసులు అంత  బలహీనంగా కేసులు పెడతారా అన్న సందేహం వస్తుంది.  ఇంత బలహీన కేసు మరణ శిక్షల దాకా వెళ్తుందా?  వాస్తవంగా ముద్దాయిల్లో ఆరుగురి మీద రేప్ నేరాలకి రుజువుల్లేవని కూడా కొట్టేసింది  హైకోర్టు.  హత్య కేసుల్లో అతిముఖ్యమైన సర్కమ్ స్టేన్షియల్, మెడికల్, ఫోరెన్సిక్ సాక్ష్యాలు లేకుండా, చెప్పుడు సాక్ష్యాలతో  ఏ కోర్టూ విచారణ చేపట్టదు. ఇలా సీక్వెల్ లోనే అర్ధంలేని కల్పన చేశారు. ఈ కేసుని ప్రాథమిక స్థాయిలో ట్రయల్ కోర్టు చేపట్టిందంటేనే  ఎంతో కొంత మెటీరియల్ ఎవిడెన్స్ ఉన్నట్టే. ఆ మెటీరియల్ ఎవిడెన్సులో భాగమైన వేలిముద్రలు కలవక ముగ్గురికి మరణశిక్షల్ని రద్దు చేసింది హైకోర్టు.
          కాబట్టి నిజంగా జరిగింది  చూస్తే  పోలీసుల అసమర్ధత కన్పిస్తుంది. దీన్ని సినిమాకోసం లాజిక్ చూడకుండా పోలీసుల కుట్రగా మార్చి, నిందితుల్ని అమాయకుల్ని చేసి సీక్వెల్ నడిపించారు.  ఇలాటి  క్యారక్టర్ రివర్సల్ మూసఫార్ములాకైతే చెల్లుతుందేమోగానీ, రియలిస్టిక్ సినిమాతో కాదు.  ఇక దీన్నెలా జస్టిఫై చేశారో సీక్వెల్లో తేల్చలేదు. నడుస్తూ నడుస్తూ వున్న సీక్వెల్ ని ఠకీ మని ఆపేసి,  ముగింపు ఆగస్టులో చూడండని ప్రకటన వేసి షాకిచ్చారు. ముగింపు కోసం ఇంకోసారి డబ్బులు పెట్టుకుని చూడాలా? ఇదెవరూ నోరత్తలేని మోసమే పూర్తి సినిమా చూపించకుండా. ‘దండుపాళ్యం’ ని పాడియావు చేసి సాధ్యమైనంత పిండుకోవాలని చూస్తున్నారు. ‘దండుపాళ్యం – 2’ రెండు భాగాలుగా వుంటుందని ముందే చెప్పివుంటే అదివేరు.
          ఇకపోతే ముగింపు లేని సినిమాకి రివ్యూ  ఏమిటి? ఎలా రాస్తాం? ఏమో!
ఎవరెలా చేశారు
          పోలీసు అధికారిగా రవిశంకర్ కి చాలా పనుండే సీక్వెల్ ఇది. ‘
దండుపాళ్యం’లో ముఠా పాల్పడ్డ ఘోరాలు చూపిస్తే, ఇప్పుడు పోలీసుల అకృత్యాలు చూపించడం మొదలెట్టారు. ఈ అకృత్యాలకి సారధి రవిశంకర్ పాత్ర. కౄర నీచ నికృష్ట పాత్రని కూల్ గా పోషించాడు. కూలీల చేత చెయ్యని నేరాన్ని ఒప్పించడానికి పెట్టే చిత్ర హింసల్లో అతి పచ్చిగా కన్పిస్తాడు. ఇతనూ ఇతడి సహోద్యోగులు ఇద్దరూ టార్చర్ సెక్షన్ చూసుకుంటే, ఇక పదకొండు మంది ముఠా చిత్రహింసలకి అల్లాడే బ్యాచిగా కన్పిస్తారు. బ్యాచిలో పూజా గాంధీ బాధిత పాత్రలో ఎంత జీవించినా దాని ప్రభావం ప్రేక్షకుల మీద పడే అవకాశం లేదు. ఆమె పచ్చి హంతకురాలని ముందే చూసేశారు ప్రేక్షకులు. ఇదే పరిస్థితి బ్యాచిలో మిగతా అందరితోనూ.  

          సంజన గురించి పెద్ద హైప్ వచ్చింది. ఈ సీక్వెల్ లో ఆమె ఎక్కడుందో వెతుక్కోవాల్సిన పరిస్థితి. బ్యాగ్ గ్రౌండ్ ఆర్టిస్టుగా రెండు మూడు సీన్లలో కన్పించి అవుట్ అయిపోతుంది. టెక్నికల్ గా ఛాయాగ్రహణం, బిజిఎంలు బలంగా వున్నాయి. ఛాయాగ్రహణంలో పోలీస్ టార్చర్ కి అవసరమైన చోట్ల డచ్ యాంగిల్స్ వాడుకున్నారు. ఇది కేవలం ఒక రియలిస్టిక్ మూవీ లాంటిదే తప్ప డార్క్ మూవీ కాదు, ఏ నోయర్ కాదు- కథాపరంగానూ, చిత్రీకరణ పరంగానూ. సంభాషణల్లో పదేపదే పచ్చి బూతులు దొర్లాయి. 
చివరికేమిటి
         
ఫస్టాఫ్ మరణ శిక్షలు పడ్డ దోషులు జైలుకి రావడం, వీళ్ళు దోషులని నమ్మని జర్నలిస్టు దర్యాప్తు చేపట్టడం, జైల్లో వాళ్ళని కలుసుకోవడం వుంటాయి. సెకండాఫ్ లో వాళ్ళు జర్నలిస్టుకి తమ ప్లాష్ బ్యాకుగా చెప్పుకునే జీవితాలుంటాయి. ఈ ఫ్లాష్ బ్యాక్ కొనసాగుతూనే పోలీస్ టా ర్చర్ల  ఎపిసోడ్లు మొదలవుతాయి. పూజా గాంధీ టార్చర్ తో అకస్మాత్తుగా సెకండాఫ్ ముగిసి,  ముగింపు ఆగస్టుకి వాయిదా వేశాం పొమ్మనడం వుంటుంది. 

          ఫస్టాఫ్ లో త్వరత్వరగా పది నిమిషాల్లో జర్నలిస్టు దర్యాప్తు చేపట్టడంతో బిగినింగ్ ముగిసి  ప్లాట్ పాయింట్ వన్ వచ్చేస్తుంది. బహుశా సెకండాఫ్ చివర్లో పూజా గాంధీ టార్చర్ తో  ప్లాట్ పాయింట్ టూ వస్తుంది. ఈ మధ్యలో నడిచే మిడిలంతా, ఫస్టాఫ్ లో బావున్న మిడిల్ వన్ వదిలేస్తే, సెకండాఫ్ లో మిడిల్ టూలో,  ఆ ఫ్లాష్ బ్యాక్ అంతా అనాసక్తికరం, అనవసరం, బాక్సాఫీసు అప్పీల్ లేనితనం, పరమబోరు కొట్టే నాటకం. ఎంత కౄరులో ‘
దండుపాళ్యం లో చూపించాక, ఇప్పుడెంత కల్లాకపటం ఎరుగని నగరానికి వలస వచ్చిన అమాయక జీవులో చూపిస్తే, నవరసాల్లో ఇదే రసమవుతుంది ప్రేక్షకులు  కనెక్ట్ అవడానికి? ‘నిర్భయ’ దోషులు పూర్వం ఏంతో పవిత్రులని చెప్తే చెల్లుతుందా? యాకుబ్ మెమన్ ఉరి రద్దుని కోరడమెలాంటిదో, దండుపాళ్యం ముఠా పట్ల సానుభూతిని ప్రోది చేయడం అలాంటిదే అన్నట్టు తేలింది. 

          వీళ్ళని సంచార జాతిగా చూపిస్తూ, గుడిసెల్లో జీవించడం, పందుల్ని పెంచడం, అర్ధాకలితో అలమటించడం, అన్నం అడుక్కుంటూ తిరగడం, జబ్బుతో చావడం...ఒకటని కాదు, ఇప్పటి సినిమాల్లో కన్పించని  సినిమా కష్టాలన్నీ, కన్నీళ్ళన్నీ వున్నాయి. ఆర్టు సినిమా కళలన్నీ వున్నాయి. 

          సెకండాఫ్ లో సంగం ఈ జీవితాలు, సగం పోలీస్ టార్చర్. విషయంలేని ఈ వృధానంతా  అరికడుతూ జర్నలిస్టు పాత్రతో ప్రస్తుతానికి వచ్చి వేగవంతం చేయాల్సింది. కానీ దీన్ని పాడియా వుగా చూస్తూ, ఇంకా ప్రేక్షకుల జేబుల్లోంచి డబ్బులు పిండుకునే ఉద్దేశంతో సాగదీశారు. ఇంత ఫ్లాష్ బ్యాక్ చెబుతున్న హంతక ముఠా నిజమే చెప్తున్నారని మనమెలా నమ్మాలి? దీనికి జర్నలిస్టు దొరకబుచ్చుకున్న ఒక్క ఆధారమూ విశ్వనీయత కోసం ఎస్టాబ్లిష్  చేయలేదు. 

          ముగిసిపోయిన ‘
దండుపాళ్యం’ దారుణ చరిత్రని కెలికి ఇంకేదో చేయాలనుకున్నారు. దీన్ని ఆగస్టు ముక్కలో ఎలా జస్టిఫై చేస్తారో చూసేందుకు, ఈ రివ్యూని కూడా ముగింపు వాయిదా వేసి  వెళ్లిపోదాం.

-సికిందర్