రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

10, ఫిబ్రవరి 2018, శనివారం

602 : రివ్యూ!


దర్శకత్వం: మదన్
తారాగణం:  మోహన్ బాబు, విష్ణు, నిఖిలా విమల్, శ్రియ, అనసూయ, కోట శ్రీనివాసరావు, తనికెళ్ళ భరణి, శివప్రసాద్, నాగినీడు, బ్రహ్మానందం, అలీ, రఘుబాబు, సత్యం రాజేష్, రాజా రవీంద్ర తదితరులు  
కథా విస్తరణ : పరుచూరి బ్రదర్స్, కథ – మాటలు : డైమాండ్ రత్న బాబు, సంగీతం: ఎస్.ఎస్.తమన్, ఛాయాగ్రహణం: సర్వేష్ మురారి
బ్యానర్ : లక్ష్మీ  ప్రన్న పిక్చర్స్
నిర్మాత:  మోహన్ బాబు
విడుదల : ఫిబ్రవరి 9, 2018
***
     
లెక్షన్ కింగ్ మోహన్ బాబు ద్విపాత్రాభినయం చేస్తూ నిర్మాతగా ఓ ఫ్యామిలీ డ్రామా / థ్రిల్లర్ తో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ద్విపాత్రాభినయాలు, నిర్మాణాలూ ఆయనకి కొట్టిన పిండే. 40 ఏళ్లుగా తన ప్రేక్షకుల్ని అలరిస్తూ వస్తున్నారు. కాకపోతే ఈ తరం ప్రేక్షకులకి తన బయోడేటా ఇచ్చుకోవాల్సి వుంటుంది గనుక,  అది  కూడా ఎన్నో పరిచయ సీన్లతో నెరవేర్చి, పాతా కొత్తా ప్రేక్షకులని సంతృప్తిపర్చే ఒక  టూ ఇన్ వన్ ప్యాకేజీలా సమర్పించే సంకల్పంతో,  దర్శకుడు మదన్ తో కలిసి ఈ ప్రయత్నం చేశారు. దర్శకుడు మదన్ ‘పెళ్ళయిన కొత్తలో’, ‘ఆ నల్గురు’ వంటి ఫ్యామిలీ డ్రామాలతో పరిచితుడే. కాకపోతే రెండేళ్ళ  గ్యాప్ తర్వాత వస్తున్నారు. మోహన్ బాబు కూడా మూడేళ్ళ తర్వాత కన్పిస్తున్నారు. ఈ విరామంలో వీళ్ళిద్దరూ కాలానుగుణంగా అప్డేట్ అయ్యారా? లేక ప్రేక్షకులకంటే వెనుకబడి వున్నారా? ‘గాయత్రి’ తో చివరి కేం సాధించారు?... వీటికి సమాధానాలు అన్వేషిద్దాం. 

కథ 
      దాసరి శివాజీ (మోహన్ బాబు) స్టేజి నటుడు. ప్రసవంలోనే భార్య శారద (శ్రియ) ని కోల్పోతాడు. కూతురు  గాయత్రి ( నిఖిలా విమల్) కూడా పుట్టగానే కన్పించకుండా పోతుంది. ఇరవై ఏళ్లుగా కూతుర్ని  అన్వేషిస్తూ, మరో పక్క భార్యా కూతుళ్ళ జ్ఞాపకంగా అనాధాశ్రమాన్ని నడుపుతూంటాడు. దీని ఖర్చుల కోసం జైలు కెళ్ళి వస్తూంటాడు. స్టేజి నటుడుగా మారు వేషాలెయ్యడంలో దిట్ట. దీంతో జైలు శిక్షలు పడ్డ పెద్ద మనుషుల స్థానంలో డబ్బులు తీసుకుని,  వాళ్ళలాగా తనే వెళ్లి శిక్షాకాలం పూర్తి చేసి వస్తూంటాడు. 

         ఒకరోజు ఒకమ్మాయిని దుండగుల బారి నుంచి కాపాడుతాడు. ఆ అమ్మాయే  కూతురు గాయత్రీ అని తెలుసుకుని ఆమెని కలవబోతే, ఆమెకి తన మీద దురభిప్రాయాలున్నాయని తెలుసుకుని కలవకుండా వెళ్ళిపోతాడు. తీవ్ర క్షోభతో గడుపుతూంటాడు. ఇంతలో  గాయత్రి పటేల్ (మోహన్ బాబు డబుల్) అనే ఘరానా మనిషికి ఒక కేసులో శిక్ష పడుతుంది. అచ్చం తనలాగే వున్న ఇతడి బదులు తను జైలు కెళ్ళి రావడానికి ఒప్పుకుంటాడు డబ్బు కోసం. అలా జైలుకెళ్ళి ఇరుక్కుంటాడు. గాయత్రీ పటేల్ ఆడుతున్న గేమ్ లో పావు అయిపోతాడు. ఇప్పుడు ఉరిశిక్ష నుంచి ఎవరు తనని కాపాడాలి? కూతురు కాపాడుతుందా? ఎలా కాపాడుతుంది? ఇదే మిగతా కథ. 

ఎలావుంది కథ 
      ఐడియాపరంగా  కథ 1980 నాటిది అనుకోలేం. 1930 ల నాటి ఐడియాతో  ‘మర్డర్ ఆన్ ది ఓరియెంట్ ఎక్స్ ప్రెస్’ ని 2017 లో కాలానికి తగ్గట్టు ఆధునికంగా మార్చి తీశారు. ఐడియాలు పాతబడవు. వాటికి కాలం చెల్లిన కథనాలు చేస్తేనే పాడవుతాయి. ‘గాయత్రి’  ఐడియాకి  ఆధునికంగా కథనం చేయకపోవడం వల్ల, మొత్తం కథే  1980 ల నాటి పాత వాసనలతో   నిండిపోయింది. ఈ కథా విస్తరణ పరుచూరి బ్రదర్స్ చేశారు. వాళ్లకి మనం చెప్పేంత వాళ్ళం కాము. కానీ కథ నందించిన మాటల రచయిత డైమండ్ రత్నబాబుకి చెప్ప వచ్చు. ఈ కథ ఫ్యామిలీ డ్రామా జానరా, లేక ఫ్యామిలీ థ్రిల్లర్ జానరా? లేక రెండూనా?  రెండూ కావడానికి వీల్లేదు. ఒక ఒరలో విడివిగా, దేనికదిగా రెండూ ఇమడవు. జానర్ల మిశ్రమంలో ఒక ప్రధాన జానరే  కథ చెప్తుంది. మిగతా జానర్లు అనుబంధంగా సాగుతాయి. ఒక ప్రధాన జానర్ గా నడిచే కథ ఆకస్మికంగా ఇంకో ప్రధాన జానర్ గా మారిపోదు. ‘గాయత్రీ’ లోలాగా ఫ్యామిలీ డ్రామా జానర్ కాస్తా ఫ్యామిలీ థ్రిల్లర్ జానర్ గా మారిపోదు. ఇదే ‘గాయత్రి’ కథతో  వచ్చిన ఇబ్బంది. పూర్తి రసభంగం. సరీగ్గా టబు – గోవిందాల ఫ్లాపయిన ‘హవా’ తో వచ్చిన ఇబ్బంది లాంటిది. సైకో హార్రర్ కాస్తా,  కూతురితో తల్లి సెంటిమెంటల్ డ్రామాగా మారిపోయిన వైనం. 

           కృష్ణ, కాంచనలతో జడ్జి పాత్రలో గుమ్మడి విలన్ గా నటించిన, ‘నేనూమనిషినే’ ఫ్యామిలీ డ్రామా, ఫ్యామిలీ థ్రిల్లర్ అనే రెండు జానర్లు గా లేదు. అది ఫ్యామిలీ థ్రిల్లర్ జానరే. ఆ ఫ్యామిలీ డ్రామా అనేది కేవలం థ్రిల్లర్ లో ఇమిడిన పరిమిత ఎమోషనే. ఒక పోలీసు అధికారి తమ్ముడు, ఆ తమ్ముడి కాబోయే భార్య- వీళ్ళతో  కిల్లర్ జడ్జిగా  గుమ్మడి రక్తి కట్టించే అనుబంధాల ఎమోషనల్ సస్పెన్స్ – ఫ్యామిలీ థ్రిల్లర్! 

          ఇంకా ఇలాటి ఫ్యామిలీ థ్రిల్లర్లు  హిందీలో, ఇంగ్లీషులో చాలా వున్నాయి. అవి చూసి వుండాల్సింది. ముందుగా కావలసిన జానర్ ని నిర్ణయించుకుని,  ఆ జానర్ మర్యాదకి బాగా కట్టుబడి,  ఈ నాటికి తగ్గ ఆధునిక కథనం చేయకపోవడం వల్ల అవుట్ డేటెడ్ కథగా పేరొచ్చింది  ‘గాయత్రి’ కి.  ఆధునిక కథనం  చేస్తే మోహన్ బాబు ఇమడరనా? ‘పింక్’ లో అమితాబ్ బచ్చన్ చక్కగా ఇమిడారు. అమితాబ్ లేకపోతే అమ్మాయిల సమస్యతో ఆధునిక కోర్టు డ్రామా థ్రిల్లర్ ‘పింక్’ లేదు. ‘గాయత్రి’ కథంతా చూసి బయటి కొస్తోంటే,  తెలుగు సినిమాల వ్యాపార యుగం - 1 నాటి కథాకథనాలు చూసిన ఫీల్ తో అడుగులు భారంగా పడసాగాయి. 2000 నుంచి నడుస్తోంది వ్యాపార యుగం – 2 కదా?  

          సినిమాకి కావాల్సింది ప్రాథమికంగా మార్కెట్ యాస్పెక్ట్,  దాంతో క్రియేటివ్ యాస్పెక్ట్ అనే  రెండూ. ఇవి కన్పించట్లేదు. మార్కెట్ యాస్పెక్ట్ లో దీనికి యూత్ అప్పీల్ లేదు. యూత్ అప్పీల్ వుండడానికి తండ్రీ కూతుళ్ళ  ఈ కథలో కీలకమైన మెడిసిన్ చదివే కూతురి పాత్ర వుంది. యూత్ అప్పీల్ కి ఈ మెడిసిన్ చదవడమొక్కటే కనెక్ట్ అయ్యే అంశంగా వుంది.  మిగతా ఏ విషయంలోనూ నేటి తరానికి పరిచయమేలేని 1980 నాటి ఓల్డ్ మోడల్ పాత్రే. నేటి తరానికి,  అందునా గర్ల్స్ కి ఎక్కడా కనెక్ట్ అవని పరాయి పాత్ర. ‘పింక్’ తో ఈ పరిస్థితి లేదు. అందులోని హీరోయిన్ నవతరానికి ప్రతినిధిలా కనపడింది కాబట్టే, తెలుగమ్మాయిలు సైతం  దాన్ని విరగబడి చూశారు.  అదే ‘గాయత్రి’ టైటిల్ చూసి,  ‘గాయత్రి’కి వచ్చిన నల్గురైదుగురు తెలుగమ్మాయిలు ముక్కున వేలేసుకుని గబగబా వెళ్లి పోయారు.

ఎవరెలా చేశారు
      ఇది పూర్తిగా మోహన్ బాబు వన్ బై టూ మాన్ షో. ఒక శివాజీ,  ఒక గాయత్రీ పటేల్ షో. ఆయన గురించి కొత్తగా చెప్పుకునేదేముంది? డీసెంట్ గా రెండు పాత్రల్ని పోషించారు.  శివాజీగా ఎంతో కదిలించే విధంగానూ నటించారు. భర్తగా ఆయనకి నటించే అవకాశం లేదు. తన యుక్త వయసులో భర్త పాత్ర ఫ్లాష్ బ్యాక్ లో విష్ణు కిచ్చారు. అక్కడ్నించీ తను కూతురి అన్వేషణలో వున్న తండ్రిగా ఒక పాత్ర,  విలన్ గా ఇంకో  పాత్రా  నటించారు. విలన్ గాయత్రీ పటేల్ గా ఎదురుచూడని  హాట్ లుక్ తో ఎంట్రీ ఇచ్చారు. ఎవరైనా అలా కళ్ళప్పగించి చూస్తూ వుండి  పోవాల్సిందే. ఇలాటి మెస్మరైజింగ్ మేకోవర్ యువ స్టార్స్ ఎవరికీ సాధ్యం కాలేదంటే అతిశయోక్తి కాదు. హేర్ స్టయిలే ఆయనకి అపూర్వంగా అంత హాట్ లుక్ నిచ్చింది. పలికే డైలాగులతో మరింత టెర్రిఫిక్. 

          శివాజీ సౌమ్యుడిగా ఒక పేజీ మీద  కన్పిస్తాడని ఇతర పాత్రలు చెప్పుకుంటాయి. అదే పేజీ తిప్పితే రెండో పేజీ వేరేగా  వుంటుందని జాగ్రత్త చెప్పుకుంటారు. పాత్రకి హై పాయింట్ ప్లాట్ పాయింట్  వన్ ఘట్టం, దాన్ని అనుసరించి పాట. కూతురెవరో తెలిసిందన్న ఆనందంతో ప్రదర్శించిన నటన కళ్ళు చెమ్మగిల్లేలా చేస్తాయి. దీని వెంటనే అదే ఆనందంతో వచ్చే పాట ఒక బలమైన సెంటిమెంటల్ నాటకీయత. అసలీ రెండిటితో ప్లాట్ పాయింట్ వన్ ఒక అపూర్వ ప్రయోగమనే అనాలి. దీని విషయం తర్వాత చూద్దాం. 

          ఫ్లాష్ బ్యాక్ లో యువ శివాజీగా విష్ణు పౌరాణిక డైలాగులు పలికే ఒక దృశ్యం మొదటిసారిగా అతడికా టాలెంట్ వుందన్న సంగతిని బయట పెడుతుంది. శివాజీగా  పౌరాణిక డైలాగులతో మోహన్ బాబు వెండి తెరని చించెయ్యడం ఒకెత్తు. విష్ణు తక్కువేం కాదు. అయితే ఇతరంగా చూస్తె పాత్రలో బాగానే నటించినా, పాతకాలం పాత్ర కావడంతో తను గుర్తుండడానికి స్కోపు లేకుండా పోయింది. శ్రియతో ప్రేమ గానీ, చేసే కాపురంగానీ   పాత  సినిమా చూస్తున్నట్టు వున్నాయి. శ్రియతో ‘ఒక నువ్వూ ఒక నేనూ ఒకటయ్యాం మనం’ డ్యూయెట్ మాత్రం సినిమాకి హైలైట్.

          శ్రియ కూడా పాత విశ్వనాథ్ సినిమా హీరోయిన్ లా కన్పిస్తుంది. ఇరవై ఏళ్ల క్రితం ఫ్లాష్ బ్యాక్ ఇది. ఆనాడు కూడా సినిమాల్లో హీరోయిన్లు ఇలాటి వేష భాషలతో  కన్పించరు. ఇరవై ఏళ్ల క్రితం ఫ్లాష్ బ్యాక్ అని చెప్పి 40 ఏళ్ల నాటి పాత్రలు  దృశ్యాలు సంగతులు చూపించారు. శ్రియది చనిపోయే పాత్రయినప్పుడు,  దానికుండే డైనమిక్స్ తో కూడా పాత్రచిత్రణ చేయలేదు. యాక్టివ్ పాత్ర చనిపోతే డైనమిక్స్ వుంటాయి. ఆ పాత్ర గుర్తుంటుంది. పాసివ్  పాత్ర పాసివ్ గానే చనిపోతే ప్రభావమే వుండదు. ‘మనం’ లో శ్రియ ని ఇంకా పూర్వపు ఫ్లాష్ బ్యాక్ లో ఎంతో యాక్టివ్ గా చూపించారు గుర్తుండి పోయేలా. 

          కూతురి పాత్రలో హీరోయిన్ నిఖిలా విమల్ మంచి భావప్రకటనా సామర్ధ్యమున్న నటి. కానీ చేయడానికి పాత్రగా ఏమీ లేదు. కారణం, తండ్రీ కూతుళ్ళ కథ ఒక భావోద్వేగ భరిత పతాక స్థాయికి చేరకముందే, గాయత్రీ పటేల్ పాత్ర అడ్డురావడం, కథని అతను తన వైపు తిప్పుకోవడం. పైగా పాత్రకి నేటి తరాన్ని ఆకర్షించే లక్షణాలేవీ కూడా కన్పించవు. శ్రియ పాత్రకి లాగే పాసివ్ గా, సాత్వికంగా కన్పించే పాత్ర. పైగా ఫస్టాఫ్ లో శివాజీ డామినేషన్ -  సెకండాఫ్ లో గాయత్రీ పటేల్ డామినేషన్ ల  మధ్య తనకి సీన్లు కూడా తక్కువే. క్లయిమాక్స్ లో తప్పదు కాబట్టి కొంత హడావిడీ.

          టీవీ జర్నలిస్టుగా అనసూయ మరో ‘క్షణం’ తడాఖా చూపించాలనుకుంటే కుదర్లేదు. అసలీ కథంతా శివాజీ డబుల్ గా వ్యవహరిస్తూ,  నేరస్తుల బదులు తను జైలుకెళ్ళి వస్తున్నాడన్న  ఆమె ఇన్వెస్టిగేషన్ పరంగా ఛానెల్ బాస్ (రఘుబాబు)కి చెప్పుకురావడంగా వుంటుంది. క్లయిమాక్స్ లో ఆమె స్థానాన్ని కూతురి పాత్ర ఆక్రమించడంతో ఆమె అంతంత మాత్రంగా  మిగిలిపోతుంది. అయితే ఒక జర్నలిస్టుగా ఎక్కడా నవ్వకుండా, ప్లెజెంట్ గా వుండకుండా అంత సీరియస్ గా  వుండాల్సిన అవసరమేమిటో అర్ధంగాదు. 

          జడ్జిగా ఒక సీనులో కోట, లాయర్ గా రెండు సీన్లలో తనికెళ్ళ, జైలర్ గా కొన్ని సీన్లలో నాగినీడు, శివాజీ పాత్ర స్నేహితుడిగా శివ ప్రసాద్ కన్పిస్తారు. బ్రహ్మానందం, అలీ, సత్యం రాజేష్ ల కామెడీ కాలం చెల్లిన కామెడీ. నవ్వేం రాదు. సహాయపాత్రల తారాగణం ఎంపికలో  కూడా యూత్  అప్పీల్ లేదు. నిఖిలా విమల్, అనసూయలు తప్ప ఇంకో యువనటీ,  యువ నటుడూ లేరు. 

          డైమండ్ రత్నం రాసిన డైలాగులు బావున్నాయి. నేటి రాజకీయాల మీద భిన్నమైన డైలాగులు రాశారు. రాజకీయాల మీద నేటికి వర్తింప జేసి  డైలాగులు రాయాలన్న సామా జిక స్పృహ గల తను, కథని మాత్రం నేటికి వర్తించని విధివిధానాలతో రాసేశారు. 

          సాంకేతిక ప్రమాణాలు బావున్నాయి. సర్వేష్  మురారీ మరోసారి నీరెండ లాంటి తన సినిమాటోగ్రఫీ చమక్కులు చూపించారు. పాటల చిత్రీకరణలో మరీ అద్భుతం. పాటలకొస్తే, ఆశ్చర్యకరంగా తమన్ ఒక నిజమైన మ్యూజికల్ అనుభావాన్నిచ్చారు. నేపధ్య సంగీతమైతే సన్నివేశాలనే ఎలివేట్ చేసింది. 

          అయితే మదన్ దర్శకత్వమే పాత స్కూలు దర్శకత్వంలా వుంది. ఉన్న కథనంతో కూడా వేగం లేదు. ఫస్టాఫ్ దాదాపూ విషయం లేకుండానే మోహన్ బాబు టాలెంట్ ని చూపించే రిపీట్ దృశ్యాలతో నింపేశారు. సెకండాఫ్ ఫ్లాష్ బ్యాక్ సహా, మిగతా యాక్షన్ స్టోరీ అదే పాత పోకడలతో నడిపారు. ఇందులో ఫాలోకాలేని ఎన్నో ట్విస్టులు పెట్టారు. తండ్రీ కూతుళ్ళ అసలు కథ సెకండాఫ్ లో వదిలేసి గాయత్రీ పటేల్ మీద పడ్డారు. ముందు స్ట్రక్చర్ చూసుకోవడం ముఖ్యం, చూసుకోకుండా జర్నలిస్టు చెప్పే ఫ్లాష్ బ్యాక్ తో ప్రధాన కథ, అందులో మళ్ళీ ఇంకో ఫ్లాష్ బ్యాక్ కథ, ఈ రెండిటికీ కవరింగ్ లెటర్ లాగా ప్రస్తుత కథా -కఫ్యూజింగ్ క్రియేటివిటీతో  ఏమేమో చేశారు. వీటి గురించి రేపు స్క్రీన్ ప్లే సంగతులు లో చూద్దాం.


సికిందర్