రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

15, అక్టోబర్ 2016, శనివారం

రివ్యూ!


రచనదర్శకత్వం: కోడి రామకృష్ణ 
దిగంత్, రమ్య, విష్ణువర్ధన్, రాజేష్‌వివేక్, సాయి కుమార్, ముకుల్‌దేవ్‌, రవి కాలే దర్శన్, సాధు కోకిల, తదితరులు. 
సంగీతం: గురుకిరణ్‌,
 ఛాయాగ్రహణం: హెచ్‌.సి.వేణు 
బ్యానర్స్: ఇన్‌బాక్స్ పిక్చ‌ర్స్ ప్రై.లి
, బ్లాక్ బ‌స్ట‌ర్ స్టూడియోస్‌, పెన్ మూవీస్‌
నిర్మాతలు: సాజిద్‌ఖురేషి
, సోహైల్‌అన్సారీ, ధవల్‌గడ 
విడుదల:
14 అక్టోబర్, 2016
***
      అసలు టైటిల్లోనే వ్యాకరణ దోషం, ఆ పైన రాసి తీసిందంతా కషాయం. కోడి రామకృష్ణ రేపెప్పుడైనా ‘శంకరాభరణం’ పేరుతో సినిమాతీస్తే దాని టైటిల్ ‘శంకరభరణం’ అవుతుందేమో. లేక తెలుగుని మర్చిపోతున్న- లేదా తెలుగునే ఖాతరు చెయ్యని ఇవ్వాళ్టి  లోకం కోసం సులభగ్రాహ్యంగా వుండేందుకు ‘సంస్కరించి’  ఇలా టైటిల్స్ పెడుతున్నారేమో. ‘నాగాభరణం’  కాస్తా ‘నాగభరణం’ అయ్యింది. సినిమాలో టైటిల్ సాంగ్ ని మాత్రం సింగర్  ‘నాగాభరణం...’ అనే ఇంతెత్తున రాగం తీసి పాడతాడు. భక్తీ-శక్తి ఫాంటసీ తీస్తున్నప్పుడు పెట్టిన మకుటం పట్లే భక్తిభావం లేకపోతే ఆ పైన చేసిన కృషిని ఎలా నమ్మాలి. ఇదొక  కలశం కోసం పోరాటమన్నారు కాబట్టి- కలశం అంటే భరిణె కూడా అవుతుందనుకుని, ఆ భరిణెని కాస్తా భరణం చేసి నాగ యొక్క భరణం = నాగభరణం అని పెట్టారేమోనని కూడా సినిమాని చూసి జస్టిఫై చేసుకోవడానికి వెంటనే బయల్దేరి వెళ్తాం. కానీ భరణం అంటే మనోవర్తి అని అర్ధం కదా, ఒకవేళ నాగదేవత మగాడైన హీరోకే భరణం రివర్స్ లో ఇస్తోందా అన్న ఇంకో పురుగు మనల్ని దొలుస్తుంది. ఇలా నాగ +ఆభరణం = నాగాభరణం కొచ్చిన తిప్పలు ఇన్నీ అన్నీ కావు!

        భాష స్లిప్ అవుతున్నట్టే ఇప్పుడు కథా కథనాల్లోనూ, దర్శకత్వం లోనూ స్లిప్ అవుతున్నారు 130 సినిమాలు తీసిన కోడి రామకృష్ణ. దీన్నర్ధం జేసుకోగలం. ఒకే కళ్ళద్దాలు  కెరీర్ అంతా ధరిస్తే ఈ సమస్య తప్పదు. తరంతరం సినిమాలు చూసే కళ్ళు మారిపోతూంటాయి ప్రేక్షకుల్లో. ఎనభై దాటింత్తర్వాత కూడా కౌబాయ్ నటుడు క్లింట్ ఈస్ట్ వుడ్ ఇప్పుడు కొత్త కళ్ళద్దాలతో  ‘సల్లీ’ తీసి పేరు తెచ్చుకున్నాడు. అదే  ‘గాడ్ ఫాదర్’ కపోలా ఐదేళ్ళ క్రితం ‘ట్విక్స్ట్’ తీసి విఫలమయ్యాడు. కళ్లద్దాలతోనే జాతకాలన్నీ. 

        ‘అరుంధతి’ కళ్ళద్దాలు ఇప్పుడు లేవు రామకృష్ణకి. ‘అరుంధతి’ కి లాంటి మేకింగ్ లో పాటుపడే నిర్మాత (శ్యామ్ ప్రసాద్ రెడ్డి) తోడ్పాటు కూడా లేదు. దీంతో ఈ ఫాంటసీకి ఆథ్యాత్మిక విలువ వున్నా, ఆ ఆథ్యాత్మిక ఔన్నత్యాన్ని  సాధించే గొప్ప అవకాశాన్ని జారవిడుచుకున్నారు. కేవలం గ్రాఫిక్స్ హంగామాగా మార్చేశారు - మైనస్ కథా కథనాలతో. 

        కథ ఎత్తుగడ బ్రహ్మాండమే - ‘బద్రినాథ్’ ఎత్తుగడలాగే. ఆ తర్వాత ఎత్తుగడతో సంబంధంలేని రొటీన్ ఫార్ములా లవ్- మసాలా నడకే ‘బద్రీనాథ్’ లాగే. తెలిసి తెలిసి ‘బద్రినాథ్’ టెంప్లెట్ లో ఎలా పడిపోయారో రామకృష్ణ. 

      గ్రహణం సమయంలో దేవతలు తమశక్తి యుక్తుల్ని కోల్పోతూంటారని సినిమా మొదలెట్టారు. దేవతలు నిర్వీర్యమవగానే  దుష్ట శక్తులు రెచ్చిపోయి లోకాన్ని అతలాకుతలం చేస్తూంటాయని చూపిస్తారు. గ్రహణ సమయంలో ఈ దుష్ట శక్తులనుంచి లోకాన్ని కాపాడాలని దేవతలు ఎంతో శ్రమించి ఒక మహాకలశాన్ని తయారు చేస్తారు. దీన్ని భూగోళం మీద ఒక చోట ప్రతిష్టించి శివయ్య (సాయికుమార్) కుటుంబీకుల్ని రక్షకులుగా నియమిస్తారు. ఈ కలశాన్ని ప్రతిష్టించిన చోట దుష్ట శక్తులు చొరబడకుండా  అష్ట దిగ్బంధం చేస్తారు. ఈ కలశానికి ‘నాగభరణం’ అని పేరుపెడతారు.  

        ఇక దుష్ట శక్తులు దీన్ని చేజిక్కించుకుని దేవతల్ని ఆడించాలని చెయ్యని ప్రయత్నం వుండదు యుగయుగాలుగా. చచ్చి పుడుతూ చచ్చి పుడుతూ వున్న మహా దుష్టశక్తి కపాలి ( రాజేష్ వివేక్) కలశం కోసం  చెయ్యని ప్రయత్నం వుండదు.  ఒక దాడిలో ఆ కలశాన్ని కాపాడుకొస్తున్న శివయ్య చనిపోతాడు. అతడి కూతురు నాగమ్మ (రమ్య)  ఆ కలశం బాధ్యత తీసుకుంటుంది. నాగదేవత ఆమెకి కన్పిస్తూ పూర్తి మద్దతు ప్రకటిస్తూంటుంది. మళ్ళీ కపాలి దాడిలో నాగమ్మ కూడా చనిపోతుంది. చనిపోతూ కపాలిని కూడా చంపి- ఇంకో జన్మెత్తి ఆ కలశాన్ని కాపాడుకుంటానని ప్రతిజ్ఞ చేస్తుంది. ఇదీ ఎత్తుగడ. 

       
ఇప్పుడు ఫ్రెష్ గా నాగమ్మ మానసగా పుట్టడంతో ప్రస్తుత కాలపు కథ ప్రారంభమవుతుంది. కపాలిగాడు ఇప్పుడూ పుట్టి ఆ కలశం కోసం కేకలు పెడుతూంటాడు. ఇప్పుడా కలశం దూరంగా ఆర్కియాలజీ శాఖ వాళ్ళ ఆధీనంలో ఢిల్లీలో వుంటుంది. ఈ శాఖ వాళ్ళు సంగీత పోటీలు పెడతారు. ఈ వరల్డ్ మ్యూజిక్ షోలో ఎవరు గెలిస్తే వాళ్ళకి ఆ కలశాన్ని ఇచ్చి పారేస్తామని ప్రకటిస్తారు- గెలిచిన వాళ్ళు దాన్ని తీసుకుని ఏం చేసుకుంటారో అర్ధంగాదు. దానికిప్పుడు దివ్యశక్తులు లేవా? ఇందుకేనా దుష్ట శక్తులుగా ఇప్పుడు టెర్రరిస్టులు తెగిస్తున్నారు. అయినా ఒక పురాతత్వ విలువ కలిగిన వస్తువుని పాత తుక్కు కింద వదిలించుకుంటారా పురాతత్వ శాఖ వాళ్ళు? అలా వదిలించుకుంటున్న ఆ  కలశంలో ఇంకేముందని కపాలిగాడు మళ్ళీ పుట్టి కేకలేస్తున్నాడో కూడా అర్ధంగాదు. 

        ఈ మ్యూజిక్ షోకి నాగచరణ్ (దిగంత్) పోటీ పడతాడు. ఈ నాగ చరణ్ ఆ కలశాన్ని గెలిస్తే దాన్ని కొట్టేయాలని ఒక విలన్ (ముకుల్ దేవ్) అతడి గ్యాంగూ బయల్దేరతారు. ఇదీ విషయం. ఇక పైనేం జరుగుతుందో వెండితెర మీద చూడాల్సిందే.
***

      వెండి తెర మీద - ప్రధానంగా కన్నడ సోదరులకు -  వాళ్ళ దివంగత  అభిమాన హీరో  విష్ణు వర్ధన్ ని గ్రాఫిక్స్ తో  ప్రాణప్రతిష్ఠ చేసి చూపిస్తే,  బ్రహ్మాండంగా ఈ ఫాంటసీ వర్కౌట్ అవుతుందన్న ఒకే ఒక్క లక్ష్యం పెట్టుకుని ఈ సినిమా తీసినట్టు అన్పిస్తుంది.  క్లయిమాక్స్ లో ఇలా విష్ణు వర్ధన్ తో సృష్టించిన పోరాట దృశ్యాలు అద్భుతమే కాదనలేం. ‘మకుట’ విజువల్ ఎఫెక్ట్స్ సంస్థకి- మగధీర, ఈగ, బాహుబలి లాంటి ఎన్నో అద్భుతాల దిగ్గజానికి- ఈ క్రెడిట్ అంతా పోతుంది. అయితే కోడి రామకృష్ణ ఆధ్వర్యం లో ఈ గ్రాఫిక్స్ హంగామా అంతా కూడా ‘అరుంధతి’ లో లాగా కథలో కలిసిపోతేనే అందం. ఎత్తుగడ తర్వాత కథే లేనప్పుడు,  కోడి రామకృష్ణే స్వయంగా మొన్న అన్నట్టు-  గ్రాఫిక్స్‌ సినిమాని ఎలివేట్‌ చేయాలి, కానీ సినిమాలో గ్రాఫిక్స్‌ పెట్టకూడదనే దాన్ని అర్ధం జేసుకోలేం. ఆయన చెప్పిందాంట్లో రెండోదే నిజం చేశారు. 

        ఈ సినిమాని అందరూ కన్నడ నటులతో- ఒకరిద్దరు హిందీ వాళ్ళతో తీసి తెలుగులో డబ్ చేశారు. దర్శకుడు తెలుగువాడే. తెలుగు నటుల్ని కూడా కొందర్ని పెట్టుకుని  జాగ్వార్ లా కన్నడ- తెలుగు సినిమాలాగా తీయలేక పోయారు. 

        ఆ
ధ్యాత్మిక విలువ వుండే కథల్ని ఎందుకని ఆ పాయింటుని ఓపెనింగ్ బ్యాంగ్ గా గొప్పగా ఇచ్చి వదిలేస్తారో తెలీదు. అయిడియాని దాని పరిధి మేర విస్తరించలేనప్పుడు అంతంత విస్తారమైన బడ్జెట్లెందుకు? ఒకప్పటి చరిత్రని పునరావృతం చేస్తూ టెర్రరిస్టులు దేవాలయాల్ని ధ్వంసం చేస్తున్నారని మొదలెట్టిన ‘బద్రీనాథ్’  వ్యవహారం, ఆ కథ వదిలేసి  ఓ దేవాలయానికి రక్షకుడుగా వున్న హీరో మసాలా రొటీన్ ప్రేమ కథగా మార్చేశారు.దీనికి  ఫ్యాక్షన్ టైపు హీరోయిన్ తండ్రి విలన్! ఇది సక్సెస్ అయ్యిందా? 

       
కోడిరామకృష్ణ కథ ఎత్తుగడ అచ్చం  ‘అఖిల్’ కథకి  ఎత్తుగడలాలాగే లేదా? అక్కినేని అఖిల్ ని పరిచయం చేస్తూ గత నవంబర్ లో విడుదల చేసిన ‘అఖిల్’ లో- పూర్వకాలంలో ఎప్పుడో కొందరు ఋషులు భూగోళం బాగోగుల కోసం,  ‘జువాఅనే ఒక గోళాన్ని తయారు చేసి తీసికెళ్ళి భూమధ్య రేఖ దగ్గర ఓ ఆఫ్రికన్ గూడెం లో పడేస్తారు. సూర్యగ్రహణాలు  పూర్తయ్యాక వెలువడే తొలి సూర్య కిరణాలు చాలా ప్రమాదకరమని వాళ్ళు నమ్ముతారు. కనుక ఆ తొలి సూర్య కిరణాలు ఈ జువాగోళం మీద పడితే వాటి దుష్ప్రభావం నుంచి భూగోళం తప్పించుకుంటుందని శాస్త్రం చెప్తారు (ఓజోన్ పొర ఏం చేస్తున్నట్టో మరి). అలా ఆ గోళాన్ని గూడెం వాసులు తరతరాలుగా కాపాడుకొస్తూంటారు. దీని గురించి తెలుసుకున్న ఒక రష్యన్ సైంటిస్టు దాన్నికాజేసి ప్రపంచాన్ని ఆడించాలని కుట్ర పన్నుతాడు. ఆ గోళం అతడి గ్యాంగ్ చేతిలో పడకుండా, బోడో అనే గూడెం వాసి ఒకడు తీసుకుని పారిపోతాడు. వాణ్ణి వెతికి పట్టుకునే పనిలో వుంటుంది ఆఫ్రికన్ గ్యాంగ్. ఇదీ ఎత్తుగడ. దీని తర్వాత నడిపించింది అంతా హీరో గారి ‘బద్రీనాథ్’  మార్కు మూస ప్రేమకథే గా? ఇదీ సక్సెస్ అయిందా? 

       రామకృష్ణ జువా గోళం అనకుండా ‘నాగభరణం’ అనే కలశాన్ని తయారు చేశారు. అసలు సర్వ సృష్టీ దేవతల నియంత్రణలో వుండాల్సింది వాళ్ళే గ్రహణాలకి గిలగిల లాడి పోవడమేంటో? సరే, ఈ కలశం మీదికి దుష్ట శక్తిని తోలి,  హీరోగారి మ్యూజికల్  కథ నడిపారు రామకృష్ణ.  కానీ కలశం మీదికి తోలిన బాపతు దుష్ట శక్తులు ఇప్పుడున్నాయా? కాలాన్ని బట్టి ప్రతీకలు మారుతూంటాయి. పురాణాల్లో వుండే రూపాలతో రాక్షసులు ఇప్పుడు మన మధ్య తిరుగడం లేదు. ఇప్పటి ప్రపంచ రాక్షసుడు టెర్రరిస్టు. ప్రతీకలు ఎప్పుడూ వర్తమాన కాలపు గుర్తులుగా వుంటాయి- వెంటనే ఆడియెన్స్ కనెక్ట్ అవడానికి- ఫీలవడానికీ. స్టీవెన్ స్పీల్ బెర్గ్  ‘రైడర్స్ ఆఫ్ ది  లాస్ట్ ఆర్క్’  తీసినప్పుడు- ప్రతీకలుగా అడాల్ఫ్ హిట్లర్ నీ, అతడి జర్మన్ నాజీ సైనికుల్నీ చూపించాడు. వాళ్ళు దేనికి ప్రతీకలో మనకి తెలుసు. వాళ్ళకో బుద్ధి  పుడుతుంది.  బైబిల్ కాలంలో నిర్గమ కాండం సందర్భంగా దేవుడు మోజెస్ కి బహూకరించిన నిబంధనల పెట్టె (Arc of Covenant) ని చేజిక్కించుకుంటే తమకి అజేయ శక్తి అమరుతుందని నమ్మి దాని కోసం వేట ప్రారంభిస్తారు. ఆర్కియాలజిస్టు అయిన హీరో దీన్ని అడ్డుకోవడానికి సాహస యాత్ర ప్రారంభిస్తాడు. చివరికి ఆ పెట్టెని  చేజిక్కించుకున్న నాజీ సైనికులు,  దాన్ని తెర్చి భస్మీపటలమై పోతారు.  దైవశక్తి ఎప్పుడూ దైవ శక్తే. ఆద్యంతం ఈ పెట్టె కోసమే కథ జరిగి దాని  మహత్తుతో ముగుస్తుంది. ఆథ్యాత్మిక విలువున్న ఈ థ్రిల్లర్  అంతే ఆథ్యాత్మిక  ఔన్నత్యంతో ముగుస్తుంది. అంటే ప్రేక్షకుల ఆత్మిక దాహాన్ని  తీరుస్తుంది- అందుకే అంత ఘనవిజయం సాధించింది. 

     రామకృష్ణ  ఏం చేశారు. అంతటి దేవతల మహత్తు కలిగిన కలశాన్ని ఎందుకూ పనికి రాని వస్తువుగా మ్యూజికల్ షోకి  బహుమతిగా దిగజార్చేశారు! దైవ శక్తి ఎక్కడైనా తరిగిపోతుందా? ఆ కలశం కోసం అందరూ కొట్టుకుంటున్నారని ఆర్కియాలజీ శాఖ స్వాధీ నం చేసుకుంటుందా? ఆర్కియాలజీ శాఖ అష్ట దిగ్బంధాన్ని కూడా ఛేదించేసిందా? కేరళలో పద్మనాభ స్వామి ఆలయంలో ఆరో నేలమాళిగకి  నాగబంధం వుందని తెలిసి దాన్ని తెరవడానికే సాహసించలేదు. అదీ దైవ శక్తి తడాఖా అంటే. 

        కలశాన్ని మ్యూజికల్ షోకి పెట్టేశారంటేనే దానికే శక్తీ లేదని అర్ధమైపోతోంది. మరెందుకు కపాలిగాడూ విలన్ గ్యాంగూ దానికోసం అర్రులు చాస్తున్నారు. ఇక గత జన్మలో నాగమ్మకి అండగా వుంటానన్న నాగదేవత ఆమె కపాలిగాడితో తలపడుతున్నప్పుడు ఎక్కడికి పోయింది. చచ్చిపోయేటప్పుడు వచ్చి వచ్చే జన్మలో హెల్ప్ చేస్తానని అంటుందా. నాగమ్మ మళ్ళీ జన్మించాక ఆమెలోంచి బుసలుకోడుతూ లేచి శత్రువుల్ని కాటేస్తుందా. ఈ పని గత జన్మలోనే చేయవచ్చుగా. 

        ఆ నాడు దేవతలు ప్రసాదించిన మహత్తు కలిగిన ఆ నాగాభారణ కలశం ఇప్పటికీ అదే దివ్యశక్తితో వుందనీ, దీన్ని నాశనం చేయడానికో, హస్తగతం చేసుకోవడానికో టెర్రరిస్టులు బయల్దేరరానీ- కాలీన స్పృహతో ఈ ఫాంటసీ చేసి వుంటే అర్ధంపర్ధం వుండేది.


-సికిందర్ 







         

13, అక్టోబర్ 2016, గురువారం

రివ్యూ!

దర్శకత్వం : అనిరుద్ధ రాయ్ చౌధురి

తారాగణం : అమితాబ్ బచ్చన్, తాప్సీ, కీర్తీ కుల్హరీ, ఆండ్రియా తరియంగ్,  అనంగ్ బేడీ, ధృతిమన్ ఛటర్జీ, పీయూష్ మిశ్రా, మమతా శంకర్ తదితరులు
కథ : అనిరుద్ధ  రాయ్ చౌధురి, షూజిత్ సర్కార్, రీతేష్ షా , స్క్రీన్ ప్లే- మాటలు : రీతేష్ షా
సంగీతం : శంతను మొయిత్రా, ఫైజా ముజాహిద్, అనుపమ్  రాయ్, ఛాయాగ్రహణం : అభీక్ ముఖోపాధ్యాయ్
బ్యానర్ : రశ్మీ టెలి ఫిలిమ్స్ లిమిటెడ్
నిర్మాతలు : రశ్మీ శర్మ, షూజిత్ సర్కార్
విడుదల : సెప్టెంబర్ 16, 20016
***
       బెంగాలీ దర్శకులు కమర్షియల్ సినిమాల్నే వాస్తవికతకి దగ్గరగా భిన్నకోణాల్లో తెరకెక్కిస్తూ  హిందీలోకి వస్తారు. మర్డర్, గ్యాంగ్ స్టర్, బర్ఫీ, కహానీ, విక్కీ డోనర్...ఇంకా  గతంలో కెళ్తే  దోస్తీ, చిత్ చోర్, గోల్ మాల్, కటీ పతంగ్  వంటి హిట్స్ తో  ప్రత్యేక ముద్ర వేస్తారు. బాలీవుడ్ ఎప్పుడూ బెంగాలీ దర్శకులతో కిటకిట లాడుతూ వుంటుంది. బాలీవుడ్ అనేకంటే ‘బెలీవుడ్’  అనుకునేంతగా పాగా వేసి కూర్చున్నారు. బెంగాలీలు సాహితీ ప్రియులవడం చేత కూడా స్వాభావికంగానే వాళ్ళ కళాపోషణ ఉత్తమాభిరుచులకి పట్టం గడుతూంటుంది. లపాకీ సినిమాలూ ఇడ్లీ సినిమాలూ తీసే మోజు వాళ్లకి లేదు. వాళ్ళ  బెంగాలీ ఫిష్ కర్రీనే ఎన్నిరకాలుగా వండొచ్చో ఒక్కొక్కళ్ళూ ఒక్కో విధంగా రుచి చూపించేసి  ఔరా అన్పిస్తారు. తాజాగా మరో బెంగాలీ దర్శకుడు హిందీలోకి రంగ ప్రవేశం చేశాడు. చేస్తూనే నాటక అంకాన్ని సినిమాకి జోడించి క్యాబేజీ ఫిష్ వండేశాడు. ఇక దేశవ్యాప్తంగా మిగతా హిందీ సినిమాల్ని పక్కన పెట్టేసి దీన్నే నంజుకుంటున్నారు జనాలు. 

          ర్శకుడు అనిరుద్ధ రాయ్ చౌధురిని హిందీలోకి రప్పిస్తూ మరో బెంగాలీ దర్శకుడు షూజిత్ సర్కార్ (విక్కీ డోనర్, పీకూ) నిర్మాతగా మారి,  ‘పింక్’ తీసినప్పుడు అదొక జాతీయ నినాదమయిందివ్వాళ. అమితాబ్ బచ్చన్, తాప్సీ, మరో ఇద్దరు నటీమణుల్ని కలుపుకుని యువతరపు కొత్త పోకడల్ని – చట్టాలతో వాళ్ళ అనుభవాల్ని బయటపెట్టే పవర్ఫుల్ వినోదసాధనమయ్యింది. మనమెప్పుడూ ఇప్పటి యూత్ సినిమాలంటే ఒకప్పటి ఉబుసుపోక ప్రేమ కథలు కాదనీ, వాళ్ళ వాళ్ళ విశృంఖలత్వాలతో యూత్ చేసుకునే ప్రయోగాల్నీ, దాంతో తెచ్చుకునే ప్రమాదాల్నీ తెలియజెప్పే ఫ్రెష్- న్యూజనరేషన్ రియాలిస్టిక్ ఫిక్షన్ అనీ చెప్పుకుంటూ వచ్చాం. ఈ కోవలో 2011 లో బిజోయ్ నంబియార్ ‘షైతాన్’ తీసి మెప్పించాడు. 2005 లో కృష్ణవంశీ ‘డేంజర్’ తో పాక్షికంగానే ప్రయత్నించాడు. గత సంవత్సరమే నవదీప్ సింగ్ ‘ఎన్ హెచ్- 10’ తో  దృష్టి నాకర్షించాడు. ఇప్పుడు ‘పింక్’ తో అనిరుద్ధ రాయ్ చౌధురి అలాటి జీవనశైలులు ఏ దారిపట్టిపోతాయో చెబుతూనే, అంతమాత్రాన న్యాయం పొందడానికి సిగ్గుపడాల్సిన అవసరమే లేదని యువతులకి ధైర్యం నూరిపోశాడు నూరుపాళ్ళూ. 

కథ *
       మీనల్ అరోరా (తాప్సీ) ఫలక్ అలీ (కీర్తీ కుల్హరీ)  ఆండ్రియా (ఆండ్రియా తరియంగ్) అనే ముగ్గురు ఢిల్లీలోని ఒక ఫ్లాట్ లో నివసిస్తూ జాబ్స్ చేస్తూంటారు. ఒకరాత్రి  సూరజ్ కుంద్ లోని  ఓ రిసార్ట్స్ లో జరుగుతున్న  ప్రోగ్రాంకి వెళ్తారు. అక్కడ రాజ్ వీర్ (అనంగ్ బేడీ) తన ఫ్రెండ్స్ తో వుంటాడు.  రాజ్ వీర్ మీనల్ కి తెలుసు. అక్కడ వాళ్ళతో కలిసి డ్రింక్ చేస్తారు ముగ్గురూ. ఈ అవకాశంతో వాళ్ళని అనుభవించాలని చూస్తారు రాజ్ వీర్ అతడి ఫ్రెండ్స్ ముగ్గురూ. మీనల్ ‘నో’  అన్నా రాజ్ వీర్ వూరుకోక మిస్ బిహేవ్ చేస్తాడు. దీంతో బాటిలెత్తి అతడి తలకాయ బద్దలు కొడుతుంది. తీవ్రంగా గాయపడ్డ అతణ్ణి వదలేసి పారిపోతారు మీనల్, ఫలక్, ఆండ్రియా. 

        ఇక  పరిణామాలు వూహించుకుని బిక్కు బిక్కుమంటూంటారు ముగ్గురూ. బాగా పవర్ఫుల్ రాజకీయనాయకుడి కొడుకైన రాజ్ వీర్, మీనల్ మీద పగ దీర్చుకోవాలనుకుంటాడు. ఆమెతో సహా ఫలక్ నీ, ఆండ్రియానీ ఫ్లాట్లోంచి సాగనంపేయాలని ఓనర్ ని బెదిరిస్తాడు. ఫలక్ మధ్యవర్తిత్వం వహించి  మీనల్ చేత రాజ్ వీర్ కి సారీ చెప్పించాలని ప్రయత్నిస్తుంది. సారీ చెప్పేందుకు మీనల్ ఒప్పుకోదు. ఎదుటి బంగళాలో రిటైర్డ్ లాయర్ దీపక్ సెహగల్ (అమితాబ్ బచ్చన్) వుంటాడు. ఇతను ఈ అమ్మాయిలేదో సమస్యలో పడ్డారని అనుమానిస్తాడు. అతడి కళ్ళముందే రాజ్ వీర్ మీనల్ ని కిడ్నాప్ చేసి తీసికెళ్ళి పోతాడు. వెంటనే దీపక్ పోలీసులకి సమాచారం అందించినా ఆ కారు దొరకదు. ప్రయాణిస్తున్న కార్లో ఫ్రెండ్స్ తో కలిసి రాజ్ వీర్ మీనల్ ని లైంగికంగా వేధించి వదిలేస్తాడు. ఇక మీనల్ కి పోలీసులని ఆశ్రయించక తప్పదు. ఈ లేడీ ఎస్సై  రాజ్ వీర్ తండ్రికి సమాచారం అందివ్వడంతో రాజ్ వీర్ తండ్రి మీనల్ మీద ఎదురు కేసు పెట్టిస్తాడు- రాజ్ వీర్ మీద మీనల్ హత్యాయత్నం చేసిందన్న ఆరోపణతో. మీనల్ అరెస్టయి జైలు కెళ్తుంది.  ఇక వుండలేక లాయర్ దీపక్ ఉచిత న్యాయ సహాయం అందిస్తూ ఈ కేసు చేపట్టడానికి ముందుకొస్తాడు. ఇక్కడ్నించీ కోర్టులో ఈ కేసు ఎలాగెలా నడిచిందీ, అమ్మాయిలు బోనెక్కితే ఎలాటి చేదు అనుభవాలు ఎదురవుతాయి- అన్నది మిగతా కథ.

భావోద్వేగాల ఉప్పెన 
      టాలెంటెడ్  నటిగా తాప్సీ ఈ సినిమాతో  బాగా ఎస్టాబ్లిష్ అయినట్టే. ఇప్పట్నించే ఆమెకి అవార్డుల పంటని వూహించుకోవచ్చు. బాధిత పాత్రని బలమైన భావోద్వేగాలతో, కటువైన మాటలతో సహజాతిసహజంగా పోషించింది. కోర్టు దృశ్యాల్లో ఇబ్బంది కల్గించే సందర్భాల్లో ప్రతిస్పందనల్ని పొల్లు పోకుండా ప్రకటించడంలో కనబర్చిన  నేర్పే నటిగా ఆమెని సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తోంది. ఈ సినిమా ఆమె కెరీర్ కి ఓ కిరీటం.
        మరోసారి అమితాబ్ బచ్చన్ తన విలువేంటో రుజువు చేసుకున్నాడు. బైపోలార్ డిజార్డర్ తో మానసికంగా, వాతావరణ కాలుష్యంతో శారీరకంగా  సతమతమయ్యే వృద్ధ లాయర్ పాత్రలో ఇప్పటికీ తన అభినయ చాతుర్యానికి బాక్సాఫీసు అప్పీల్ వుంటుందని విరగబడి ఆడుతున్న ఈ సినిమా సక్సెస్ తోనే నిరూపించాడు. 

        కీర్తీ, ఆండ్రియా ఇద్దరూ కూడా డీసెంట్ గా నటించారు. రాజ్ వీర్ పాత్రలో కళ్ళల్లో దుష్టత్వం నింపుకుని సైలెంట్ విలన్ గా అనంగ్ బేడీ నటిస్తే, ప్రాసిక్యూటర్ గా మరోసారి పీ యూష్ మిశ్రా తన బ్రాండ్ డైలాగ్ డెలివరీ తో సన్నివేశాల్ని రక్తి కట్టించాడు. ఉర్దూ పిచ్చిగల పోలీసు అధికారిగా ‘హేపీ భాగ్ జాయేగీ’ లో చేసిన  డైలాగుల మాయాజాలం ఎలాంటిదో మొన్నే చూశాం. జడ్జి పాత్రలో ధృతిమన్ ఛటర్జీ కమర్షియల్  సినిమాల ‘ఆర్డర్ ఆర్డర్’ బాపతు అరుపుల, బల్ల మీద సుత్తిమోతల ఫార్ములా జడ్జీలనుంచి ఎంతో  రిలీఫ్. 

         ‘హేపీ భాగ్ జాయేగీ’ సెకండాఫ్ లో హీరో,  అతడి తండ్రీ జరిపే సుదీర్ఘ సంభాషణ గల దృశ్యం టీవీ సీరియల్ లాగా కన్పిస్తుంది. సహజత్వం ఒక్కోసారి ఇలాటి బారిన పడుతూంటుంది. కానీ  ‘పింక్’ సహజత్వం సినిమాకే హైలైట్ గా వుంటుంది. కోర్టు ఇంటీరియర్ కూడా సెట్ వేసి నట్టుండదు. పాటలు, వాటి చిత్రీకరణా కళాత్మకంగా వున్నాయి. కెమెరా వర్క్, సంగీతం న్యూయేజ్ మూవీస్  ట్రెండ్ లో  వున్నాయి.

మైండ్ సెట్స్- మైండ్ గేమ్స్ 
       థగా చూస్తే ఈ కేసు అత్యంత సాధారణ నేర సంఘటన. ఒకమ్మాయి ఒకబ్బాయి తల బద్దలు కొట్టింది. కోర్టుకి కావాల్సింది దీనికి  సాక్ష్యాలేగానీ, నిందితురాలి  క్యారక్టర్ కాదు, సెంటి మెంట్లు కాదు. నిందితురాలు ఎప్పుడు కన్యాత్వం పోగొట్టుకుంది, ఎంతమంది బాయ్ ఫ్రెండ్స్ తో తిరిగిందీ కోర్టుకి అక్కర్లేదు. బాధితుణ్ణి  కొట్టిందా లేదా అన్నదే పాయింటు. ఆత్మరక్షణ చేసుకుంటూ కొట్టి వుంటే అది నిరూపించాలి, అంతే. 

        ఇదే గనుక కథగా నడిపివుంటే- ఈ పరిధిలోనే కాన్సెప్ట్ పెట్టుకుంటే-  ఈ సినిమా ఇంత సంచలనాత్మకం అయ్యేది కాదు- ‘రుస్తుం’ లాగా ఓ రొటీన్ కోర్టు రూమ్ క్రైం డ్రామా అయ్యేది. దీన్నొక సామాజిక రుగ్మతల కడిగివేతగా సంకల్పించారు కాబట్టే-  అసలీ సంఘటనలు ఎందుకు జరుగుతున్నాయో వాటి  మూలాల్ని  ఎత్తి చూపించి హె చ్చరించాలనుకున్నారు. అప్పుడే కథా ప్రయోజనం నెరవేరుతుంది. కనుక  ప్రొసీజర్ ప్రకారం సాక్ష్యాల్ని పరిశీలిస్తూనే, మనస్తత్వాల మదింపూ చేశారు. ఈ మనస్తత్వాల మదింపు ల్లోంచి ఇలాటి సంఘటనల మూలాల్ని బయట పెట్టారు. అబ్బాయిల్ని ఎండగట్టారు. అలాగని ఈ సినిమా చూసి అబ్బాయిలు మారిపోతారని కాదు- ఇంకా డోనాల్డ్ ట్రంప్ ని ఆదర్శంగా తీసుకుంటామనొచ్చు. తమకి డోనాల్డ్ ట్రంపే వుండగా ఈ డొక్కు సినిమాలేం  చేస్తాయని కూడా అనుకోవచ్చు. డోనాల్డ్ ట్రంప్ కి ఈ సినిమా చూపిస్తే తన పరువు తీయడానికే  ఈ సినిమా తీశారని చిందులు కూడా వేయవచ్చు. 


         కానీ ఒక లాజిక్ కూడా వుంది. లాజిక్ లేకుండా మనస్తత్వాల ముచ్చట్లు పెట్టుకుంటే అదొక కళా రూపం కాదు, సినిమా అన్పించుకోదు. కథని వదిలేసి నీతి బోధలు చేయడం అవుతుంది. ఇలా చేయడానికి కోట్లు ఖర్చు పెట్టి సినిమాలు తీయనవసరం లేదు. సోదంతా నింపి ఆడియో సీడీలు విడుదల చేస్తే సరిపోతుంది. లాజిక్ ఏమిటంటే, స్థూల దృష్టికి నిందితురాలు నేరం చేసిందనే  రుజువవుతోంది సాక్ష్యాధారాల ఆధారంగా. ఆమె జైలుకెళ్ళే పనే. కథ ఇలా ముగిసిపోతే డోనాల్డ్ ట్రంప్ కూడా ఒప్పుకోడు. కానీ ఆ నేరం ఏ పరిస్థితుల్లో చేసిందో నిరూపిస్తే లాయర్ దీపక్ ఆమెని రక్షించుకోగలడు. ఆత్మరక్షణ అనే ఒకే  ఒక్క ఆధారం దీనికి వుంది. ఆత్మరక్షణకే  బాధితుణ్ణి  కొట్టినట్టు నిరూపిస్తే ఆమె బయట పడిపోతుంది. ఆడదానికి ఆత్మరక్షణ అంటే  శీల రక్షణే. కాబట్టే పనిగట్టుకుని మీనల్ శీలం మీదికి పోతాడు లాయర్ దీపక్.

        అయితే దీనికంటే ముందు బాధితుడూ అతడి ఫ్రెండ్స్ మోటివ్స్ ని తేటతెల్లం చేస్తాడు.  మైండ్ సెట్స్ ని మైండ్ గేమ్స్ తోనే గెలవాలేమో.  అబ్బాయిల మైండ్ సెట్స్ కోర్టు వెలుపల నేర సంఘటనని సృష్టిస్తే, కోర్టు లోపల లాయర్ దీపక్ ఆడే మైండ్ గేమ్స్ వాళ్ళ మైండ్ సెట్స్ లోని డొల్ల తనాన్ని బట్టబయలు చేస్తాయి. కోర్టులో అబ్బాయిల సాక్ష్యాల్లో వెల్లడయ్యే అమ్మాయిల పట్ల వాళ్ళ  మైండ్ సెట్స్ ని,  అమ్మాయిలకి ఒక్కో నీతి సూత్రంగా మార్చి వ్యంగ బాణాలు  విసురుతూంటాడు లాయర్ దీపక్ : 

       అమ్మాయిలు డ్రింక్ చేస్తే- వాళ్ళ క్యారక్టర్ మంచిది కాదని అర్ధమన్న మాట. అదే అబ్బాయిలు డ్రింక్ చేస్తే కేవలం ఆరోగ్యానికి హానికరమన్న మాట!
        అమ్మాయి రాక్  షో  కెళ్తే అది హింట్ ఇస్తున్నట్టు అర్ధమన్న మాట. అదే గుడి కెళ్తే, లైబ్రరీ కెళ్తే, అమ్మాయి అలాంటిది కాదన్న మాట. అమ్మాయిల క్యారక్టర్ ని వాళ్ళు  వెళ్ళిన  స్థలం నిర్ణయిస్తుందన్న మాట!

        ఏ అమ్మాయి అయినా ఏ అబ్బాయితోనూ ఎక్కడికీ వొంటరిగా వెళ్ళ రాదు. వెళ్లిందంటే ఇష్టపడే వెళ్ళిందనీ, తనని టచ్ చేసే పూర్తి  లైసెన్సు అబ్బాయికి ఇచ్చేసిందనీ అర్ధం జేసుకుంటారన్న మాట!

        రాత్రి పూట అమ్మాయిలు రోడ్డు మీద పోతూంటే వాహనాలు స్లో అవుతాయి,  అద్దాలు కిందికి దిగిపోతాయి. పగటి పూట ఇంత  గొప్ప సేవా భావం ఎందుకుండదో
 ఎవరికీ!

        నగరాల్లో అమ్మాయిలు ఒంటరిగా ఉండరాదు- అబ్బాయిలు వుండ వచ్చు, కానీ  అమ్మాయిలు ఉండరాదు. ఎందుకంటే ఒంటరిగా, ఇండిపెండెంట్ గా వుండే అమ్మాయిలు అబ్బాయిల్నితెగ కన్ఫ్యూజ్ చేసేస్తారు మరి! 

        చివరికో పీకుడు పీకుతాడు :
        ఒకవేళ అమ్మాయి అబ్బాయితో డ్రింక్ కో,  డిన్నర్ కో వెళ్లిందంటే తన సొంత ఛాయిస్ తో వెళ్తుంది- తను అవైలబుల్ అని బోర్డు పెట్టుకుని వెళ్ళదురా శుంఠా అని! 

        జడ్జి అభ్యంతరం చెప్తున్నా బాణా లేస్తాడు అబ్బాయిల మీద దీపక్. ఇక మీనల్ కన్యాత్వాన్ని ప్రశ్నించే  సరికి గగ్గోలు లేచిపోతుంది. కానీ ఇదే గగ్గోలు బాదితుడూ అతడి ఫ్రెండ్స్,  మీనల్ - ఆమె స్నేహితురాళ్ళ శీలం గురించి అన్నప్పుడు పుట్టదు. దీపక్ వ్యూ హం ఒక్కటే- విచారణని ఆత్మరక్షణ కోణంలోకి మళ్ళించడం. తను పంతొమ్మిదో ఏట కన్యాత్వాన్ని కోల్పోయినట్టు ఒప్పుకుంటుంది మీనల్. ఆ తర్వాత ప్రశ్నలకి, కొందరు బాయ్ ఫ్రెండ్స్ తో కూడా తిరిగినట్టు ఒప్పుకుంటుంది. మరింకేం- ఆమె ఇలాంటిది కాబట్టే బాధితుడు చొరవ తీసుకున్నాడని బాధితుడి పక్షం అర్ధం వచ్చేసింది. కానీ...కానీ...

        మీనల్  అలాంటిదైనంత మాత్రాన ఆమెని వాడేసుకునే హక్కుండదు ఆమె ఒప్పుకోకపోతే- మీనల్ వాడికి నో చెప్పేసింది. అయినా బలవంత పెట్టాడు. దీంతో తలబద్దలు కొట్టింది.

        ఇప్పుడంటాడు లాయర్ దీపక్- ‘ఈ అబ్బాయిలు ‘నో’ అనే మాటకి అర్ధం ‘నో’ అనే ఉంటుందని అర్ధం జేసుకు చావాలి. అలా ‘నో’ అన్న అమ్మాయి పరిచయస్థురాలైనా, ఫ్రెండ్ అయినా, గర్ల్ ఫ్రెండ్ అయినా, సెక్స్ వర్కర్ అయినా, సొంత భార్య అయినా- కచ్చితంగా ‘నో’ అన్నట్టే అర్ధం. అప్పుడా వెధవ గట్టిగా నోర్మూసుకోవాలి!’ అని.
       
కేసు రివర్స్ అయి బాధితుడూ వాడి భాగస్థులూ జైల్లో పడతారు.

నాటకాంకం
     ఇక ఈ స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ విషయం చూద్దాం. స్క్రీన్ ప్లే రాయడమంటేనే తీసివేత- తీసివేత- తీసివేతల ఎడతెగని తంతు. ఈ డైలాగు ఎందుకుండాలి, ఈ సీను ఎందుకుండాలి, ఈ షాటు ఎందుకుండాలీ, వీడెందుకిలా నవ్వాలీ, ఇదెందుకలా చూడాలీ అని వీలైనంత తగ్గించడం గురించే, వేటు వేయడం గురించే ఆలోచించే తంతు అనవసరమనిపిస్తే.  తీసివేయగా తగ్గించగా చెత్తంతా పోగా, మిగిలిన పేజీల్ని అందంగా చెక్కే, పాలిష్ పట్టే హస్తకళే స్క్రీన్ ప్లే రాత. ఏ స్క్రీన్ ప్లే అయినా పేషంట్ గానే జన్మెత్తుతుంది, నిర్మొహమాటంగా చికిత్స చేస్తే తప్ప బతికి సినిమాకి పనికి రాదు.
        ఒకసారి
పైన చెప్పుకున్నఈ సినిమా కథా సంగ్రహాన్ని స్క్రీన్ ప్లే పరంగా ఇలా విడగొడదాం :
         
బిగినింగ్ :
         
మీనల్ అరోరా (తాప్సీ) ఫలక్ అలీ (కీర్తీ కుల్హరీ)  ఆండ్రియా (ఆండ్రియా తరియంగ్) అనే ముగ్గురు ఢిల్లీలోని ఒక ఫ్లాట్ లో నివసిస్తూ జాబ్స్ చేస్తూంటారు. ఒకరాత్రి  సూరజ్ కుంద్ లోని  ఓ రిసార్ట్స్ లో జరుగుతున్న  ప్రోగ్రాంకి వెళ్తారు. అక్కడ రాజ్ వీర్ (అనంగ్ బేడీ) తన ఫ్రెండ్స్ తో వుంటాడు.  రాజ్ వీర్ మీనల్ కి తెలుసు. అక్కడ వాళ్ళతో కలిసి డ్రింక్ చేస్తారు ముగ్గురూ. ఈ అవకాశంతో వాళ్ళని అనుభవించాలని చూస్తారు రాజ్ వీర్ అతడి ఫ్రెండ్స్ ముగ్గురూ. మీనల్ ‘నో’  అన్నా రాజ్ వీర్ వూరుకోక మిస్ బిహేవ్ చేస్తాడు. దీంతో బాటిలెత్తి అతడి తలకాయ బద్దలు కొడుతుంది. తీవ్రంగా గాయపడ్డ అతణ్ణి వదిలేసి పారిపోతారు మీనల్, ఫలక్, ఆండ్రియా.
       
మిడిల్ :
        ఇక  పరిణామాలు వూహించుకుని బిక్కు బిక్కుమంటూంటారు ముగ్గురూ. బాగా పవర్ఫుల్ రాజకీయనాయకుడి కొడుకైన రాజ్ వీర్, మీనల్ మీద పగ దీర్చుకోవాలను
కుంటాడు. ఆమెతో సహా ఫలక్ నీ, ఆండ్రియానీ ఫ్లాట్లోంచి సాగనంపేయాలని ఓనర్ ని బెదిరిస్తాడు. ఫలక్ మధ్యవర్తిత్వం వహించి  మీనల్ చేత రాజ్ వీర్ కి సారీ చెప్పించాలని ప్రయత్నిస్తుంది. సారీ చెప్పేందుకు మీనల్ ఒప్పుకోదు. ఎదుటి బంగళాలో రిటైర్డ్ లాయర్ దీపక్ సెహగల్ (అమితాబ్ బచ్చన్) వుంటాడు. ఇతను ఈ అమ్మాయిలేదో సమస్యలో పడ్డారని అనుమానిస్తాడు. అతడి కళ్ళముందే రాజ్ వీర్ మీనల్ ని కిడ్నాప్ చేసి తీసికెళ్ళి పోతాడు. వెంటనే దీపక్ పోలీసులకి సమాచారం అందించినా ఆ కారు దొరకదు. ప్రయాణిస్తున్న కార్లో ఫ్రెండ్స్ తో కలిసి రాజ్ వీర్ మీనల్ ని లైంగికంగా వేధించి వదిలేస్తాడు. ఇక మీనల్ కి పోలీసులని ఆశ్రయించక తప్పదు. ఈ లేడీ ఎస్సై  రాజ్ వీర్ తండ్రికి సమాచారం అందివ్వడంతో రాజ్ వీర్ తండ్రి మీనల్ మీద ఎదురు కేసు పెట్టిస్తాడు- రాజ్ వీర్ మీద మీనల్ హత్యాయత్నం చేసిందన్న ఆరోపణతో. మీనల్ అరెస్టయి జైలు కెళ్తుంది.  ఇక వుండలేక లాయర్ దీపక్ ఉచిత న్యాయ సహాయం అందిస్తూ ఈ కేసు చేపట్టడానికి ముందుకొస్తాడు. ఇక్కడ్నించీ కోర్టులో ఈ కేసు ఎలాగెలా నడిచిందీ, అమ్మాయిలు బోనెక్కితే ఎలాటి చేదు అనుభవాలు ఎదురవుతాయి-
         
ఇక ఎండ్ వచ్చేసి- కన్యాత్వం పాయింటు మీద నడిచి ముగుస్తుంది. బిగినింగ్ విభాగానికి ముగింపు హీరోయిన్లు రాజ్ వీర్ ని  కొట్టి పారిపోవడం అనే ప్లాట్ పాయింట్ -1 ఘట్టం అన్నమాట. ఇక మిడిల్ కి ముగింపు – అవును, మేం డబ్బుతీసుకున్నామని కోర్టులో ఫలక్ పాత్ర గొంతు చించుకుని తనకుతానే కేసు ఓడిపోయేఘట్టాన్ని సృష్టించుకోవడం. ఇది ప్లాట్ పాయింట్- 2 ఘట్టం అన్నమాట. 

        బాగానే వుంది, అయితే పైన చెప్పుకున్న బిగినింగ్ విభాగం సినిమాలో లేనేలేదు. బిగినింగే లేదు, బిగినింగ్ అస్సలు లేదు! బిగినింగ్ లేకుండా మిడిల్, ఎండ్ లతోనే సినిమా నడిచి ముగుస్తుంది.  సినిమా ప్రారంభమే మిడిల్ ప్రారంభంతో మొదలవుతుంది. ఆ తర్వాత ఎండ్ కి వెళ్ళిపోతుంది, అంతే. మరి బిగినింగ్ ఎందుకు లేదు, అదేమైనట్టు? అసలు బిగినింగ్ లేకుండా ఏ సినిమా ఏ స్క్రీన్ ప్లే ప్రపంచంలోనే  లేదు. బిగినింగ్ స్థానం మారవచ్చు. మిడిల్ తో మొదలయ్యే కథలో ఫ్లాష్ బ్యాక్ గా బిగినింగ్ రావచ్చు. ఇలాటి సినిమాలు చాలా వున్నాయి. హాలీవుడ్ కాదుకదా, అసలే స్క్రీన్ ప్లే స్ట్రక్చరూ పట్టని యూరోపియన్ సినిమాలు కూడా బిగినింగ్ లేకుండా లేవు. బిగినింగ్ లేకుండా కథ చేయవచ్చన్న వూహే ఎవ్వరికీ రాదు. 

        మరి బిగినింగ్ లేకపోతే,  పైన కథా సంగ్రహమంటూ చెప్పుకున్న స్క్రీన్ ప్లేలో  బిగినింగ్ అంటూ చెప్పుకున్న కథ ఎక్కడ్నించీ వచ్చింది? అది వున్నందుకే కదా మిడిల్ మొదలైంది. అది లేకపోతే మిడిల్ ఎలా మొదలైంది?  

        బిగినింగ్ వుంది- పైన చెప్పుకున్నట్టే  అంతా వుంది. అయితే తీసివేత కార్యక్రమంలో ఎగిరిపోయింది. ఒక పెద్ద కత్తి తీసుకుని గట్టి వేటు వేస్తె ముక్క తెగి అరేబియా సముద్రంలో పడింది. దరిద్రం వదిలింది. ఒక డైలాగు కాదు, ఒక సీను కాదు, ఒక షాటూ కాదు, ఒకడి నవ్వూ కాదు, ఒకత్తి చూపూ కాదు- ఏకంగా  బిగినింగ్ అంతా కట్టకట్టి అనవసరమని లేపేశారు. చాలా తెగింపు, చాలా మేజర్ ఆపరేషన్. 

        క్లుప్తతే కళకి ఆభరణం. ఈ క్లుప్తీ కరణలో ఇంకోటి కూడా వుంది : మాటగా చెబితే అర్ధమయ్యే దాన్ని బొమ్మగా చూపనవసరం లేదు, బొమ్మగా చూపిస్తే అర్ధమై పోయే దాన్ని మాటగా చెప్పనవసరంలేదు. ఏ  స్టోరీ ఈజ్ టోల్డ్ ఇన్ పిక్చర్స్-  అన్నాడు సిడ్ ఫీల్డ్ డైలాగుల ప్రాధాన్యం తగ్గించుకోమంటూ. కానీ బిగినింగే లేకపోతే పిక్చర్స్ కూడా ఎక్కడివి? ముందు కాలంలో ‘పింక్’ అనేది వచ్చి ఈ ప్రశ్న వేస్తుందని వూహించి వుండడు. 

        మాటతో చెబితే పోయేదానికి చాట భారతం  చూపించనవసరం లేదని  ఫ్లాష్ బ్యాక్స్ గురించి రూలుంది. అదే ఫ్లాష్ బ్యాక్ రూలుని  మొత్తం బిగినింగ్ విభాగానికే వర్తింప జేస్తే? బిగినింగ్ విభాగమంతా రెక్కలు కట్టుకుని ఎగిరిపోతుంది. క్లుప్తతకి- తీసివేతకి ఇంతకంటే సులువు వుందా?

       ఈ సినిమా రాత్రిపూట గాయపడ్డ  రాజ్ వీర్ ని నేస్తాలు హడావిడిగా కార్లో హాస్పిటల్ కి తీసుకుపోతూండగా, అవతల ఇంకో చోట  ఆందోళనతో హీరోయిన్లు ముగ్గురూ క్యాబ్ ఎక్కి పారిపోతూండగా మొదలవుతుంది. వాళ్ళు హాస్పిటల్ కి పోతారు, వీళ్ళు ఫ్లాట్ కి వచ్చేస్తారు. ఏదో జరిగింది. ఏం జరిగిందనేది పెద్ద సస్పెన్స్. ఈ దృశ్యాలన్నీ మిడిల్ కి చెందినవి. ఎక్కడో ఏదో సంఘటన జరిగి వీళ్ళిలా వచ్చేశారంటే- హాఫ్ వేలో సినిమా మొదలైందంటే - అప్పటికే బిగినింగ్ అయిపోయిందన్న మాట. ఏదో జరిగి వుండడం అనేదే ప్లాట్ పాయింట్ -1 ఘట్టం. ఈ ఘట్టం మనకి చూపించకుండా ఈ ఘట్టం తర్వాత పరారీ నుంచి ఎత్తుకున్నారు కథని. అంటే మిడిల్ నుంచీ కథ ఎత్తుకున్నారు. సర్వసాధారణంగా ఇలాంటప్పుడు ఒక్కటే జరుగుతుంది- కాస్సేపు సస్పెన్స్ ని  పోషించినట్టు పోషించి,  సందు చూసుకుని ఆ బిగినింగ్ ని ఫ్లాష్ బ్యాక్ గా వేసేసి,  మొత్తం చూపించేస్తారు ఏం జరిగిందో. 

        ఇలా కాకుండా ఓపెనింగ్ బ్యాంగ్ అని ఇంకా ఒక ఫ్యాషన్ పెట్టుకున్నట్టయితే,  ఆ ఘట్టంతోనే సినిమా ఓపెన్ చేసి బ్యాంగ్ ఇచ్చి- తర్వాతి మొక్కుబడి తంతుగా టైటిల్స్ మొదలెడతారు. ఇంకా అంబాసిడర్ కార్లలాగా తిరుగుతున్న ఈ రెండిటినీ (ఫ్లాష్ బ్యాక్, ఓపెనింగ్ బ్యాంగ్) కాలుష్య నియంత్రణ చట్టం కింద కాలం చెల్లిన డొక్కు బళ్ళుగా ప్రకటించి, వేటు వేసిందే ‘పింక్’ పంథా. 

        ఈ సృష్టిలో మనం మిడిల్ లో వున్నాం, ఎండ్ చూస్తాం, సృష్టి ఎలా మొదలయ్యిందో మనం చూళ్ళేదు. వాళ్ళూ వీళ్ళూ చెప్పగా వింటున్నాం.  సినిమాలో బిగినింగ్ ని మాత్రం చూడాలన్న కోరిక ఎందుకు పెట్టుకోవాలి. పాత్రలే చెప్పుకుంటున్నది వింటే సరిపోదా?

        మిడిల్ తో ప్రారంభించి - మిడిల్ బిజినెస్ తాలూకు సంఘర్షణంతా చూపించుకొస్తూ- సెకండాఫ్ లో కోర్టు ప్రొసీడింగ్స్ ప్రారంభమైనప్పుడు- అసలేం జరిగిందో (బిగినింగ్) ఆయా సాక్షుల, వైరి పక్షాల వాంగ్మూలాల్లో బయటపడ్డం మొదలవుతుంది. ఎప్పుడూ కూడా ఏ సాక్షీ అసలేం జరిగిందంటే అనగానే- ఒక బిట్ ఏదో ఫ్లాష్ బ్యాక్ గా వేస్తూ చూపించడం కూడా చేయలేదు. ఇప్పుడు కూడా జరిగిన సంఘటన దృశ్య పరంగా అస్సలు చూపించలేదు. కోర్టు విచారణలో పాత్రల మాటల ద్వారానే మనం వూహించుకోవాలి, అర్ధం జేసుకోవాలి. ప్రేక్షకులతో ఇంటరాక్టివ్ స్టోరీ టెల్లింగ్ అంటారు దీన్ని. ఒక్కసారి ప్రాసిక్యూటర్ సీసీ టీవీ ఫుటేజీ వేస్తాడు కోర్టులో. అప్పుడు కూడా ఆ రిసార్ట్స్ రూమ్స్ బయట హీరోయిన్లు ముగ్గురి అనుమానాస్పద కదలికలే చూపించి అర్ధాలు తీయడం మొదలెడతాడే తప్ప- రూమ్స్ లోపలేం జరిగిందో చూపించడు. ఎందుకంటే రూమ్స్ లోపల సీసీ కెమెరాలు పెట్టరని మనకి తెలిసిందే. వాస్తవంగా చూసినా  ఒక సంఘటన జరిగి కేసు నడిస్తే,  ఆ సంఘటనలో పాల్గొన్న వ్యక్తులు తప్ప మనం గానీ, పోలీసులు గానీ, కోర్టుగానీ దాన్ని చూసి వుండే అవకాశం ఎలా వుండదో,  అదే వాస్తవిక ధోరణితో కథని నడిపారు. 

        రెండోది, ఏం జరిగిందో మనకి అర్ధమైపోతూంటే ఇంకా దృశ్య రూపం అక్కర్లేదు. మాటగా చెబితే అర్ధమయ్యే దానికి బొమ్మ చూపించనవసరం లేదు. 

        ఇందుకే దృశ్యపరమైన బిగినింగ్ అప్రస్తుతమై పోయింది. కోర్టు భాషలో చెప్పాలంటే ఇమ్మెటీరియల్ ఐపోయింది. ఇది స్టేజి నాటక విధానం. ఇదే కథని స్టేజి నాటకంగా వేస్తే  మొదటి రంగం అవసరం లేకుండా తర్వాతి రెండు రంగాల్లో చూపించేస్తారు. మొదటి రంగం రిసార్ట్స్ సంఘటన అయితే అదెలాగూ స్టేజీ మీద చూపించడం కష్టం కాబట్టి దాన్ని పరిహరించి, నేరుగా ఈ సినిమాలోలాగే పాత్రల పరారీతో రెండో రంగంగా ప్రారంభించి, రెండో రంగం బిజినెస్ గా ఆ సంఘర్షణ అంతా తెర దించకుండా ఆ ఒక్క రంగం లోనే నడిపి- అప్పుడు తెరదించి,  మూడో రంగంగా  కోర్టు సెట్ తో కేసు విచారణ ప్రారంభించి ముగిస్తారు ఈ సినిమాలో లాగే. 

        ఇలా నాటకాల్లో మొదటి  అంకాన్ని పరిహరించినట్టు, సినిమాలోనూ బిగినింగ్ విభాగాన్ని దృశ్యంగా తీసేసి, దాని విశేషాల్ని మిడిల్ బిజినెస్ లో భాగంగా పాత్రల చేత పలికిస్తూ వచ్చారు. ఏమైనా తేడా వచ్చిందా ఆస్వాదనలో? ఏమీ రాలేదు. 


        ఈ కథలో బిగినింగ్ వుంది. కాకపోతే  మిడిల్- ఎండ్ విభాగాల్లో మాటల రూపంలో దాగి వుంది. కాఫీలో పంచదార వుంది. అయితే కలపలేదు, తాగుతూంటే మెల్లగా కరుగుతూంటుందిగా. ఇదే ఈ స్క్రీన్ ప్లేతో చేసిన అపూర్వ ప్రయోగం. దీంతో మొత్తం సినిమాకే ఒక కొత్త కళ  వచ్చింది. రూల్స్ అందరూ పాటిస్తారు. రూల్స్ ని బ్రేక్ చేసే రెబల్స్ కావాలంటే కూడా బెడిసి కొట్టకుండా ఒడిసిపట్టే  నేర్పు తెలిసి వుండాలి. అనిరుద్ధ  రాయ్ చౌధురి, షూజిత్ సర్కార్, రీతేష్ షా త్రయం ఈ  జిమ్నా(సిన్మా) స్టిక్స్ లో ఆరితేరిపోయారు.


-సికిందర్
http://www.cinemabazaar.in






       


12, అక్టోబర్ 2016, బుధవారం

రివ్యూ!

స్క్రీన్ ప్లే- దర్శకత్వం : ప్రకాష్ రాజ్

తారాగణం : ప్రకాష్‌రాజ్‌, ప్రియమణి, సత్యదేవ్‌, పృథ్విరాజ్‌, అచ్యుత్‌కుమార్‌, రంగాయన రఘు, రఘుబాబు తదితరులు
కథ : జాయ్ మాథ్యూ, మాటలు : గోపిశెట్టి రమణ- ప్రకాష్ రాజ్, సంగీతం
: ఇళయరాజా
ఛాయాగ్రహణం : ముఖేష్
బ్యానర్ : ప్రకాష్రాజ్ ప్రొడక్షన్
, ఫస్ట్కాపీ పిక్చర్స్
నిర్మాతలు
:  రామ్జీ నరసింహన్, ప్రకాష్రాజ్
విడుదల : 7 అక్టోబర్, 2016
***
     ధోని, ఉలవచారు బిర్యానీ  వంటి సమాంతర సినిమాలకు దర్శకత్వం వహించి తన అభిరుచిని చాటుకున్న విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్, మరోసారి తన దర్శకత్వ ప్రతిభని చాటుతూ ముందు కొచ్చారు. ‘మన ఊరి రామాయణం’ దర్శకుడుగా ఆయన మూడో రీమేక్. ఇతర భాషల్లో తనకి  నచ్చిన ఉత్తమ సినిమాల్ని రీమేక్ చేస్తూ వస్తున్న ప్రకాష్ రాజ్, ఈసారి  కూడా తెలుగు ప్రేక్షకుల అభిరుచులకి సవాలు విసురుతూ కమర్షియలేతర సినిమా తీశారు. ఒక సినిమాని పాటలు, ప్రేమలు, డాన్సులు, ఫైట్లు, కామెడీలూ లేకుండా చూడలేనంత మొద్దుబారిపోయి వున్నామా మనం నిజంగా- లేకపోతే పలాయనవాదంతో అలా నటిస్తున్నామా? నిజంగా ఇవేవీ లేని ఒక పవర్ఫుల్ కమర్షియలేతర సినిమాని చూడలేమా తెలుగులో? సినిమా అక్షరాస్యతా రేఖకి  అంత దిగువకి జారిపోయి క్షణికానందం కోసం ఉత్త కాలక్షేప సినిమాలు చూస్తూ జీవితాలు చాలించుకోవడానికేనా ఈ  జన్మ? చూసే సినిమాలు అధమంగా  వుండాలనుకున్నప్పుడు, కొనే సెల్ ఫోన్లు కూడా అధమంగానే  వుండాలిగా? అనవసరంగా ఈ హిపోక్రసీ  ‘మన ఊరి రామాయణం’ లాంటి సినిమాల్ని చంపేస్తోంది. కానీ ఈ సినిమా ముందు కమర్షియల్ సినిమాలు కూడా బలాదూర్  అనేందుకు కట్టి పడేసే  అంశాలు ఎలా వుండాలో అలా వుండి – ఏ సినిమా అయినా ఇలా కదా వుండాల్సింది అన్న ఎవేర్నెస్ తో బయటి కొస్తారు ప్రేక్షకులు.

కథ 
      దుబాయ్ లో బాగా డబ్బు సంపాదించుకుని సొంతూరు వస్తాడు భుజంగయ్య (ప్రకాష్ రాజ్).  ఊళ్ళో భార్య, అత్తా, ఇద్దరు కూతుళ్ళూ వుంటారు. బయట డబ్బు మదంతో, ఇంట్లో అడ్డమైన పెత్తనంతో ఎవర్నీ నోరెత్త నివ్వకుండా ఇష్టారాజ్యంగా బతికేస్తూంటాడు. చేసే పనేం లేదు. సాయంత్రం కాగానే తన ఇగోని సంతృప్తి పర్చుకుంటూ నేస్తాలకి మందు పోసి పొగడ్తలు విని తరించడమే. ఇంటి కాంపౌండు నానుకుని రోడ్డు మీదికి ఓ షాపు తన సొంతానిది. దాన్ని అద్దెకివ్వకుండా సాయంకాలాలు పానశాలగా మార్చడమే. దుబాయ్ కి వెళ్ళక ముందు ప్రతీ శ్రీరామ నవమికి రావణుడి వేషం వేసేవాడట. ఇప్పుడు నవమి వచ్చింది. ఆ ఉత్సవాలు డబ్బు ఖర్చుపెట్టి భారీగా నిర్వహిస్తూంటాడు. ఆ ఉత్సవాల్లో భాగంగా తను  రావణాసురుడి వేషం వెయ్య బోతున్నాడు.  ఆ రాక్షసత్వం ఇప్పుడు ఇంట్లో కూడా ప్రదర్శిస్తూ పెద్ద కూతుర్ని డిగ్రీ చదువుకో నివ్వడు. ఎందుకంటే కాలేజీ పేరుతో  ఆమె బాయ్ ఫ్రెండ్ తో తిరుగుతోందని అనుమానం, కాబట్టి కాలేజీ మాన్పించేసి పెళ్లి చేసేస్తానంటాడు. ఒక రోజు ఇంట్లో మాటామాటా పెరిగి ఉక్రోషంతో ఇల్లు వదిలి వెళ్ళిపోతాడు. వూళ్ళో తనకి నమ్మిన బంటు ఒకడు వుంటాడు- శివ (సత్యదేవ్) అనే ఆటో డ్రైవర్. వీడికి దుబాయ్ వెళ్లేందుకు వీసా ఇప్పిస్తానని వెంట తిప్పుకుంటూంటాడు. ఆ రాత్రి షాపులో మందు భాయీలతో మందేసుకుని శివ ఆటో ఎక్కి ఎక్కడికో బయల్దేర తాడు భుజంగయ్య. బయల్దేరుతోంటే రోడ్డుపక్క అమ్మాయి కన్పిస్తుంది. ఆమెనేసుకోవాలన్పించి శివని  పంపిస్తాడు. సుశీల (ప్రియమణి) అనే ఆ వేశ్యని మాట్లాడి శివ పట్టుకొస్తాడు. వాళ్ళు కులకడానికి షాపులోకి తోసి తాళం వేసుకుని, ఫుడ్డు తీసుకుని గంటలో వస్తానని వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిన వాడు ఇక రాడు.  

        ఈ రాకపోవడమే భుజంగయ్య కొంపలు ముంచుతుంది. రాత్రంతా వేశ్యతో షాపులో ఇరుక్కుని, ఏ సమయంలో ఏం జరుగుతుందో, తెల్లారితే ఇదెక్కడ బయటపడి ఇంటా బయటా పరువుపోతుందో, తనేమై పోతాడో - అని క్షణం క్షణం ప్రాణాలరజేతిలో బెట్టుకుని నానా చావూ చస్తాడు. 

       భుజంగయ్య ఈ రొంపి లోంచి ఎలా బయట పడ్డాడు, చిట్ట చివరికి తాళం ఎవరు తీశారు, అప్పుడు ఎవరికి తను దొరికిపోయాడు, దొరికిపోతే ఏం జరిగిందనేది అడుగడుగునా సస్పెన్స్ తో కట్టి పడేసే కథ.

ఎలావుంది కథ 
     2012 లో జాయ్ మాథ్యూస్ అనే కొత్త దర్శకుడు తీసిన ‘షటర్’  అనే మలయాళ  సినిమాకి రీమేక్ ఇది. మలయాళ ఒరిజినల్ కేవలం సస్పెన్స్ థ్రిల్లరే అయితే, తెలుగులో ఈ సస్పెన్స్ థ్రిల్లర్ అనే బంగారు పళ్ళేనికి  మరింత డెప్త్ తీసుకొస్తూ రామాయణంతో పౌరాణిక గోడ చేర్పు ఇచ్చారు. బాపూ రమణలు ఆ పైన వుంటే అక్కడ్నించీ  ప్రకాష్ రాజ్ కి అభినందన సందేశం పంపుతారు- రామాయణాన్ని ఇలా కూడా తీస్తావటయ్యా భలేవాడివి- అని. 1979 లో దాసరి నారాయణ రావు అక్కినేని నాగేశ్వర రావుతో ‘రాముడే రావణుడైతే’ తీశారు. కానీ రావణుడే రాముడైతే? ఇదే ఈ కథ. రావణుడు రాముడిగా మారే కథ. ఒక నోరు తిరగని పేరుతో పోలెండ్ దర్శకుడున్నాడు- స్ట్రిస్టాఫ్ కీష్ లాస్కీ అని. ఇంగ్లీషులో స్పెల్లింగ్ ఇలా వుంటుందిKrzysztof Kieslowski  అనిఈయన 1989లో ‘టెన్ కమాండ్ మెంట్స్’ ని ఆధారంగా తీసుకుని ‘డెకలాగ్’ అనే పది నీతికథల టెలిఫిలిమ్స్ తీశాడు. అవన్నీ ఒకే అపార్ట్ మెంట్ లో జరుగుతాయి. అలా వేశ్యతో ఒక షాపులో ఇరుక్కున్న  రావణుడి నీతి కథే ఇది. మనిషిలో రాముడు రావణుడు ఇద్దరూ వుంటారు. ఇంకో తన బలమెంతో తెలియని హనుమంతుడూ వుంటాడు. అలాగే సీతలా  కన్పించే అమ్మాయి సీత కాకపోవచ్చు- శూర్పణక అయివుండవచ్చు. ఇవన్నీ కలిపి ఒక సస్పెన్స్ రామాయణం ఈ కథ. మలయాళ ఒరిజినల్ దర్శకుడు తన కథని ‘పొయెటికల్ వయొలెన్స్ ఆన్ సెల్యూలాయిడ్’ అన్నాడు. ఇది తెలుగుకీ వర్తిస్తుంది.
ఎవరెలా చేశారు
 
     ప్రకాష్ రాజ్ గురించి చెప్పాల్సిన పని లేదు. ఎంత రావణుడైనా వాడు కుక్కిన పేనయ్యే రోజొకటి వస్తుంది. వేశ్యతో ఇరుక్కున్న ఈ పరిస్థితిని అద్వితీయంగా పోషించాడు. చాలా క్లిష్ట పాత్ర ఇది. పాత్రలోకి మనల్ని లీనం చేసి వదలకుండా తనతో తీసుకుపోతాడు. క్షణం క్షణం మారిపోయే పరిస్థితులకి అంతకంతకూ పెరిగిపోయే భావోద్వేగాల తీవ్రతని కంటిన్యుటీ చెడకుండా పకడ్బందీగా నటించాడు. షాపు వెనకాలే ఇంట్లో భార్యా పిల్లలున్నారు, షాపులో వేశ్యతో తను వున్నాడు. తాగిన మత్తులో వేశ్యని కోరుకున్నాడు, తీరా ఆమెకిదగ్గర కాలేకపోతున్నాడు. అలాటి తత్త్వం కాదు తనది. ఇంట్లోభార్యని నోరెత్తకుండా చేసే తను ఇప్పుడు వేశ్య ఏరా పోరా అంటున్నా కిక్కురుమనడంలేదు. తాళం వేసుకుపోయిన శివ ఎంతకీ రాకపోయేసరికి భయం- పరువు ప్రతిష్టలగురించి భయం పట్టుకుంది. పైగా పక్క షాపు వాడికి తన షాపు అద్దె కివ్వననేసరికి వాడు కోపం పెంచుకున్నాడు. ఇప్పుడు షాపులో ఏ మాత్రం అలికిడి అయినా వాడొచ్చే  ప్రమాదముంది. కానీ ఈ దిక్కుమాలిన వేశ్య సెల్ ఫోన్ కి మాటిమాటికీ కస్టమర్స్ నుంచి కాల్స్ రావడం, ఆమె పెంకెగా అరిచి మాట్లాడడం ప్రాణాల్ని తోడేస్తోంది...ఇలా చెప్పుకుంటూ పోతే రావణుడి క్షోభ అంతా ఇంతా కాదు. ఇదంతా ప్రకాష్ రాజ్ నటనతో అడుగడుగునా ఊపిరి బిగబట్టి చూడాల్సిన ఉత్కంఠని రేపుతాయి. అంత తేలిగ్గా మర్చిపోలేం ఈ పాత్రలోప్రకాష్ రాజ్ ని.

         ప్రియమణి కూడా వేశ్య చేష్టల్ని చాలా నేర్పుగా నటించింది. ఎంత సేపూ తన గొడవే గానీ అవతలి వాడి ఏడ్పు ఏమాత్రం పట్టని పాత్ర చిత్రణతో తను సృష్టించే సమస్యలు ఇన్నీ అన్నీ కావు- పరువు గురించి వీడికి భయముంటే తనకేంటన్నవేశ్య సహజ నిర్లక్ష్యంతో హడలెత్తించేస్తుంది. దాదాపు ముప్పావు కథ ఈ జగమొండి తనంతోనే సాగేక, అప్పుడు తెల్లారి వెంటిలేటర్ లోంచి అవతల ఇంట్లో అతడి భార్యా పిల్లల్ని చూసినప్పుడు, మెత్తబడి మొట్టి కాయలేయడం మొదలెడుతుంది అతడి పాడు బుద్ధికి. తను కూడా మానవత్వం నేర్చుకుని హూందాతనం ప్రదర్శిస్తుంది. ప్రియమణి కూడా గుర్తుండిపోతుంది ఈ పాత్రతో.

         ఇక సత్యదేవ్ గురించి. తెలుగు వాడైన ఇతను పూరీ జగన్నాథ్ తీసిన ‘జ్యోతిలక్ష్మి’ తో పరిచయమయ్యాడు. ఆ సినిమాలో సినిమాలో వేశ్యతోనే, ఈ సినిమాలోనూ వేశ్యతోనే. భుజంగయ్య తనకి రాముడు లాంటి వాడు. తను హనుమంతుడు. కానీ వాళ్ళిద్దర్నీ  షాపులోకి తోసి తాళం వేసుకుని ఫుడ్డు కోసంవెళ్ళిన వాడు ఎక్కడెక్కడో ఇరుక్కుంటాడు- ఏమేమో చేస్తాడు- ఎక్కడెక్కడో తిరుగుతాడు. తెల్లరిపోయాక నడిబజార్లో తాళం తీసే అవకాశం లేక గురువు గారి కోసం తల్లడిల్లిపోతాడు- ఈ ఆటో డ్రైవర్ క్యారక్టర్లో సత్యదేవ్ కూడా అత్యంత సహజంగా నటించాడు. 

            పృథ్వీ ది చాలా సర్ప్రైజ్ అప్పీయరెన్స్. రొటీనై పోయిన తన ఓవరాక్షన్ పేరడీల, డైలాగుల జడివానలోంచి ఓ తొలకరితో కొత్తదనానికి నాట్లు వేశాడు. ఒక స్ట్రగుల్ చేసే సినిమా దర్శకుడిగా మామూలు చొక్కా ప్యాంటు వేసుకుని,  సామాన్యుడిలా ఆటోల్లో తిరుగుతూ, తగ్గి మాట్లాడుతూ, పోగొట్టుకున్న స్క్రిప్టు వెతుక్కునే పాత్రలో పృథ్వీ జస్ట్ ది బెస్ట్. 

        ఇక ఇలాటి కథ వున్న సినిమాతో ఇళయరాజా గురించి చెప్పేదేముంది- ఆయనకి మరో మౌనరాగమో మరోటో దొరికినట్టే. తన సంగీత సారమంతా కథలోకి దింపేశారు. అలాగే కెమెరా మాన్ ముఖేష్ ఒక ఆర్ట్ వర్క్ లా చిత్రీకరణ చేశాడు. అంత ప్రధాన పాత్రలో నటిస్తూ కూడా ప్రకాష్ రాజ్ కనబర్చిన దర్శకత్వపు మెళకువలు- షాట్స్ తీయడంలో నేర్పు విజువల్ మీడియా మీద తనకున్న పట్టు ఏమిటో తెలియజేస్తాయి. ఏ నటీనటులూ కూడా ఆయన దర్శకత్వంలో అసహజంగా కన్పించరు. 

స్క్రీన్ ప్లే సంగతులు
    చాలా గర్వించాల్సిన విషయమేమిటంటే, తెలుగు సినిమాల్లో శాస్త్రీయ స్క్రీన్ ప్లేల  కోసం కళ్ళుకాయలు  చేసుకునే  సినిమా అక్షరాస్యులకి ఈ స్క్రీన్ ప్లే ఓ స్వీట్ కార్న్. పాప్ కార్న్ కాదు. పాప్ కార్న్ స్క్రీన్ ప్లే- సినిమాల పని అయిపోయింది- నూటికి తొంభై శాతం ఇంకా అట్టర్ ఫ్లాపులే- లేదా వీకెండ్ తర్వాత వసూళ్లు డ్రాపులే. స్వీట్ కార్న్ అమెరికా నుంచి దిగుమతి అయ్యింది. శాస్త్రీయ స్క్రీన్ ప్లే కూడా అమెరికా తయారీయే. ఇది మనది కాదని పాప్ కార్న్ స్క్రీన్ ప్లేలతో పిల్లలాట ఆడుకునే వాళ్ళకి ‘మన ఊరి రామాయణం’ గట్టి ఝలక్ ఇస్తుంది. 

        1. త్రీయాక్ట్ స్ట్రక్చర్, 2. గోల్ ఎలిమెంట్స్, 3. క్యారక్టర్ ఆర్క్, 4. టైం అండ్ టెన్షన్, 5.ప్లాట్ డివైస్, 6. కాన్షస్- సబ్ కాన్షస్ మైండ్ ల ఇంటర్ ప్లే, ఇగో జర్నీ, 7. ఇగో మెచ్యూర్డ్ ఇగోగా మారే ముగింపు...మొత్తంగా 8). ఒక సైకో థెరఫీ!

        త్రీయాక్ట్ స్ట్రక్చర్ : రెండు గంటల నిడివి గల ఈ స్క్రీన్ ప్లేలో బిగినింగ్, మిడిల్, ఎండ్ విభాగాలు ప్రామాణిక టైమింగ్ తోవున్నాయి. మొదటి అరగంటలో బిగినింగ్ విభాగం ముగుస్తుంది. ఈ బిగినింగ్ లో పాత్రల పరిచయం, కథ ఏ బాపతో తెలిపే నేపధ్య వాతావరణ కల్పన, సమస్యకి దారితీసే పరిస్థితుల కల్పన, సమస్య - ప్లాట్ పాయింట్ వన్ తో ఆ సాధించాల్సిన సమస్య ఏర్పాటు.

        భుజంగయ్య పాత్ర ద్వారానే ఈ బిగినింగ్ ఎలిమెంట్స్ అన్నీ ఎస్టాబ్లిష్ అవుతూ పోతాయి. టైటిల్స్ పడిన తర్వాత ప్రారంభమే అతను  బైక్ మీద వస్తూ (తర్వాత ఈ బైక్ కన్పించక పోవడం కథా సౌలభ్యం కోసం పాల్పడిన అనౌచిత్యమే. అతను ఈ బైక్ మీదే తిరిగితే అన్ని కష్టాల్లో పడేవాడు కాదు) ఓ షాపు దగ్గర ఇంకో షాపు వాడితో డిస్కషన్ పెట్టుకుని షాపు అద్దెకివ్వననండంతో, అతడికో ఖాళీ షాపు వుందని మనకర్ధమవుతుంది. ఇదే షాపు తాగుడుకి వాడుకోడం, ఇదే షాపు కీలక కేంద్రంగా ప్లాట్ పాయింట్ వన్ దగ్గర వేశ్యతో ఇరుక్కోవడం...ఇలా షాపుతో ఈ కథ మొదలెట్టడంలో  మనకి అర్ధమవుతుంది. ఏ ప్లాట్ పాయింట్ వన్ దగ్గర ఏది కీలక పాత్ర వహిస్తుందో, దాంతోనే మనకి తెలీకుండా కథ మొదలెట్టడం తెలివైన కథాపథకం. 

         వూళ్ళో రామనవమి ఉత్సవాలు జరుగుతున్నాయి. ఆ వాతావరణమంతా ఎస్టాబ్లిష్ అవుతూ వుంటుంది. దీనికి ఉదారంగా విరాళాలిస్తున్న భుజంగయ్య దుబాయ్ లో భారీగా సంపాదించుకు వచ్చాడని మాటల్లో మనకి తెలుస్తుంది. దీనికి తగ్గట్టు  వొంటి మీద బంగారు గొలుసులు, వేళ్ళకి ఉంగరాలు, చేతులకి కంకణాలు, జేబులో పాకెట్ లో పుల్ మనీతో, సిల్కు దుస్తుల్లో  కళకళ లాడుతూ వుంటాడు. ఇంతేకాదు, ఈ సందర్భంగా భుజంగయ్యకి కళాపోషణ కూడా వుందని అర్ధమవుతుంది- ఉత్సవాల్లో రావణ పాత్ర పోషించాలన్న అతడి అభిలాషతో. ఈ అభిలాష ఇంట్లో అతడిలోని రావణుణ్ణి ప్రత్యక్షం చేసి చూపిస్తుంది. భుజంగయ్య ఇంట్లో మర్యాదలేని రాక్షసుడుయితే, బయట గౌరవనీయుడైన రావణుడు. ఇంట్లో భార్య, అత్తా, పెద్ద కూతురు, చిన్న కూతురూ  పరిచయమవుతారు. వీళ్ళని రాచి రంపాన పెడుతూంటాడు ఆడవాళ్ళన్న దయ- వీళ్ళే తనకి దిక్కూ అన్న ఆలోచన కూడా లేకుండా.   

        ఈ ప్రారంభ దృశ్యాల్లోనే ఇంకొకటి ఎస్టాబ్లిష్ అవుతూంటుంది. సమస్యకి దారితీసే పరిస్థితుల కల్పన. పెద్ద కూతురి సెల్ కి  మెసేజ్ వస్తే సంస్కారం లేకుండా తీసి చూస్తాడు. ఎవడో బాయ్ ఫ్రెండ్ వున్నాడని కేకలేయడం మొదలెడతాడు. కూతుర్ని కాలేజీ  మాన్పించేస్తాడు. పెళ్లి చేసేయాలని సిద్ధమై పోతాడు భార్యా అత్తా కూడా వ్యతిరేకించినా. 

        బయట భుజంగయ్య నమ్మిన బంటుగా ఆటో డ్రయివర్ శివ పరిచయమవుతాడు కథకి. దుబాయ్ వెళ్ళడానికి  భుజంగయ్య వీసా ఇప్పిస్తాడని  నమ్మి భుజంగయ్య పనులన్నీ చేసి పెడుతూంటాడు. అలాగే ఊళ్లోకి దిగిన సినిమా దర్శకుడు గరుడ(పృథ్వీ) కూడా పరిచయమవుతాడు కథకి. 

        ఇలా సెటప్ సిద్ధమయ్యాక, కూతురి గురించి మళ్ళీ నానా రభస చేసి వొళ్ళు మండి ఇంట్లోంచి వెళ్ళిపోతాడు భుజంగయ్య. ఈ వెళ్ళడం సింబాలిక్ గా రాముడు అరణ్య వాసానికి వెళ్ళినట్టే. ఇక రామాయణం ప్రారంభమైనట్టే. కాకపోతే ఇక్కడ రావణుడు వెళ్తున్నాడు. వెళ్లి షాపులో నేస్తాలతో మందు కొట్టి అర్ధరాత్రి బయటి కొచ్చి శివ ఆటో ఎక్కుతాడు. ఈ ఆటోలో పోతున్నప్పుడు రోడ్డు పక్క నిలబడి కన్పిస్తుంది సుశీల. ఒక కొత్త పాత్రతో ప్లాట్ పాయింట్ వన్ ని స్పష్టంగా కొట్టొచ్చినట్టూ ఎస్టాబ్లిష్ అవుతుంది. ఇక షాపులో ఆమెతో బందీ అయిపోవడంతో బిగినింగ్ విభాగం ముగుస్తుంది.

     ఇలా వరసగా బిగినింగ్ విభాగంలో పైన చెప్పుకున్న నాల్గు ఎలిమెంట్స్ ఎస్టాబ్లిష్ అయ్యాయి.  ప్లాట్ పాయింట్ వన్ దగ్గర భుజంగయ్యకున్న  గోల్ ఇక ఆ షాపులోంచి-వేశ్యతో ఆ పరిస్థితి నుంచి  బయట పడడమే. ఈ షాపులో ఇరుక్కోవడం ద్వారా అతడి గోల్ ఎలిమెంట్స్  1. కోరిక- అనేది అతను షాపులోంచి బయట పడాలనుకోవడంలో వుంది, 2. పణం - అనేది తన పరువు రిస్కులో పడేసుకుంటూ వేశ్యలో జతకూడడం ద్వారా పెట్టాడు.  3. పరిణామాల హెచ్చరిక అనేది- పరువు పోవడంతోబాటు కూతురి పెళ్లికే ఎసరు వచ్చేలా వుంది, 4. ఎమోషన్ - ఈ మూడూ తలచుకుంటే యాదృచ్చికంగా బలంగా ఎమోషన్ తన్నుకొస్తోంది.  

        ఇలా ప్లాట్ పాయింట్ వన్ సశాస్త్రీయంగా ఎస్టాబ్లిష్ అయ్యాక, దీని నేపధ్యంలో ఇప్పుడు మిడిల్ విభాగంలోకి వెళ్తోంది కథ. మిడిల్  అంటే కథలో యాభై శాతం వుండాల్సిన కదన రంగం. జేమ్స్ బానెట్ ని మనం ఇక్కడ దర్శించుకుంటే- ఆయన ప్రకారం స్క్రీన్ ప్లేలో మిడిల్ అంటే మన సబ్ కాన్షస్ మైండ్, బిగినింగ్ అంటే మన కాన్షస్ మైండ్. కథ మిడిల్లోకి వెళ్ళడమంటే కాన్షస్ మైండ్ సబ్ కాన్షస్ తో తలపడ్డమే. మన కాన్షస్ మైండ్ కి సారధి మన ఇగో. సినిమా హీరో అంటే మన ఇగోకి సింబలే. అంటే కాన్షస్ మైండ్ ని మజాగా ఏలుకుంటున్న ఇగో ఇక తనకి తెలీని, దిగితే  ఏం జరుగుతుందో వూహించలేని, సబ్ కాన్షస్ మైండ్ లోకి (మిడిల్ లోకి) దూకేస్తుందన్న మాట.

        ఇలా భుజంగయ్య వేశ్య అనే గాలానికి చిక్కి, సబ్ కాన్షస్ మైండ్ కి సింబల్ గా వున్న  షాపులోకి దూకేశాడు. సబ్ కాన్షస్ లోకి ఇగో దూకేక ఏమవుతుంది? అక్కడ తన అస్తిత్వం  కోసం పోరాడుతుంది. మనసు చీకటి కోణాల్లో దాగి వుండే భయాలనే నెగెటివ్ శక్తులతో పోరాడుతుంది. అజ్ఞానమనే అడ్డుగోడల్ని కూల్చేస్తుంది. నగ్నసత్యాల్ని తెలుసుకుంటుంది. పరమ సత్యాన్ని గ్రహిస్తుంది. మోక్షం పొంది అలా కాదు, నేనిలా అర్ధవంతంగా జీవించాలనుకుని, మెచ్యూర్డ్ ఇగోగా మారి ఒడ్డున పడుతుంది. అడ్డగోలు ఇగో కాస్తా పునీతమై మెచ్యూర్డ్ ఇగోగా అవతరిస్తుందన్న మాట. ఇది మానసికంగా మనం నిత్యం అనుభవించే ఆవస్థే. వెండితెర మీద సినిమాలో బొమ్మల కదలిక అంటే మన మానసిక ప్రపంచంలో మనం ఆడుకునే ఆటే (కాన్షస్- సబ్ కాన్షస్ మైండ్ ల ఇంటర్ ప్లే). సినిమా కథనే కాదు. ఏ కథ లక్ష్యమైనా  ఇదే- పాత్రని ఇగో నుంచి మెచ్యూర్డ్ ఇగోగా మార్చడం. 

        భుజంగయ్య పాత్ర కూడా బందీ అయిపోయిన ఆ గదిలో ఈ పాట్లన్నీ పడుతుంది. ఆ షాపు గదిలో ఒక్కో సంఘటన అతడిలోని ఒక్కో రావణ (ఇగో) గర్వాన్ని పటాపంచలు చేస్తూపోతుంది. మనిషి ఏదైనా కోల్పోతాడు గానీ పరువు కోల్పోవడానికి సిద్ధ పడడు. కానీ తనకి గొప్ప పరువు ప్రతిష్ట లున్నాయని విర్రవీగి ప్రవర్తిస్తే, ఆ పరువు ప్రతిష్టలేప్రమడంలో పడే  పరిస్థితి వస్తుంది. అప్పుడు బుద్ధి తెచ్చుకుని ప్రవర్తన మార్చుకుంటాడే తప్ప, ప్రాణాల కంటే ఎక్కువైన పరువు ప్రతిష్టల్ని వదులుకోడు. మనం అర్ధం జేసుకుంటే రావణుడనే వాడు మన ఇగో కి సింబల్, రాముడు మెచ్యూర్డ్ ఇగోకి ప్రతీక. ఇగో మెచ్యూర్డ్ ఇగోగా ఎందుకు మారాలి, అసలు ఇగోనే చంపేస్తే పోదా అనవచ్చు. పదార్ధానికి వినాశం లేదని తెలుసుగా? పదార్ధం ఇంకో రూపం ధరిస్తుంది తప్ప నశించడం దాని ధర్మమే కాదు. కాబట్టి-  ఏయ్ నీ ఇగో తగ్గించుకో, ఇగో నీకు మంచిది కాదు- అనడం అవివేకమే. కోతి  మనిషిగా రూపాంతరం చెందినట్టు, ఇగో మెచ్యూర్డ్ ఇగోగా రూపాంతరం చెందాల్సిందే తప్ప నశించడానికి లేదు. 

        భుజంగయ్య ఈ సంఘర్షణలో జీవితంగురించి, కుటుంబ విలువల గురించి, మనిషి విలువ గురించీ నేర్చుకుని  తనలోని రావణుణ్ణి భూస్థాపితం, చేసి రాముడిలా ఇంటికి తిరిగి వస్తాడు. అతడి వనవాసం పూర్తయ్యింది. 

         కరీనా కపూర్- రాహుల్ బోస్ లతో 2003 లో సుధీర్ మిశ్రా తీసిన ‘చమేలీ’ లో కూడా వర్షపు రాత్రంతా ఒక బస్టాపులో వేశ్యతో చిక్కుబడిపోయిన హీరో తెల్లారే సరికి మారిన మనిషిగా ఇంటికి తిరిగొస్తాడు. గొప్ప కథలు చూస్తున్న మనకూ ఇలాటి సైకో థెరఫీలే చేస్తాయి.  


        ఈ కథంతా, ఈ పరివర్తనంతా  ఏడ్పులతో, డైలాగులతో చెప్పలేదు. ఒక్క నీతి వాక్యం మౌఖికంగా చెప్పలేదు. ఏ వాయిసోవర్ తోనూ ముగింపు మెసేజి లివ్వలేదు. ఇదే క్వాలిటీ సినిమా అంటే. ఇవన్నీసంఘటనల ద్వారానే, ఆ సంఘటనలకి పాత్రల ప్రతిస్పందనల ద్వారానే  తెలియజేస్తూ పోయారు. ఈ కథ చెప్పడానికి వాడిన ప్రధాన రసం ఏ చింతపండు పులుసో కాదు. సస్పెన్స్ థ్రిల్లర్ కుండే  అద్భుత రసం. ఒక సంఘటనకి మించి ఇంకో సంఘటనగా టెన్షన్ పెంచుతూ టైం  అండ్ టెన్షన్ గ్రాఫ్ మీద కూడా దృష్టి పెట్టారు. ఆ ప్రకారం క్యారక్టర్ ఆర్క్ కూడా పడుతూ లేస్తూ పోతూంటుంది. ఈ మధ్య ‘డోంట్ బ్రీత్’ అనే హర్రర్ సస్పెన్స్ వచ్చింది. దానికంటే ఓ పదిశాతం తక్కువ సస్పెన్స్ -టెన్షన్ – థ్రిల్ ఎలిమెంట్స్ తో ఇది వుండొచ్చు. షాపు బయటి పాత్రలతో ఒకరకమైన సస్పెన్స్, లోపలి పాత్రలతో ఇంకో సస్పెన్స్ తో- రెండంచుల కత్తిలా కథ. 

        ఇంటర్వెల్ మలుపుని  కూడా నరాలు బిగబట్టుకుని చూడాల్సి వస్తుంది. మిడిల్. ఎండ్ రెండు విభాగాలూ కలిపి గంటన్నర సేపు వూపిరిసల్పని సస్పెనుతో కదలకుండా కూర్చో బెట్టేస్తుంది. మన దగ్గర ఇంకా ఎలా ఉంటుందంటే- ప్రేమ కథల్లో, కుటుంబ కథల్లో  సస్పన్స్ అంటే – అది యాక్షన్ సినిమాల వ్యవహారం- మనం దెబ్బతింటాం అనుకుని, అవే సరుకు లేని డ్రామాలు తీస్తూ పోతారు. ప్రసుత రామాయణంలో ఎవరూ హత్య చేయలేదు, ఇంకే నేరమూ చేయలేదు- అచ్చమైన  కుటుంబ కథే ఇది. కుటుంబ కథలో తటస్థించిన ఒకానొక దురదృష్టకర ఘట్టం. దీన్ని సస్పెన్స్ థ్రిల్లర్ గా చెప్తే ఏం కొంపలు మునిగాయి.  ‘మన ఊరి రామాయణం- మనలోని రామాయణం’ అంటూ పాట ద్వారా వెల్లడయ్యే మానసిక లోకపు కల్లోలం. దీనికి పరిష్కారంతో సైకో థరఫీ. ఇంతకనే శాస్త్రీయ స్క్రిప్టు ఏముంటుంది?

        ఇందులో సినిమా దర్శకుడు పోగొట్టుకునే స్క్రిప్టు కూడా ప్లాట్ డివైస్ గా కథ నడుపుతుంది. చివరి దృశ్యంలో నటులు పృథ్వీ- ప్రియమణిలతో ఈ స్క్రిప్టు ఒక అందమైన ముగింపు నిస్తుంది. హార్రర్ కామెడీలూ, ఇంకేవో యాక్షన్ సినిమాలూ పక్కన పెడదాం కాస్సేపు- నిత్య జీవితంలో మన కెదురయ్యే ఘట్టాలు మన చేతల వల్ల  ఎంత సస్పెన్స్ లో పడి ప్రాణాలు తోడేస్తాయో - కల్తీలేని ఈ అచ్చ కుటుంబ కథలో చూసి జీవిత కాలం నెమరేసుకోవచ్చు. షరతు ఏమిటంటే, ఈ సినిమా కెళ్తే పాప్ కార్న్ కాకుండా స్వీట్ కార్న్ తినాలి.


-సికిందర్