రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

13, సెప్టెంబర్ 2017, బుధవారం

513 : డార్క్ మూవీస్ స్క్రీన్ ప్లే సంగతులు - 16

    సీను చేసే పనులు రెండు అని చెప్పుకున్నాం. ఒకటి,  పాత్ర గురించి కొత్త విషయాలు చెప్పడం; రెండు, సీనుని ముందుకి నడిపించడం. పాత్ర గురించి పది విషయాలు చెప్పినా ఫర్వాలేదు. ఎందుకంటే వాటి బిజినెస్ సీనుని  ముందుకి నడిపించడం కాదు. సీనుని ముందుకి నడిపించడానికి కథకి సంబంధించిన సమాచారమే కావాలి. ఈ సమాచారం సీను కొక్కటి మాత్రమే వుండాలి. రెండు మూడు సమాచారాలిస్తే సీను ఎటు పోవాలో అర్ధం కాదు. సొనాలిక ఫోన్ చేసి మాయాంక్ తో- వచ్చేటప్పుడు నీ సర్టిఫికెట్లు పట్రా  – అంటే, తర్వాతి సీన్లో మాయాంక్ సర్టిఫికేట్లతో  రావడానికి ఇది లీడ్ లేదా సమాచారమవుతుంది. తర్వాతి సీనులో  సర్టిఫికెట్లతో వస్తే ఏం జరుగుతుందోనన్న ఆసక్తి ఏర్పడుతుంది. ఇలాకాక సర్టి ఫికెట్లు, కాఫీ పౌడరు, సపోటాలు పట్రా అంటే, మర్చిపోయా- అగ్గిపెట్టె కూడా కావాలి- అంటే  సర్టిఫికెట్ల ప్రాధాన్యం తగ్గిపోతుంది. తర్వాతి సీను దేని గురించో కూడా స్పష్టత వుండక ఆసక్తి కల్గించదు. ఆసక్తి కల్గించే దృష్టితోనే సమాచారమివ్వాలి, అదీ పాయింటెడ్ గా ఒకే సమాచార  మిచ్చినప్పుడే ఆసక్తి పుట్టిస్తుంది. ఐతే ఒక్కోసారి సీనులో రెండేసి సమాచారాలు కూడా వుంటాయి. ఈ రెండేసి  సమాచారాలు సీను సాదాగా వుండకుండా, మలుపులు (ట్విస్టులు) సృష్టించడానికి ఉపయోగ పడతాయి. అంతిమంగా బాబు లాంటి ఒక్క సమాచారమే సీనుని ముందుకి నడిపిస్తుంది. అంటే మొదటి సమాచారాన్ని తలదన్నేట్టు రెండో సమాచారం ట్విస్టు ఇవ్వాలన్న మాట. ఇది  ‘బ్లడ్ సింపుల్’  లో ఎలా ప్లే అయిందో చూద్దాం!


          ‘బ్లడ్ సింపుల్’ గత సీనులో  విస్సర్ ఫోటోలనికాలుస్తున్నప్పుడు సిగార్ లైటర్ ని వెతుక్కుని కంగారు
పడ్డంలో పెద్ద బ్లండర్ వుంది గమనించారా? మనకి చూపించిన ప్రకారం అతను మార్టీ ని షూట్ చేసిప్పుడు లైటర్ ని ఆ నేర స్థలంలోనే టేబుల్ మీద మర్చిపోయాడు. అందుకే లైటర్ ఇప్పుడు జేబుల్లో  లేదు. మరి ఇక్కడ ఫోటోలని ఎలా కాలుస్తు
న్నట్టు? 

          ఇలాటి బ్లండర్ ఇంకొకటి, మార్టీ ‘చనిపోయాక’ రే బార్ కొచ్చి హెడ్ లైట్స్ ఆఫ్ చేయకుండా కారుని పార్క్ చేసిన సందర్భంలో గమనించాం. సీనులో ఒక మిర్రర్ ఎఫెక్ట్ కోసం లాజిక్ ని అలా త్యాగం చేశారు. కారు హెడ్ లైట్స్ తో అంత బాహాటంగా  కొట్టొచ్చినట్టూ వుంటే, అప్పుడు బార్ కొచ్చిన మారీస్ అది చూడకుండా వుంటాడా? చూడనట్టే చూపించారు. ఇలాటి లాజికల్ బ్లండర్స్  మామూలు ఫార్ములా థ్రిల్లర్స్ లో చెల్లిపోవచ్చు గానీ, ప్రొఫెషనల్ గా  వుండాల్సిన డార్క్ మూవీస్ లో పంటికింద రాయిలా వుంటాయి.

          సరే, విస్సర్ కి లైటర్ లేదని తెలిసింది. పరుగెత్తాడు. ఈ సీనులో సమాచారమేమిటి? లైటర్ మిస్ కావడమే. అంటే తర్వాతి సీన్లో వెళ్ళాల్సిన చోటికి వెళ్లి వెతుక్కుంటాడన్న మాట. ఆ సీను మార్టీ ఆఫీసులో వుండదు, ఎందుకంటే లైటర్ అక్కడ మర్చిపోయాడని అతడికి తెలీదు. ఐతే ఈ లైటర్ లేకపోవడం గమనించడానికంటే ముందు, మార్టీ  కవర్లో ఫోటో పెట్టకుండా చేసిన మోసం అతడికి తెలిసింది. ఇది ఈ సీనులో ముందు దొర్లిన సమాచారం. దీని ప్రకారం ఈ సీను అప్పుడే మార్టీ ఆఫీసులో ఫోటో వెతుక్కునే సీనుకి దారితీయాలి. అయితే అంతలో లైటర్ మిస్సయిందనే ఇంకో సమాచారం బయటపడింది. ఇది ముందు సమాచారాన్ని తలదన్నే రెండో సమాచారం. మొదటి సమాచారానికి ట్విస్టు ఇచ్చింది. ముందు సమాచారంతో ఫోటో ఎక్కడుందో విస్సర్ కి తెలుసు. మార్టీ ఆఫీసుకి వెళ్లి దాన్ని తొలగించగలడు. అది సమస్య కాదు. కానీ లైటర్... లైటర్ ఎబ్బీ బ్యాగులో పడిపోయి వుంటుంది!  ఎబ్బీ బ్యాగులో తను రివాల్వర్ ని దొంగిలిసున్నప్పుడు పొరపాటున అందులో లైటర్ పడిపోయివుంటుంది. ఆమె గనుక చూస్తె కొంపలంటుకుంటాయి, బ్యాగులో రివాల్వర్ లేకపోవడం, లైటర్ వుండడం తన మెడకి చుట్టుకుంటాయి. 

          ఇలా మొదటి సమాచారానికి రెండో సమాచారం ట్విస్టు ఇవ్వడంతో ఈ ఒక్క సమాచారంతో అతను పరిగెత్తాడు.

30. ఎబ్బీ బ్యాగులో విస్సర్ లైటర్ వెతకడం
         ఇలా రాశారు : పైన లయబద్ధంగా తిరుగుతున్న సీలింగ్ ఫ్యాను శబ్దం. టిల్ట్ డౌన్ చేస్తే రే ఫ్లాట్ లో లివింగ్ రూమ్.  

          ఫోర్ గ్రౌండ్ లో చైర్ లో టెలిఫోన్ వొళ్ళో పెట్టుకుని,  డో ర్ వైపు తిరిగి కూర్చుని వుంటాడు విస్సర్.  డోర్ ఓపెనై వుంటుంది. టేబుల్ మీద ఎబ్బీ బ్యాగులోని వస్తువులన్నీ చెల్లా చెదురుగా పడుంటాయి. ఆమె పర్సు వుండదు. ఒక క్షణం తర్వాత విస్సర్ లేచి ఆ వస్తువులన్నీ తిరిగి  బ్యాగులో పడేస్తూ వుంటాడు.

          ఇదీ సీను.  పైన సీలింగ్ ఫ్యాను తిరుగుతూ వుండడం వెనుక సీనులో ఫోనులో ఎబ్బీ విన్న శబ్దానికి అర్ధం. విస్సర్ వొళ్ళో టెలిఫోన్ అతనే ఫోన్ చేశాడనడానికి నిదర్శనం. బ్యాగులో వస్తువులన్నీ చెల్లా చెదురుగా పడి వుండడం అతను లైటర్ కోసం వెతికేశాడనడా నికి తార్కాణం. 

          సీను గమ్మత్తుగా భూతకాలంలో వుంది. సీను ఓపెనై విస్సర్ లైటర్ని వెతుక్కుంటూ కూర్చునే వర్తమాన కాలంలో లేదు. సీనులో జరగాల్సిందంతా ఆల్రెడీ జరిగిపోయింది. స్పిరిట్యువల్ మీనింగ్. కాలానికి కాలాల్లేవు. ఏకకాలంలో అన్నీ జరిగిపోతాయి. మనకి జరిగినవీ, జరగాల్సినవీ అన్నీ ఆల్రెడీ ఏకకాలంలో జరిగిపోయి వుంటాయని శాస్త్రవేత్త  ఆల్బర్ట్ ఐన్ స్టీన్ కూడా అంటాడు. 

          సిడ్ ఫీల్డ్ కూడా అంటాడు, సీను చివర్లో ఎంటరై చప్పున బయటికి వచ్చేయమని. దెబ్బకి సీను ఖతం. సినిమా కళలో మనకి తెలియని కోణాలెన్నో వున్నాయి. ఇంకే కళ లోనూ ఇన్నిన్ని కోణాలుండవు. 

          ఈ సీనులో సమాచారం లైటర్ మీద ఇక ఆశ వదులుకున్నాడని. ఇది అతడి ఫేసు చూస్తేనే తెలుస్తుంది. ఇక వెనుక సీనులో సెకండరీ సమాచారం ప్రకారం ఫోటో కోసం మార్టీ బార్ కి వెళ్ళడమే మిగిలింది...


(సశేషం)

(యూనివర్సిటీ ఆఫ్ హోస్టన్ స్కూల్ ప్రాజెక్టు కోసం విద్యార్ధులు ఎనాక్ట్ చేసిన ‘బ్లడ్ సింపుల్’ లో విస్సర్ మార్టీని చంపే దృశ్యం కోసం  ఇక్కడ క్లిక్ చేయండి 

-సికిందర్
         





 


              




512 : స్పెషల్ ఆర్టికల్

        తెలుగు సినిమాల కర్తలు ఒక విచిత్రమైన – కొంపలు ముంచుకునే  కమ్యునికేషన్ గ్యాప్ తో హాయిగా గడిపేస్తున్నారు. దేశంలో లేదా రాష్ట్రంలో  ఏ పరిణామం సంభవించినా సినిమాలకది  శాశ్వత కమర్షియల్ ముడి సరుకవుతుందని సంబరపడి  సినిమాలు నిర్మించేస్తున్నారు. మాసి పోయిన పరిణామాలు ఇంకా సమసిపోని బాక్సాఫీసు దినుసులే అనుకుంటూ అహోరాత్రాలు కష్టపడిపోతున్నారు. వాటిని సజీవంగా వుంచడానికి పదుల కోట్ల రూపాయలు పణంగా పెడుతూ ప్రతిష్టాత్మకంగా ఫీలవుతున్నారు. తీరా బాక్సాఫీసు ఇస్తున్న సందేశాలు చూసి లబోదిబోమంటున్నారు. బాక్సాఫీసు ఎప్పుడూ వర్తమానంలో వుండి,  రియల్ టైం ఫలితాలనే అందిస్తుందనీ,  ‘The Power of Now’ ని ఎత్తిచూపుతుందనీ తెలుసుకోలేక పోతున్నారు. బిజినెస్ అంటే ప్రేక్షకుల మార్కెట్ అని కాక, బిజినెస్ అంటే బయ్యర్లే అనుకుంటున్నారు. మార్కెట్ యాస్పెక్ట్ అనే ఒక నిర్లక్ష్యం చేస్తున్న పదాన్ని అర్ధంజేసుకోలేక, క్రియేటివ్ యాస్పెక్ట్ లకి పాల్పడుతున్నారు. మార్కెట్ యాస్పెక్ట్ లేని క్రియేటివ్ యాస్పెక్ట్ ఎందుకూ కొరగాదని తెలుసుకోలేకపోతున్నారు. పూర్తిగా ప్రేక్షకులతో, సమాజంతో, దేశంతో సంబంధాలు తెగిపోయిన కూపస్థ మండూకపు కళలు పోతున్నారు. ఇలా కఠినంగా చెప్పాల్సి వస్తున్నా చెప్పక తప్పడంలేదు. సినిమాలు  తీయడానికి నక్సలిజాన్ని వాడుకోవడం అయిపోయింది, ఫ్యాక్షనలిజాన్ని అరగదీయడం అయిపోయింది, మాఫియాయిజంని  అడపాదడపా సానబట్టడం జరుగుతోంది; నక్సలిజానికీ, ఫ్యాక్షనలిజానికీ  కాలదోషం పట్టిందని వదులుకున్న ప్రాప్త కాలజ్ఞత, మాఫియాయిజంతో కలగడం లేదు. సరే, మాఫియాలు ఎప్పుడూ వుండే అసాంఘీక శక్తులే అనుకుందాం, బాలీవుడ్ దీన్ని వాడుకోవడం ఎప్పుడో మానేసింది.  తీస్తే గీస్తే  గతంలో కి వెళ్లి ‘ఒన్స్ అపాన్ ఎ టైం....’ బాపతు  గతకాలపు మాఫియా వ్యవహారాలు  తీస్తున్నారు.  రెండు వారాల క్రితం విడుదలైన ‘డాడీ’ 1980 లనాటి ముంబాయి డాన్ అరుణ్ గావ్లీ కథే. ఇక ప్రత్యేక శ్రద్ధ తీసుకుని తనకంటూ ప్రియమైన  తెలుగు మాఫియాల్ని సృష్టించుకుని, మూవీ మేకింగ్ మేడీజీ చేసుకున్న పూరీ జగన్నాథ్ కూడా తన కెరీర్ ని ‘నిల్లేరు’ మీద నడకలా ఫీలవుతున్న చారిత్రక సందర్భంలో, ఇంకోపక్క ఇంకొందరు ఆరిపోయిన టెర్రరిజపు నిప్పుల్ని రాజేస్తున్నారు. దీపపు పురుగుల్లా అందులోపడి ఆహుతైపోతున్నారు. ఇదీ ఇప్పటి సమస్య!

         
టెర్రరిజం ఆరిపోయిన నిప్పా? ఆరిపోయిన నిప్పే కాశ్మీర్ ని వదిలేసి. దేశంలో నగరాల మీద జరిగిన టెర్రర్ దాడుల్లో 2013 లో హైదరాబాద్ దిల్ సుఖ్ నగర్ దాడి చిట్ట చివరిది. ఆ తర్వాత జరుగుతున్నవన్నీ కాశ్మీర్ లోనే. ‘రా’ వెబ్సైట్, ‘ఎన్ ఐ ఎ’ వెబ్సైట్ ఇది చెప్తాయి. నిన్నటికి నిన్న ‘టైమ్స్ నౌ’ బయట పెట్టిన టేపుల్లో కాశ్మీర్ నాయకుడి ప్రగల్భాలు చూస్తే, వాళ్ళ లక్ష్యం సిరియా ఐఎస్ తో కలిసి కాశ్మీర్ ని ఇస్లామిక్ రాజ్యంగా మార్చడమే. ఇందుకే గత కొంత కాలంగా కాశ్మీర్ కే పరిమితమవుతున్నాయి దాడులు. అమెరికా ప్రభుత్వం విడుదలచేసిన ఒక రిపోర్టులో,  2016 లో పాకిస్తాన్ లో కంటే ఇండియాలో ఎక్కువ దాడులు జరిగాయని పేర్కొంది. అదీ కాశ్మీర్, ఛత్తీస్ ఘర్, ఝార్ఖండ్, మణిపూర్ లలో. మావోయిస్టు దాడుల్ని కూడా కలిపి ఈ రిపోర్టు ఇచ్చింది. ఛత్తీస్ ఘర్, ఝార్ఖండ్, మణిపూర్ లలో మావోయిస్టు దాడుల్ని తీసేస్తే, టెర్రర్ దాడులు జరిగింది ఒక్క కాశ్మీర్ లోనే.

          ఈ పరిస్థితుల్లో ఇంకా 2013 నాటి దిల్ సుఖ్ నగర్ బాంబు పేలుళ్ళ మీదే  గ్లామర్ పెంచునుని నక్షత్రాలూ, యుద్ధం శరణాలూ  తీస్తే ఏమౌతుంది? మూడవుతాయి : ఒకటి - ప్రేక్షకులకి పరమబోరు; రెండు - టెర్రరిస్టులకి పరమానందం; మూడు - ప్రభుత్వానికి పరాభవం. 

          మూడోదే చాలా విచారకరమైనది. సినిమా కర్తల సెన్సిటీవిటీని వెల్లడిస్తుంది. 2014 నుంచి రాష్ట్రాల్లో ఎలాటి దాడులు జరక్కుండా నిఘా సంస్థలూ బలగాలూ కట్టు దిట్టం చేసుకు వస్తూంటే, సినిమాలుతీసి దాడులు చూపించడం ప్రభుత్వం మీద జోకేయడమే అవుతుంది. ఆల్రెడీ విమెన్ సేఫ్టీ విషయంలో పోలీసులకి ఈ పరాభవం ఎదురవుతూనే వుంది. పోలీసులో పక్క స్త్రీల భద్రత కోసం బయటికెళ్ళి నప్పుడు ఫలానా యాప్ వాడండీ, ఈఈ  జాగ్రత్తలు తీసుకోండీ - అని వూర ప్రచారం చేస్తూంటే, ఇదేం పట్టక సినిమాల్లో అజ్ఞానపు హీరోయిన్ పాత్రల్ని సృష్టించి ప్రమాదాల్లోకి నెట్టేయడం చేస్తున్నారు. ఎవేర్నెస్ బదులు పోలీసుల ప్రచారానికి గండి కొట్టడం. ఇది వరకు సినిమాల్లో సామాజిక సృహ అంతగా అవసరపడలేదు. ఇప్పుడు అత్యవసరంగా స్పృహ తెచ్చుకోకపోతే, వ్యతిరేక సంకేతాలివ్వడాన్ని డీఫాల్టు యాప్ గా ఇన్ స్టాల్ చేసుకునే ప్రమాదం వుంది.

          అలాగే ఇంకా బాంబు దాడులు జరిపించి టెర్రరిస్టు కథలతో సొమ్ము చేసుకోవా
లనుకోవడం, ప్రభుత్వాన్ని పరిహసించడమవుతుందో కాదో మైండ్ పెట్టి ఆలోచించాలి. దేశభక్తి నినాదాల వల్ల ఈ పరిహాసం నీరాజనమైపోదు. అయినా సరే పరిహాసం కాదనుకుంటే ఇలాగే మరిన్ని నిరభ్యంతరంగా తీసుకోవచ్చు, ఏం ఫర్వాలేదు. బాక్సాఫీసు చూసుకుంటుంది.  ముందు ఏ విషయం స్పష్టత తెచ్చుకోవాలి.  బాలీవుడ్ కూడా ఈ దాడుల సినిమాలు వదిలేసిందని గుర్తుంచుకోవాలి. 2013 లో వర్మ తీసిన ‘ది ఎటాక్స్ ఆఫ్ టెర్రర్ - 26 /11’ ఆఖరిది. ఆ తర్వాత “పాంథమ్’ (2015), ‘బేబీ’ ( 2015), ‘నీరజ’ (2016) వచ్చాయి. మొదటి రెండూ  విదేశాల్లో టెర్రరిస్టుల్ని పట్టుకోవడం గురించి. రెండోది,  1983  లో అబూ నిదల్ హైజాక్ చేసిన అమెరికా విమానం గురించి.

          అసలు విషయమేమిటంటే,  టీవీ సీరియల్స్ వచ్చేసి ఫ్యామిలీ కథలనే జానర్ ని సినిమాలకి లేకుండా చేశాక, అచ్చమైన ఫ్యామిలీ కథలు ఇక చెప్పలేమని, వాటిని ఫ్యాక్షన్ కథల రూపంలో తీసి తిరిగి ఫ్యామిలీ ప్రేక్షకుల్ని సంపాదించుకోవడం మొదలెట్టారు. ఫ్యామిలీ కథలకి హింసని జోడిస్తే తప్ప ఈ జనాలు చూసేట్టు లేరని అలా ఫ్యాక్షన్ సినిమాలు తీసి తగిన శాస్తి చేయడం మొదలెట్టారు. ఆ సినిమాల్లో అన్నీనరుక్కునే దుర్మార్గుల కుటుంబాల కథలే. ఇవే గొప్ప కుటుంబకథా చిత్రాలుగా తరించారు ప్రేక్షకులు కూడా. రానురాను ఫ్యాక్షన్ కి కాలదోషం పట్టి మాఫియాలు దొరికారు. ఇక మాఫియాల కుటుంబాల కథలు. ఒక మాన మర్యాదలున్న వాళ్ళ కుటుంబ కథలిక లేవ్!  అమాయక ప్రేక్షకులు కూడా మానమర్యాద ల్లేవ్, బొంగూ లేదన్నట్టుగా తయారయ్యారు.ఇలా వుండగా దిల్ సుఖ్ నగర్లో ధనా ధనా  బాంబులు పేలాయ్. దీంతో కుటుంబ కథలు దీని మీద పడ్డాయి. కుటుంబ కథ పరాన్న జీవి అయిపోయింది. ఎక్కడ కొత్త హింస వుంటే  అక్కడ దాన్ని పట్టి పల్లార్చడం మొదలెట్టింది. 

          ఇంతే గానీ, ఈ బాంబు దాడులతో సందేశాలిచ్చేదేమీ వుండదు. కుటుంబ కథలకోసం కరివేపాకులా వాడుకోవడమే. అయితే దారుణంగా ఇవే అట్టర్ ఫ్లాపవుతున్నాయి. ఇలాటిదే ఇంకో టెర్రర్ కథ (దీంట్లో కుటుంబ కథలేదు)  మూడేళ్ళుగా నలుగుతోంది. ఇప్పుడుదాన్ని మార్చాలని, ఇప్పుడున్న పరిస్థితులతో అప్ డేట్ చేసుకోవాలని చెప్పి చేయందించినా, బావిలోంచి పైకి రాలేని పరిస్థితి –  ఫ్లాపైన ‘నక్షత్రం’, ‘యుద్ధం శరణం’ టైపులోనే  ఆలోచనలు!



-సికిందర్ 
https://www.cinemabazaar.in

12, సెప్టెంబర్ 2017, మంగళవారం

511 : స్పెషల్ ఆర్టికల్





      నిర్మాతలకి కథలు విన్పించే ముందు, ఒకటికి రెండు సార్లు క్రాస్ చెక్ చేసుకుని విన్పించక పోతే త్రిశంకు స్వర్గంలో పడతారు. ఏ నటీనటీనటులకో, టెక్నీషియన్లకో, మిత్రులకో   విన్పించి క్రాస్ చెక్ చేసుకుంటే సరిపోదు. కథల మీద అవగాహన వుండే రచయితలకో, దర్శకులకో విన్పించుకోవాలి. సమస్య – దాని సాధన- పరిష్కారం నిర్దుష్టంగా వున్నాయని ధృవీకరించు కున్నాకే నిర్మాతలకి విన్పించేందుకు అడుగెయ్యాలి. నిర్మాతలతో మూడు జరగవచ్చు :  కథ అసలు నచ్చక పోవచ్చు, నచ్చి కొన్ని మార్పులుసూచించ
వచ్చు, నచ్చిఉన్నదున్నట్టు ఓకే చేయవచ్చు. మొదటి రెండిటితో పేచీ లేదు. నచ్చకపోతే చేసేదేం లేదు, నచ్చి మార్పులు సూచిస్తే ఇష్టముంటే వాటికి అంగీకరించవచ్చు – లేకపోతే  నో  చెప్పేసి వెళ్లిపోవచ్చు. వీటితో సమస్య లేదు. సమస్యల్లా మూడో దాంతోనే. 


          సొంతంగా రాసేసి, ఏ క్రాస్ చెక్ చేసుకోకుండా నమ్మేసి,  నిర్మాతకి  విన్పిస్తే  – ఆ నిర్మాతకి ఉన్నదున్నట్టు ఆ కథ నచ్చేసి, ఓకే చెప్పేశాక – అదే కథని ఇంకెవరికో విన్పించినప్పుడు, అందులో పెద్ద పెద్ద సుడిగుండాలు వున్నాయని  క్రాస్ చెకింగ్ లో బయటపడితే, అప్పుడు సదరు రచయిత పరిస్థితి / దర్శకుడి దుస్థితి ఏమిటి?

          కుమారి 21 ఎఫ్ లో పాటలాగా – కథని  సరిదిద్ది నిర్మాతకి చెప్పాలా వద్దా? చెప్పాలా వద్దా? చెబితే మొదట చెప్పినప్పుడు కథతో కలిగిన ఇంప్రెషన్ వుంటుందా పోతుందా?  వుంటుందా పోతుందా? ఛత్, వున్నదున్నట్టే తీయాలని ఆయనంటే  హిట్టవుతుందా అవదా? హిట్ట వుతుందా అవదా? అసలు నిర్మాత డిస్టర్బ్ అయి వుంటాడా వదులుకుంటాడా? వుంటాడా వదులుకుంటాడా? ఇలావుంటుంది పరిస్థితి. 

          ఇలాటి కేసులు తరచూ తగుల్తున్నాయి ఈ వ్యాసకర్తకి. ఇలాంటప్పుడు చివరిదే జరిగే అవకాశా లెక్కువ వుంటాయి. నిర్మాత డిస్టర్బ్ అయి సెట్ అయిన ప్రాజెక్టు ఇక వుండకుండా పోతుంది. ఒకవేళ గుట్టు చెప్పకుండా ముందు చెప్పిన కథతో అలాగే ముందు కెళ్తే నిర్మాత డబ్బు నష్టపోవడంతోబాటు, సదరు దర్శకుడు లేదా రచయిత కేరీర్ ని కోల్పోతాడు. ఇలా చేయడం కూడా మనస్కరించదు. త్రిశంకు స్వర్గంలో వూగిసలాడుతూంటారు.

          అందుకే ముందే క్రాస్ చెక్ చేసుకోవడం మంచిదనేది. చాలా మందికి చెప్పి క్రాస్ చెక్ చేసుకున్నాం,  వాళ్ళు బావుందన్నారు అంటే,  ఎవరు వాళ్ళు?  అనే ప్రశ్న వస్తుంది. కథలతో సంబంధం లేనివాళ్ళతో క్రాస్ చెకింగ్ కరెక్టేనా? తెలిసిన దర్శకుడికో,  రచయితకో విన్పిస్తే సరయిన ఫీడ్ బ్యాక్ వచ్చే అవకాశముంటుంది. ప్రేమలో త్యాగం ఉదాత్తమైనదని చెప్పడం ముగింపు అనుకుందాం. ఈ ముగింపు సీన్లకి సృష్టించిన డ్రామాకి, ఫీల్ కి పడిపోయి కథలతో సంబంధం లేని వాళ్ళంతా బావుంది బావుంది అన్నారనుకుందాం. ఓ నిర్మాతకి చెబితో  ఆయన కూడా ఆ ముగింపుకే  ఫ్లాట్ అయిపోయి ఓకే చేశానుకుందాం -  తీరా ఇంకో క్రాస్ చెకింగ్ లో ఆ ముగింపులో చేసిన త్యాగంలో  స్వార్ధం, క్రౌర్యం, పరిహాసం వగైరా వగైరా నెగెటివిజాలు ఎన్నో కనబడుతున్నాయని లాజికల్ గా తేలితే?  ఇది కరెక్టే అని తన కామన్ సెన్సుకే ఇప్పుడనిపిస్తే అప్పుడేమిటి? ఏం చేయాలి? ముగింపులతోనే కాదు, కథా నడకలతో, హీరోగారి పోకడలతో, ఇంకా చాలాచాలా వాటితో ఇలాటి పరిస్థితులు ఎదురవుతున్నాయి.

          నిర్మాత చేత ఆఫీసుకూడా ప్రారంభించి,  తీరా కథలో కృష్ణ బిలాలున్నాయని బయటపడితే, ఆఫీసు వుంటుందా పోతుందా అని పీడకలలతో గడపడం భావ్యమేనా?  దీనికి పరిష్కారమేమిటి? ఒక్కటే మార్గం :  ఒకసారి సొంతంగా రాసుకుని నిర్మాతని ఒప్పించుకున్నాక ఇంకెవరికీ విన్పించుకోవద్దు. క్రాస్ చెకింగ్ జోలికిపోవద్దు. అప్పుడు కనీసం నిర్మాతని వంచిస్తున్నామనే గిల్టీ ఫీలింగ్ వుండదు. అజ్ఞానమే చాలా మనశ్శాంతినిస్తుంది. కాబట్టి ఎవరి సహకారం లేకుండా కథ రాసేసుకుని నిర్మాతని ఒప్పించాక, ఇక అందులో లోపాలెన్నే ప్రయత్నం చేయకూడదు. తీర్పుని బాక్సాఫీసుకే వదిలెయ్యాలి. 

          ఇంకో ఝలక్ కూడా ఇచ్చుకుంటున్నారు నిర్మాతలకి. నోటి దూలతో ఝలకానందాన్ని తీర్చుకుంటున్నారు. నల్గురితో కూర్చుని పర్ఫెక్ట్ కథ తయారుచేసుకుని నిర్మాతకి విన్పిస్తే –చాలా బావుందయ్యా దీన్ని టేకప్ చేస్తానని ఆయన అంటే, వెంటనే ఆ మాట పట్టుకుని ముందు కెళ్ళాలా? లేదు, నోటి దూల అలా చేయనివ్వదు. సార్ , ఇంకో వెర్షన్ కూడా వుందండీ, అది ఈ టైపులో వుంటుంది...అని మొదలెడితే, తలుపు తట్టిన అదృష్టం వుండేనా పోయేనా? ఈ ఝలక్ తో ఆ నిర్మాత - అది రేపు వింటా - అంటాడు. ఆ రేపు ఇక రాదు. ఓకే చేసిన వెర్షన్ కూడా ముందుకు పోదు. 

          నువ్వు రాసిన మొదటి ప్రతి షిట్ అన్నాడు సోమర్సెట్ మామ్. దాన్నుంచి వచ్చిన మేలు ప్రతి ఓకే అయ్యాక, షిట్ లాంటి చిత్తు ప్రతితో నిర్మాత టేబుల్ ని అశుద్ధం చేయమేమిటి?

          సినిమాలంటే క్రియేటివిటీ ఒక్కటే కాదు, సేల్స్ మాన్ షిప్ కూడా. ఇది లేకపోతే  క్రియేటివిటీ లేదు, దాని పిల్లా పాపలూ లేవు.


-సికిందర్




         
         
         
         


9, సెప్టెంబర్ 2017, శనివారం

509 : రివ్యూ!

ర్శత్వం : జి. ప్రజిత్
తారాగణం : అల్లరి రేష్, నిఖిలా విమల్, అవరాల శ్రీనివాస్, హైపర్ ఆది,త్యం రాజేష్ప్రకాష్, తులసి, సుధ, దితరులు
కథ - స్క్రీన్ ప్లే : వినీత్ శ్రీనివాసన్, మాటలు : చంద్రశేఖర్
సంగీతం :
 షాన్ రెహమాన్, ఛాయాగ్రహణం : ఉన్ని ఎస్‌.కుమార్
బ్యానర్ :
 జాహ్నవి ఫిలింస్, నిర్మాత : బొప్ప చంద్రశేఖర్
విడుదల : సెప్టెంబర్ 8, 2017

***
        అల్లరి నరేష్ అపజయాల బాట పట్టి ఆరేళ్ళయ్యింది. 2012 లో ‘సుడిగాడు’ తర్వాత సుడి లేకుండా పోయింది. బిగ్ స్టార్స్ కూడా సినిమాల్లో ఫస్టాఫ్ కామెడీలు చేయడానికి కేటాయించుకోవడంతో,  తన ఏకైక కామెడీ హీరోగిరీకి  ప్రమాదం వచ్చి పడింది. జంధ్యాల, ఈవీవీ ల్లాగా కామెడీలు తీసే దర్శకులు లేకపోవడంతో, నరేష్ నటిస్తున్న  సినిమాలు అల్లరైపోసాగాయి. తెలుగులో కామెడీ దర్శకుల లోటు ఎంత వుందో వరసగా ఫ్లాపైన  అల్లరి నరేష్ పన్నెండు సినిమాలని చూస్తే చాలు. 

         
పరిస్థితుల్లో అటు మలయాళ తీరంనుంచి ఋతుపవనాలు వచ్చినట్టు ప్రజిత్ వచ్చి వాలిపోయాడు. నరేష్ మారిపోయాడు. రొటీన్ ప్రేమలు, పాటలు, పేరడీలు, టెంప్లెట్ కామెడీలు తీసి అవతల పెట్టి,  మనసున్న కామెడీ చేసుకుందామని, సైబర్ నేరగాళ్ళ సమస్యని కాస్త సెన్సిబుల్ గా చెబుదామని ‘మేడ మీద అబ్బాయి’ గా దిగాడు. 

          ఒక రొటీన్ కి అలవాటయ్యాక వెంటనే మార్పు ఆకట్టుకోదు. అందులోనూ మలయాళ వెరైటీ ఏదోగా అన్పిస్తుంది. పైగా దర్శకుడు కూడా మలయాళీ. అయినా సరే, సీరియస్ గా ఇన్వాల్వ్ చేసి వాస్తవికతకి దగ్గరగా సింపుల్ కామెడీతో తనపని తాను చేసుకుపోతుంది.  ఒక సెల్ఫీ జీవితంలో ఎంత పనిచేస్తుందో మలుపులు తిప్పేస్తూ చెప్పుకు పోతుంది...


కథ 
     చదువంటే  శ్రద్ధ లేని శీను (నరేష్) ఎన్నటికీ గట్టెక్కలేని బీటెక్ బ్యాక్ లాగ్స్ (24) తో వుంటాడు. ఇంకోసారి పరీక్షలు రాసి గోదావరి జిల్లా పల్లెటూళ్ళో ఇంటికొస్తాడు. కిరాణా షాపు నడుపుకుంటూ అప్పుచేసి చదివించినా ప్రయోజకుడు కాని కొడుకు మీద పీకలదాకా వుంటుంది తండ్రి (జయప్రకాష్) కి. తల్లి (తులసి) వెనకేసుకొస్తూంటుంది. మేడ మీద గది వుంటుంది. ఆ గదిలో సెటిలై తిని పడుకోవడం తప్ప ఏమీ చేయడు. తండ్రి తిడుతూంటే ఇక లాభం లేదని, చదువు తనకి అబ్బదని, సినిమా డైరెక్టర్ అవుదామనుకుంటాడు. దాంతో తన దర్జా చూసి తండ్రి గర్వపడతాడనుకుంటాడు. వూళ్ళో  నల్గురు ఫ్రెండ్స్ వుంటారు. వాళ్ళల్లో బండ్ల బాబ్జీ (హైపర్ ఆది), (కార్తీ) సత్యం రాజేష్ లు ముఖ్యులు. వాళ్ళతో ప్లాన్ చేసి షార్ట్ ఫిలిం తీయాలనుకుంటాడు. సినిమాల్లోకి అదొక సర్టిఫికేట్ అవుతుందనుకుంటాడు. ఆ తీసిన షార్ట్ ఫిలిం తాగి ఎంజాయ్ చేస్తూంటే వాగులో కొట్టుకుపోతుంది. అప్పుడు పక్కింట్లో ఒక అందమైన అమ్మాయి సింధు (నిఖిలా విమల్) పేరెంట్స్ తో వచ్చి దిగుతుంది. ఆమె మీద మనసు పారేసుకుంటే  ఛీ కొడుతుంది. అంతలో రిజల్ట్స్ వచ్చి ఫెయిలవుతాడు. దాంతో రైలెక్కి టాలీవుడ్ పారిపోతాడు. అదే ట్రైన్లో  వుంటుంది జాబ్ ఇంటర్వ్యూ కి వెళ్తూ సింధు. ఆమెకి తెలీకుండా ఒక సెల్ఫీ తీసుకుని బండ్ల బాబ్జీకి పంపుతాడు. కానీ వారం పాటు తిరిగినా టాలీవుడ్ లో ఎవరూ గేట్లోంచి రానివ్వరు. తిరిగి ఇంటికొచ్చేస్తాడు. వచ్చేస్తే, సింధుని ఏం చేశావని  వూళ్ళో జనం తిరగబడతారు  సెల్ఫీ చూపించి. ఆమె అదృష్యంతో తనకేం సంబంధం లేదన్నా విన్పించుకోరు, తండ్రి గెంటేస్తాడు.

          సింధు ఏమయ్యింది? ఆమెతో  తనకెలాంటి సంబంధం లేదని శీను ఎలా నిరూపించుకున్నాడు? సింధు అసలు కథ ఏమిటి? హైదరాబాద్ లో ఒక ప్రైవేట్ డిటెక్టివ్ యుగంధర్ (అవసరాల శ్రీనివాస్) సాయంతో ఆమెని పట్టుకుని శీను తెలుసుకున్న రహస్యాలేమేమిటి? ఆమె శీనుకి దక్కిందా లేదా? ...ఇవన్నీ తెలియాలంటే వెండి తెరని ఆశ్రయించాల్సిందే. 

ఎలావుంది కథ 
        మలయాళ ‘ఒరు వడక్కం సెల్ఫీ’  కి రీమేక్. ఫేస్ బుక్  లాంటి సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ లో వర్చువల్ స్నేహలతో అవతలి వ్యక్తుల్ని నమ్మి మోసపోయే అమ్మాయిలకి ఓ విన్నపం చేసే కథ. రాద్ధాంతం చెయ్యకుండా సింపుల్ గా, వాస్తవికంగా  చేప్పే కథ. ఒకప్పుడు కలం స్నేహాలుండేవి. అప్పుడు లేని అనర్ధాలు ఇప్పుడు బాగా జరుగుతున్నాయి ఆన్ లైన్ స్నేహాలతో, ప్రేమలతో. ఇది స్థూలంగా కామెడీ కథలా అన్పించినా, జానర్ మిక్స్ చేసిన కామిక్ – రోమాంటిక్ – థ్రిల్లర్. సున్నిత హాస్యమే దీని బలం. 2015 లో మలయాళంలో పెద్ద హిట్టయిన కథ. 

ఎవరెలా చేశారు  
     అల్లరి నరేష్ మారిపోయాడు. సినిమాతోనే కాదు, శరీరంతో కూడా. బరువు పెరిగి మొహంలో ఆకర్షణ తగ్గింది. అర్జెంటుగా బరువు తగ్గాల్సి వుంటుంది. ఇలాగే బొద్దుగా వుంటే కామెడీ హీరో లుక్ పోయి, రాముడు మంచి బాలుడు టైపుకి  సర్దుకోవాల్సి వస్తుంది. ఈ తరహా పాత్ర, సినిమా తనకెంత మేలు చేస్తుందో చెప్పడం కష్టమే. కానీ కీడు మాత్రం  చేయదు. అయితే ఈమధ్య  తన సినిమాలు చూడ్డం మానేసిన ఫ్యామిలీలు విశేష సంఖ్యలో దీనికి రావడం,ఇబ్బంది పడకుండా చూడడం ఒక విజయమే. కామెడీ కైనా క్వాలిటీని నమ్ముకుంటే ప్రయోగాలు  చేయడం సమస్యనిపించుకోదు. అన్నితరగగతుల ప్రేక్షకులు మారుతున్నారు. కృత్రిమ ఫార్ములా సినిమాలు ఇంకెన్నాళ్ళు చూస్తారు. నరేష్ చేసిన ఇంకోమంచి పని, ఒరిజినల్ దర్శ కుడీకే ఈ రీమేక్ ని అప్పగించడం. 

          హీరోయిన్ నిఖిలది ఒక సమస్యతో సైలెంట్ గా వుండే పాత్ర. ఉండుండి ఆ మౌనం బ్రద్దలయ్యే చివరి దృశ్యాలతో తారాస్థాయికి చేరింది. ఆన్ లైన్లో ప్రేమించిన వాడితో చివరిదాకా ఆమె విశ్వాసం అతి పెద్ద సస్పెన్స్ థ్రిల్లర్ నే, మిస్టరీనే క్రియేట్ చేస్తుంది. మలయాళంలో సినిమాలు వూహించుకుని పాత్రల్ని దిగుమతి చేసుకోరు. చుట్టూ ఎవడేం చేస్తున్నాడో  కనిపెట్టి సినిమాల్లో పెట్టేస్తారు. అందుకే సినిమాలు కల్తీ లేని కల్ట్ సినిమాలు. 

          మూడో పాత్ర హైపర్ ఆదిది. ఇతను లేకుండా సినిమాని వూహించడం కష్టమే. వండర్ఫుల్ కమెడియనితను. చివరి దాకా ఒక్కో డైలాగుకి అందరూ నవ్వడమే. పైకొస్తాడు. అవసరాల శ్రీనివాస్ డిటెక్టివ్ యుగంధర్ పాత్ర పోషించాడు. అసలు డిటెక్టివ్ పాత్రే తెలుగు సినిమాల్లో వుండదు, మలయాళ దర్శకుడు కాబట్టి తెలుగులోకి కూడా తేగలిగాడు. ఈ పాత్ర కొంత హాస్యాన్ని జోడించి పోషించాడు శ్రీనివాస్. ఈ పాత్ర కూడా సస్పెన్స్ పాత్రే. చివర్లోగానీ తెలియదు అసలు ఇతనెవరో.

          ఇంకా జయప్రక్షాష్, తులసి, సుధా, సత్యం రాజేష్ తడితులన్దరివీ సహజ పాత్రలే. మాటలో చేతలో ఫార్ములా డ్రామాల్లేవు, కృత్రిమత్వం లేదు.

          ఈ సినిమా ఒరిజినల్లోని ఫ్రేముకి ఫ్రేము, డైలాగుకి డైలాగు పక్కా అనుసరణే. కెమెరా వర్క్, లొకేషన్స్ చాలా పోయెటిక్ గా వున్నాయి –చిత్రీకరణలో  వెలుగు నీడల పోషణతో. ఆరోగ్యకరమైన హాస్యంతో క్రియేటివ్ డైలాగులు -  విసుర్ల రూపంలో తెగ నవ్విస్తూంటాయి. మలయాళంని తెలుగు చేసిన డైలాగ్ రైటర్ చంద్ర శేఖర్ పైకొస్తాడు - టెంప్లెట్ డైలాగులు సినిమాలకంటూ పెట్టుకున్న మసాలా డైలాగులూ  రాయకుంటే.
          ప్రజిత్ దర్శకత్వం ఉన్నతంగా వుంది.

చివరైకేమిటి?
      కామెడీగా మొదలై, మిస్టరీగా మారి, సస్పన్స్ థ్రిల్లర్ గా సాగే, ముగిసే, సజాతి జానర్ల వాడకం ఈ సాదా కథని నిలబెట్టింది. హీరో హీరోయిన్ల మధ్య ఎక్కడా ప్రేమ వుండదు. ఆమె దొరికాక, ఆమె సమస్య తీర్చడానికి తను – డిటెక్టివ్ – ఫ్రెండ్ – చేసే ప్రయాణం సెకండాఫ్ సగం నుంచి ఒకెత్తు. కథ ఒక్కో పొర విప్పుకుంటూ, కొత్త విషయాలు కలుపుకుంటూ,  ఆద్యంతం కదలకుండా కూర్చోబెడుతుంది. దీనికి ఉప కథలు అవసర పడలేదు. అతి పెద్ద రహస్యమంతా చివర్లో ఓపెనవుతుంది. పూర్తిగా కంటెంట్ ఓరియెంటెడ్ ఎంటర్ టైనర్ ఇది. లవ్, పాటలు, డాన్సులు, ఫైట్లు, వూర కామెడీ మాస్ డైలాగులు, వేషాలూ  కోరుకునే వాళ్ళకి ఇది నచ్చక పోవచ్చు.


-సికిందర్
cinemabazaar.in




         



         


         

         


8, సెప్టెంబర్ 2017, శుక్రవారం

508 : రివ్యూ!

ర్శత్వం: కృష్ణ మారిముత్తు
తారాగణం: నాగచైతన్య, లావణ్యా త్రిపాఠీ, శ్రీకాంత్, రావు మేష్, రేవతి, మురళీశర్మ, ప్రియర్శి, వివర్మ దితరులు
కథ –స్క్రీన్ ప్లే : డేవిడ్ ఆర్. నాథన్, మాటలు : అబ్బూరి రవి, సంగీతం
: వివేక్ సాగర్. ఛాయాగ్రహణం: నికేత్ బొమ్మిరెడ్డి
బ్యానర్ : వారాహి చిత్రం, నిర్మాత: నీకొర్రపాటి
విడుదల : సెప్టెంబర్ 8, 2017

***

        ‘జోష్’ తో మొదలు పెడితే,  ‘దాదా,  ‘బెజవాడ’, ‘ఆటోనగర్ సూర్య’ ,  ‘దోచేయ్', 'దడ',  ‘సాహసం శ్వాసగా సాగిపో’....అంటూ నాగచైతన్య యాక్షన్ సినిమాలతో చేస్తున్న విశ్వప్రయత్నాలు ఇప్పుడు ‘యుద్ధం శరణం’ దగ్గరికొచ్చాయి. ఇక్కడితో స్వామి శరణం అనుకుని ఆపేస్తే మంచిదేమో  ఆలోచించుకోవాల్సిన బాధ్యత అతనిపైనే వుంది. తమిళం నుంచి దర్శకుడు, రచయితా వచ్చిందే స్వామిశరణం  అన్పించడానికి అయివుండొచ్చు. దర్శకుడు క్లాస్ మేట్  అయినంత మాత్రాన యుద్ధం శరణం శివోహం అన్పిస్తాడని అన్పించడం లేదు. 

          మొన్నే విడుదలైన కృష్ణ వంశీ ‘నక్షత్రం’ వుండగా, ఇప్పుడు అలాంటిదే  ‘యుద్ధం శరణం ‘ ఏమవసరం. కృష్ణవంశీ తన లాంటిదే తీస్తున్నారని నాగ చైతన్యకి ఎలా తెలుస్తుం దనొచ్చు. దేశంలో ఏం జరుగుతోందో తెలుసుకోని వాళ్ళంతా ఒకరికి తెలీకుండా ఒకరు పోటీలు పడి ఒకలాగే వుండే సినిమాలు ఇలాగే తీసేసి తర్వాత తెల్లబోతారు. దేశంలో టెర్రర్ దాడులు  జరగడం ఆగిపోయాయని కృష్ణ వంశీ తెలుసుకోకుండా మరో చాట్ భండార్ పేలుళ్లతో చుక్కలు చూపించినట్టే, నాగచైతన్య కూడా అదేబాటలో లేని  మహా యుద్ధం చేశారు. ఈ యుద్ధం చేసి  పర రాష్ట్రాల్లో శరణు జొచ్చేలా చేశారు ప్రేక్షకుల్ని. నాగచైతన్య మరో యాక్షన్ మూవీతో వస్తే తెలుగు రాష్ట్రాలు విడిచి వెళ్ళిపోతారు ప్రేక్షకులు. 

          ఇంతకీ ఏమిటీ ‘యుద్ధం శరణం’?  మళ్ళీ హైదరాబాద్ నగరంలో పాత పేలుళ్ళ కథనే ఎలా తీశారు? ఏ కొత్తదనం చూపించారు?  కొత్త తమిళ దర్శకుడు దర్శకత్వంలో చూపిన ప్రతిభ ఏమిటి? నాగచైతన్య నటనలో మార్పేమిటి? లావణ్యా
త్రిపాఠీ ఎందుకుంది? ఇవన్నీ తెలుసుకుందాం....

కథ 
       అర్జున్ (నాగ చైతన్య) ఉద్యోగం చేయకుండా స్వయంకృషితో ఒక గాలిలో ఎగిరే డ్రోన్ ని తయారు చేస్తూంటాడు. డాక్టర్ లయిన అతడి తల్లిదండ్రులు (రావురమేష్ – రేవతి) పేదలకి వైద్యం చేస్తూ మంచి పేరు తెచ్చుకుంటారు. అర్జున్ కి ఇద్దరు అక్కా చెల్లెళ్ళు కూడా వుంటారు. ఇలా వుండగా, అర్జున్ పేరెంట్స్ దగ్గర అంజలి (లావణ్యా త్రిపాఠీ ) వచ్చి ట్రైనింగ్ లో చేరుతుంది. ఆమెని ప్రేమిస్తాడు అర్జున్. ఈ విషయం పేరెంట్స్ కి చెప్పాలనుకుంటాడు.

          ఒక మఫియా నాయక్ (శ్రీకాంత్) వుంటాడు. ఒక మంత్రి ( వినోద్ కుమార్ ) వుంటాడు. ఇతను బాగా స్కాములు చేసి ఇరుక్కునే పరిస్థితి వస్తుంది. దృష్టి మళ్ళించడానికి నాయక్ తో కలిసి నగరంలో బాంబు దాడులు జరిపిస్తాడు. ఆ రాత్రే సినిమా కెళ్ళిన అర్జున్ పేరెంట్స్  శవాలై దొరుకుతారు. చూస్తే బాంబు దాడుల్లో చనిపోయినట్టు వుండరు. అసలేం  జరిగింది? వీళ్ళు ఎలా చనిపోయారు? ఎవరు చంపారు? ఎందుకు చంపారు? అనేవి మిగతా కథకి దారి తీసే ప్రశ్నలు. 

ఎలావుంది కథ?
     కథలా లేదు. చెన్నై పారిస్ సెంటర్ పరోటాలా కూడా లేదు. అన్నిటికీ మించి నిర్మాత కొర్రపాటి కానుకలా లేదు. ఈ సంవత్సర
మంతా ఇలాటి రివెంజి కథలే. దీనికి అదే బాంబు దాడులు తోడయ్యింది. ఇవ్వాల్టి వార్త రేపుండని రోజుల్లో ఇంకా ఐదేళ్ళ నాటి నగర బాంబు దాడుల కథలతో ఇంకేం చెప్పాలనుకుంటున్నారో తెలీదు. దీనికి పరిష్కారం కూడా చంపడమే. చంపడం ఈ సమస్యకి శాశ్వత పరిష్కారం కాదు. అందుకే ఇంకిన్ని ఇలాటి కథలు పుట్టుకొస్తు
న్నాయి. ఇంకెవరైనా ఈ బాంబు దాడుల కథతో తీస్తే, ఒక శాశ్వత పరిష్కారమార్గం చూపిస్తే - ఈ కథలతో సినిమాలు తీసి చేతులు కాల్చుకోవడం ఇంకాగిపోతుంది. సమస్య శాశ్వత పరిష్కారం రేంజికి చేరింతర్వాత,  ఇంకొకరు ఇంకో పరిష్కారం చెప్పే అవకాశం వుండదు. కథల మీద పురాణాల ప్రభావం చాలా వుంటుంది. కానీ పురాణాలని తప్పుగా అర్ధంజేసుకుని ఒక సామాజిక సమస్యకి చంపడమే పరిష్కారమనుకుంటే మాత్రం, ఇక చెల్లుబాటయ్యే పరిస్థితిలేదు.

ఎవరెలా చేశారు
       నాగచైతన్య చాలా కష్ట పడ్డాడు. సెకండాఫ్ లో ఒఠ్ఠి యాక్షన్ సీన్సులో వూపిరి తీసుకోకుండా పోరాటాలు చేసేందుకు  ఫస్టాఫ్ లో పూర్తిగా విశ్రాంతి తీసుకున్నాడు. ఆంధ్రా  వెళ్ళే బస్సులో కోదాడలో రెండో డ్రైవర్ నిద్ర లేచి డ్యూటీ ఎక్కినట్టు, నాగచైతన్య  సెకండాఫ్ కి ఫ్రెషప్ అయ్యాడు. అసలు ఫస్టాఫ్ లో కన్పించింది తనేనా అని డౌటు. అంత పేలవంగా ఎలా వుంటాడు హుషారైన నాగచైతన్య?  పాత్రలో దమ్ములేకపోతే ఇంతే. పాత్రకి బాక్సాఫీసు అప్పీల్ వుందా? ఎంత సేపూ పేరెంట్స్ కథే అయిపోతే, ఇక యూత్ అప్పీల్ - బాక్సాఫీసు అప్పీల్ ఏమైపోతాయి. ఈ రోజుల్లో ముసలి వాళ్ళయిన పేరెంట్స్ కథ ఎవరిక్కావాలి? ‘చుక్కల్లో చంద్రుడు’, ‘కొంచెం ఇష్టం- కొంచెం కష్టం’ లతో అనుభవమయ్యిందిగా?  హీరోయిన్ తో హీరో గ్లామరస్ గా వుండే కథ కావాలి. బాంబు దాడుల్లో హీరోయిన్ మిస్సయితే ఆ హీరోయిన్ కోసం పడే తపనలోనే  అన్ని అప్పీల్స్ వుంటాయి బాబూ!  సెకండాఫ్ లో హీరోయిన్ ని పూర్తిగా పక్కన పడేసి, ఇంకా చనిపోయిన పేరెంట్స్ ఫ్లాష్ బ్యాకులే వేసుకుంటూ కూర్చుంటే థియేటర్లో ఎవరు కూర్చుంటారు. పైగా అక్కా చెల్లెళ్ళని కాపాడే గొడవే అయిపోతే, అది కమర్షియల్ పాత్రెలా అయింది?  ఫ్యాన్స్ ని కూడా ఏం మెప్పించింది? ఎన్ని పిడివాదాలు చేసినా కమర్షియల్ సినిమా కథంటే హీరో హీరోయిన్ల కథే! 

          నాగచైతన్యకి కథ మీద అవగాహన లేకపోయినా, కనీసం పాత్ర కమర్షియల్ గా లేదని అర్ధంజేసుకుని తిప్పికొట్టినా ఇంత నిరాశ ఎదురయ్యేది కాదు. ఇక హీరోయిన్  లావణ్యా
త్రిపాఠీ పాత్రకే దిక్కులేదు, కొన్ని షాట్స్ లో ఆమె నోరు తెరచి ఏదో అనే లోపే  బ్యాడ్ ఎడిటింగ్ చేసి నోర్మూయించారు. తమిళ కమర్షియల్(? ) దర్శకుడికి హీరో హీరోయిన్లు అస్సలు పట్టలేదు- ఎంత సేపూ పేరెంట్స్ పాత్రల్లో రావు రమేష్, రేవతిల తెచ్చిపెట్టుకున్న ఆనంద డోలికలతోనే వుయ్యాలూ
గడం సరిపోయింది. పక్క వాద్యాలుగా పనీపాటా లేనిఅక్కా చెల్లెళ్ళు. 

            మాఫియాగా శ్రీకాంత్ ప్రత్యేకతేం లేదు, శాడిస్టు గెటప్ తో ప్రత్యేకతలేం వుంటాయి. ఇది ఆయనకి తెలియంది కాదు. కాకపోతే విలన్ గా వేసి చాలా కాలమవడంతో ఇదే కొత్తగా అన్పించి వుంటుంది. ఈ మధ్య  ఎన్ఐఏ పాత్రలు కొత్త ఫ్యాషన్ అయిపోయాయి. వాళ్ళ అధికార పరిధులేమిటో  వాళ్ళకే తెలీక సందట్లో సడేమియాలాగా సినిమా అంతా తిరిగే పాత్ర లు. ఈసారి  సీబీఐ జేడీ లక్ష్మినారాయణ,  మురళీ శర్మ రూపంలో ఎన్ఐఏ జేడీ శాస్త్రిగా మారిపోయారు. ఈ శాస్త్రి గారి దర్యాప్తేమిటో, మతలబు ఏంటో మనకసలేం అర్ధంగాదు. ఈయన పక్క అసిస్టెంటుగా ఆశ్చర్యపోతూ వుండే రవివర్మ! 

          పాటలు, ఛాయాగ్రహణం, ఇతర సాంకేతిక విలువల గురించి చెప్పుకోవడాని కేం లేదు. సెకండాఫ్ దాదాపు అంతా మసక చీకట్లోనే యాక్షన్ దృశ్యాలుంటాయి రిలీఫ్ లేకుండా. 

          దర్శకత్వం పూర్ గా, చాదస్తంగా వుంది. పేలవమైన ఫ్యామిలీ డ్రామా దృశ్యాలు పాత  సినిమల్లోలాగా వుంటాయి. రచయిత  అబ్బూరి రవి లేని కథకి లేపనాలు పూసి బలవంతంగా, అయిష్టంగా మాటలు రాసినట్టు తెలిసిపోతూంటుంది. ఇక ‘జంటిల్ మేన్’  అనే  సినిమాకి కథ  అందించిన డేవిడ్ ఆర్. నాథన్ రాసిన కథ, దానికి తయారు చేసిన స్క్రీన్ ప్లే అనే పదార్ధం తెలుగువాడి పాలిట తీరని శోకంలా వున్నాయి. 

చివరికేమిటి 
      చాలా చైల్డిష్. కనీస ప్రమాణాలతో చూసినా ఏ కోశానా సినిమా అనిపించని అమెచ్యూరిష్  వ్యవహారం. దర్శకుడు నేర్చుకోవా
ల్సింది చాలా వుంది. ఇంటర్వెల్ పడ్డాకైనా కథేమిటో తెలియాలన్న ఓనమాలు తెలీని స్థితిలో వున్నాడు. పేరెంట్స్ ని విలన్ ఎందుకు చంపాడో చెప్పకుండా, ఇంటర్వెల్లో హీరోనీ, అక్కా చెల్లెళ్ళని కూడా ఎందుకు చంపాలని దాడి చేస్తున్నాడో చెప్పకుండా, హీరోకీ ఏ విషయమూ  తెలీక, క్లయిమాక్స్ అంత భారీ స్థాయిలో జరుగుతున్న యాక్షన్ ఎపిసోడ్ మధ్యలో - ఇంటర్వెల్ వేసేసే చమత్కార మేమిటో అర్ధంగాదు.

          బాంబు దాడులు జరిగి, హీరో పేరెంట్స్ ని వెతుక్కోవడంతో కథ మొదలవుతుంది. అతడికి పేరెంట్స్ గుర్తుకు రాగానే ఫ్లాష్ బ్యాక్ లో కెళ్ళి పోతాడు. ఆ ఫ్లాష్ బ్యాక్ లో బోలెడు ఫ్యామిలీ సెంటిమెంట్స్, ఉత్తుత్తిగా నవ్వుకోవడాలూ అయ్యాక, హీరోయిన్  పరిచయం. ఇక ఆమెతో  లవ్ ట్రాక్, పాటలు.  సడెన్ గా ఫ్లాష్  బ్యాక్ లోంచి మళ్ళీ ప్రెజెంట్ కి...మళ్ళీ పేరెంట్స్ ని వెతుక్కోవడం. మళ్ళీ రాఖీ సీనుతో  ఇంకో ఫ్లాష్ బ్యాక్. లవ్...లవ్ కోసం ప్రయత్నాలు...మనకి అర్ధంగాని దేమిటంటే- పేరెంట్స్ ని వెతుక్కునే వాడికి ప్రేమలు ఎలా గుర్తు వచ్చి ఎంజాయ్ చేస్తాడనేది. ఇలా పొంతన లేకుండా వుంటుంది ఫ్లాష్ బ్యాకుల వ్యవహారం. అంటే ఈ కథ  పేరెంట్స్ కథగా  కాకుండా, హీరోయిన్ గురించిన కథ అయివుండాలన్న మాట- అప్పుడు ప్రెజెంట్ టైం కథ, డ్రీం టైం కథా అతికినట్టు వుంటాయి.

          ఇక సెకండాఫ్ లో అంత పెద్ద బాంబు దాడుల సంఘటన పక్కకెళ్ళి పోవడం కూడా జరుగుతుంది. ఇంతా చేసి ఆ పేరెంట్స్ చనిపోయింది బాంబు దాడుల్లో కాదు, వేరే కారణంతో వేరే విధంగా విలన్ చంపాడు. అదేమిటంటే ఒక హత్యని వాళ్ళు కళ్ళారా చూడ్డం. చాలా సిల్లీ. ఇది హీరో అన్వేషించే  మర్డర్ మిస్టరీగా మారుతుంది. ఈ క్రైం స్టోరీ మేనేజి మెంట్ కూడా చైల్డిష్ గా వుంటుంది. ఇలా బాంబు దాడుల కథని కూడా విరిచేసి, అందులోంచి ఇంకో కథని లాగడంతో  అంతా కలగాపులగమైపోయింది. 

          ఇదంతా ఇంత ఖర్చు చేసి సినిమాగా తీయడానికంటే ముందు,  పేపర్ మీదే తెలిసిపోయే జాతకం. నిర్మాత సాయి కొర్రపాటి దీన్ని అర్ధం జేసుకోలేదు.


సికిందర్ 
cinemabazaar.in